మేం వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి, జైళ్లలో ఉండాలి!.



*మేం వచ్చాక రౌడీలు దేశమైనా వదలాలి, జైళ్లలో ఉండాలి!*



*చట్టాలను అతిక్రమించిన వారి భరతం పట్టేందుకే రెడ్ బుక్* 


*నాయకులను తయారుచేసే కర్మాగారం తెలుగుదేశం పార్టీ*


*వైసిపి నేతల భూకబ్జాలు, రెవిన్యూ అక్రమాలపై విచారణ జరిపిస్తాం*


*రాజంపేటను జిల్లా కేంద్రంగా మారుస్తాం... అభివృద్ధికి బాటలు వేస్తాం*


*అన్నమయ్య  డ్యామ్ పునర్నిర్మిస్తాం... బాధితులకు న్యాయం చేస్తాం*


*రాజంపేట యువగళంలో టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్*


రాజంపేట (ప్రజా అమరావతి): చంద్రబాబు గారు అంటే అసాంఘిక శక్తులకు హడల్, రాబోయే ఎన్నికల్లో ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎర్రచందనం స్మగ్లర్లు, గంజాయి, బ్లేడ్ బ్యాచ్ లు, రౌడీలు, దొంగలు దేశం వదిలి అయినా వెళ్లాలి, లేదా జైళ్లలో అయినా ఉండాలి, బయట మాత్రం తిరగలేరని టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ పేర్కొన్నారు. రాజంపేటలో నిర్వహించిన యువగళం సభకు ప్రముఖ యూ ట్యూబ్ ఛానల్ ఆదాన్ జర్నలిస్టు కిషోర్ వ్యాఖ్యాతగా వ్యవహరించారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... రాష్ట్రంలో జగన్ అధికారంలోకి వచ్చాక శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయి, అయిదేళ్లలో 31వేలమంది మహిళలు అదృశ్యమయ్యారు.  ముఖ్యమంత్రి ఏనాడూ పట్టించుకోలేదు. మహిళా హోంమంత్రి  ఉన్నారో, లేదో తెలియదు, గుంటూరు జిల్లాలో రమ్యను ఓ శాడిస్టు చంపితే నేను అక్కడకు వెళ్లాను. జీవితంలో మొదటిసారి స్టేషన్ కు వెళ్లా. జగన్ వచ్చాక  గంజాయి, నాసిరకం మద్యం పెరిగాయి. మొదటి వందరోజుల్లో గంజాయికి ఫుల్ స్టాప్ పెడతాం. గంజాయివల్ల ఒక తరం నాశనమైంది. 2019కి ముంధు నాపై  ఒక్క కేసులేదు. వైసిపి పాలనలో  23కేసులు పెట్టారు. చంద్రబాబుపై తప్పుడు కేసులు పెట్టి 53రోజులు జైల్లో పెట్టారు. సింహం బయటకు వచ్చాక జగన్ ను వేటాడుతోంది, వదిలిపెట్టదు. ఈ లోకేష్ తగ్గేది లేదు. బాంబులకే భయపడని కుటుంబం మాది. చిల్లరకేసులకు భయపడతామా? తండ్రిని అడ్డంపెట్టుకుని నేను సిమెంటు ఫ్యాక్టరీలు, పేపర్, టివిలు పెట్టలేదు. నీతి,నిజాయితీలే మాకు శ్రీరామ రక్ష. అధికారులు రాజ్యాంగ బాధ్యతలను నిష్పక్షపాతంగా అమలుచేయాలి. కొందరు చట్టాలను అధికారపార్టీకి చుట్టంగా మార్చారు. అటువంటి వారికి గుణపాఠం చెప్పేందుకే రెడ్ బుక్ పెట్టా. చట్టాన్ని ఉల్లంగించిన వారిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీ వేసి సర్వీసునుంచి డిస్మిస్ చేస్తాం. చేసిన తప్పుకు జైలుకు పంపి తీరుతాం.  

*నాయకులను తయారుచేసే వర్సిటీ తెలుగుదేశం*

టిడిపి యూనివర్సిటీ లాంటిది. మీడియా ప్రతినిధిని మంత్రి చేశాం.  బిసి కులానికి చెందిన కెఇ కృష్ణమూర్తిని ఉప ముఖ్యమంత్రి చేశాం. సామాన్యుడైన బాలయోగిని లోక్ సభలో లోక్ సభ స్పీకర్ ను చేశాం. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించాం. లీడర్లను తయారు చేసే కర్మాగారం టిడిపి. తెలంగాణాకు ఇద్దరు సిఎంలను ఇచ్చింది టిడిపినే. అన్నగారి నుంచి, బాబు వరకు ఇదే వరవడి కొనసాగిస్తున్నారు. వైసిపిలో కూడా 20శాతం టిడిపివారే ఉన్నారు. ప్రజల తరపున పోరాడిన యువతకు అవకాశాలు కల్పిస్తాం. జగన్ పాలనలో హత్యకు గురైన దళితులకు అధికారంలోకి వచ్చిన వందరోజుల్లో న్యాయం చేస్తాం. జిఓ 77తో  పిజి ఫీ రీఎంబర్స్ మెంట్, స్కూలు ఫీ రీఎంబర్స్ మెంట్ రద్దుచేసి ఇబ్బంది పెడుతున్నారు. పాత ఫీజు రీఎంబర్స్ మెంట్ తెస్తాం. బెస్ట్ ఎవైలబుల్ స్కూల్, విదేశీవిద్య తిరిగి ప్రారంభిస్తాం.

*అన్నమయ్య డ్యామ్ ను పునర్నిర్మిస్తాం*

జగన్ అండ్ కో ఇసుక దాహంతో అన్నమయ్య  డ్యామ్ కొట్టుకుపోయింది. అడ్డగోలుగా ఇసుక దోచేస్తున్నారు. జగన్ ధనదాహంతో 38మంది అమాయకులు బలయ్యారు. నెలలో ఆదుకుంటానన్న జగన్ ఇప్పటివరకు ఒక్కరికి కూడా సాయం అంధించలేదు. మేం అధికారంలోకి వచ్చాక మొదటి వందరోజుల్లో డ్యామ్ బాధితులకు న్యాయం చేస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు పునర్నిర్మాణం చేసి నీళ్లు నిలుపుతాం. అరటిని, కర్జూరాకు గిట్టుబాటు ధర అందిస్తాం. రైతులను ఆదుకుంటాం. కోల్డ్ స్టోరేజి, రైపినింగ్ చాంబర్స్ ను ఏర్పాటుచేస్తాం. ఔత్సాహికులను ప్రోత్సహిస్తాం.  టిడిపి అధికారంలో ఉన్నపుడు డిఎస్సీ ద్వారా32వేలపోస్టులు భర్తీ చేశాం. గత టిడిపి ప్రభుత్వాల హయాంలో 11 డిఎస్సీలతో 1.7లక్షల టీచర్ పోస్టులు భర్తీచేశాం. కాంగ్రెస్, వైసిపి పట్టించుకోలేదు. అవినీతి లేకుండా యూనిఫైడ్ వెబ్ సైట్ తెస్తాం. పారదర్శకంగా పోస్టులు భర్తీచేస్తాం.  పోలవరం ఎపికి జీవనాడి. రివర్స్ టెండరింగ్ పేరుతో సర్వనాశనం చేశారు. పోలవరం ప్రాజెక్టు పూర్తిచేయాల్సి ఉంది. రాయలసీమలో హంద్రీనీవా పూర్తిచేయాలి. పెండింగ్ సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రతి గడపకు తాగునీరు అందిస్తాం. గత ప్రభుత్వ హయాంలో హంద్రీనీవా 90శాతం పూర్తిచేశాం. అధికారంలోకి వచ్చాక చివరి ఎకరం వరకు సాగునీరు అందిస్తాం.  అధికారంలోకి వచ్చాక గతంలో ఇచ్చిన మాట ప్రకారం రాజంపేటను జిల్లా కేంద్రంగా మారుస్తాం.

*కోడికత్తి 2.0 స్పెషల్ గులకరాయి!*

2019లో కోడికత్తి సీనుతో బాబాయి శవం బయటకు వచ్చింది. ఇప్పుడు కోడికత్తి 2.0 స్పెషల్ గులకరాయి వచ్చింది. జగన్ పై రాయివేశారని తొలుత నేను బాధపడ్డా. ముఖ్యమంత్రిపై  ఎవరూ రాళ్లు వేయకూడదు. ఇది స్పెషల్ గులకరాయి. జగన్ తోపాటు వెల్లంపల్లి రెండుకళ్లు, మరో ఇద్దరికి తగిలిందట. జగన్ బస్సు యాత్రలో గాయానికి బ్యాండేజ్ వేశారు. తర్వాత అక్కడ చిన్న మచ్చకూడా లేదు. అది స్పెషల్ గులకరాయి అని అర్థమైంది. ఇప్పుడు నేను భయపడుతున్నా. గులకరాయితో ఎవరి శవం లేస్తుందోనని. హత్యారాజకీయాలను నమ్మొద్దని యువతను కోరుతున్నా. బాబాయిని చంపింది ఎవరు, హుకిల్డ్ బాబాయ్, టివిలో తొలుత గుండెపోటు అన్నారు, తర్వాత గొడ్డలిపోటుగా మారిపోయింది. వివేకం సినిమాలో చార్జిషీటు సేమ్ టు సేమ్ ఉంది. బాబాయిని చంపి చంద్రబాబుపై నెట్టారు. 

*బాబాయిని ఎవరు చంపారో అర్థమైందా?*

 జగన్ ను చూస్తే బిల్డప్ బాబాయి గుర్తొస్తాం. మూడు రాజధానులు, ఇటుకవేయలేదు. 30లక్షల ఇళ్లు అన్నాడు, 3వేలు కట్టలేదు. జగన్ ఐపిఎల్ టీమ్  పెడతారట. దానిపేరు కోడికత్తి వారియర్స్. బ్యాట్స్ మెన్ అవినాష్ రెడ్డి, బెట్టింగ్ స్టార్ అనిల్, అరగంట అంబటి, గంట అవంతి, బూతుల స్టార్ సన్నబియ్యం సన్నాసి, మొత్తం విప్పేసిన గోరంట్ల ఇందులో ఆటగాళ్లుగా పెడితే బాగుంటుంది. ఇలాంటి వాళ్లు చేతిలో మన భవిష్యత్తు పెడతామా, యువత ఆలోచించాలి. చంద్రబాబుపై నిందలు వేశారు. నిజం నిప్పులాంటిది. సునీత రూపంలో బయటకు వచ్చింది. ఇప్పుడైనా ఎవరు చంపారో అర్థమైందా?  చంద్రబాబు ఏనాడూ హత్యారాజకీయాలు, మతఘర్షణలు ప్రోత్సహించలేదు. పిల్లలు బాగా చదువుకుని ప్రపంచంలో తెలుగువారు అగ్రగామిగా ఉండాలనేదే ఆయన ఆకాంక్ష. ఎన్టీఆర్ నుంచి అదే ఆశయంతో పనిచేశారు. టిడిపి పాలనలో పెట్టుబడులు,తెచ్చాం. ఈసారి కూటమిని గెలిపిస్తే కుల,మత,ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి చేస్తాం.

*సొంతవారే నమ్మలేదు...ప్రజలెలా నమ్మాలి?*

బిల్డప్ బాబాయి కొత్తచట్టం తెచ్చారు. మన తల్లిదండ్రులు, తాతలు సంపాదించిన భూముల పట్టాలపై జగన్ ఫోటోలు వేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం ఎంత ప్రమాదమో ప్రజలు ఆలోచించాలి. ఒరిజినల్స్ ఆయన దగ్గర పెట్టుకుని జిరాక్స్ ఇస్తారట. భూ వివాదం ఉంటే అధికారులు తేలుస్తారట. చాలామంది అధికారులు ఎవరు అధికారంలో ఉంటే వారి కొమ్ముకాస్తున్నారు. పేదప్రజల భూములకు సెటిల్ మెంట్ చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన రెండో సంతకంతో ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దుచేస్తాం. జగన్ మీ బిడ్డనని అంటున్నాడు, మీ భూమి నాది అని కొట్టేస్తాడు. అందుకే ఒరిజినల్ ఆయనవద్ద  పెట్టుకొని జిరాక్స్ ఇస్తానంటున్నారు.  సొంత తల్లి,చెల్లెలే ఆయనను నమ్మడంలేదు. అయిదుకోట్ల ఆంధ్రులు ఎలా నమ్మాలి? సొంతవారికి న్యాయం చేయనివాడు, అవమానించినవాడు మనకు న్యాయం చేస్తాడా  ఆలోచించాలి. సిబిఎన్ అంటే బ్రాండ్, జగన్ అంటే జైలు, చంద్రబాబు హయాంలో కియా, హెచ్ సిఎల్, ఫ్యాక్స్ కాన్, జోహో వంటి పరిశ్రమలు వచ్చాయి. జగన్ చూసి అమర్ రాజా, లులూ, హెచ్ఎస్ బిసి, జాకీ పక్కరాష్ట్రానికి పారిపోయాయి. ఎవరినీ వదిలిపెట్టలేదు సైకో జగన్. 2014లో ఎపి విభజన జరిగింది. కట్టుబట్టలతో బయటకు గెంటారు. పాలకులు చెప్పలేదు. సచివాలయం, అసెంబ్లీ హైదరాబాద్ లో ఉంది. 5కోట్ల ఆంధ్రులను ఒప్పించి ఒకే రాజధాని, ఒకేరాష్ట్రమని అమరావతిని ఒప్పించారు. 15లక్షలకోట్లు, 35లక్షల ఉద్యోగాలకు ఒప్పందాలు. కియా, హెచ్ సిఎల్ వంటి 40వేల పరిశ్రమలు, 6లక్షలమందికి ఉద్యోగాలు కల్పించాం.

*ఫ్యాన్ కు కరెంటు షాక్ ఖాయం*

రాజంపేట జోషేవేరు, కడపజిల్లా ఊపే వేరు, ఇక్కడి ప్రజల జోష్ చూస్తుంటే ఫ్యాన్ మాడిమసైపోవడం ఖాయం. మే 13న ఫ్యాన్ కు కరెంటు షాక్ ఇవ్వబోతున్నారు. అన్నమాచార్యలు జన్మించిన నేల ఈ పుణ్యభూమి,సిద్దవటం కోట, చారిత్మాత్మక గండికోట, ప్రఖ్యాతిగాంచిన దర్గా ఇక్కడ కొలువయ్యాయి. మేం అధికారంలో ఉన్నపుడు కడపకు అనేక కార్యక్రమాలు చేశాం. ఒంటిమిట్ట ఆలయాన్ని వందకోట్లతో అభివృద్ధి చేశాం. గండికోటను ఇంటర్నేషనల్ టూరిస్ట్ కేంద్రంగా అభివృద్ధి చేశాం, కడప దర్గాను అభివృద్ధి చేయడమేగాక హజ్ హౌస్ తెచ్చాం. గండికోట ప్రాజెక్టు పూర్తిచేసి పులివెందులకు కూడా నీళ్లిచ్చిన వ్యక్తిని చంద్రబాబు. బాబు ఒక్కటే నమ్ముతారు. ఎన్నికలప్పుడు 3నెలలే రాజకీయాలు, ఆ తర్వాత రాజకీయాలకు అతీతంగా అభివృద్ధి, సంక్షేమం చేస్తారు. 2019లో ఒక్క అవకాశం మాయలో మోసపోయాం. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలో 2.3లక్షల పోస్టులు భర్తీ అన్నాడు. ఒక్క పోస్టు భర్తీచేశాడా? 25కి 25 ఎంపిలు ఇస్తే ప్రత్యేక హోదా తెస్తానన్నారు. 31మంది ఉన్నారు. ఏనాడైనా రాష్ట్రం గురించి పార్లమెంటులో మాట్లాడారా? యువత ఆలోచించాలి. 

*కడప స్టీల్ ప్లాంట్ లో ఒక్క ఇటుక వేశారా?*

గత ఎన్నికల్లో కడప జిల్లాలో అన్ని స్థానాల్లో వైసిపిని గెలిపించారు. ఉమ్మడి కడపకు ఒక్క కంపెనీ, ఒక్క ఉద్యోగం తెచ్చారా? కడప స్టీల్ ప్లాంట్ లో ఒక్క ఇటుకవేశారా? నాడునేడు రాయలసీమకు అండగా నిలబడింది టిడిపి. పాదయాత్ర సమయంలో మిషన్ రాయలసీమ పేరుతో డిక్లరేషన్ ఇచ్చా. హార్టికల్చర్ హబ్ గా రాయలసీమను తీర్చిదిద్దుతాం, ప్రతిగడపకు పైప్ లైన్ ద్వారా కుళాయి నీరిస్తాం. కడపను స్పోర్ట్స్ సిటీగా తీర్చిదిద్దుతానని ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉన్నాం. యువగళం పాదయాత్రలో కడప ప్రజలు కష్టాలు నేరుగా తెలుసుకున్నా. ప్రజల కష్టాలు తీర్చేందుకే చంద్రబాబు, పవనన్న సూపర్ 6 హామీలు ఇచ్చారు. ప్రజాప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మొదటి సంతకం మెగా డిఎస్సీపైనే. 5సంవత్సరాల్లో 20లక్షల ఉద్యోగాలు కల్పిస్తాం. ఉద్యోగాలు వచ్చేవరకు ప్రతినెలా 3వేల నిరుద్యోగ భృతి ఇస్తాం, ప్యూన్ నుంచి గ్రూప్ వరకు యూనిఫైడ్ వెబ్ సైట్, నోటిఫికేషన్ తెస్తాం. యువతకు ఉద్యోగాలు కల్పించే లక్ష్యంతో పనిచేస్తాం.

*ఆంధ్రులారా మేలుకోండి...ఇంకెన్నాళ్లు వలసబతుకులు?*

కడపసాక్షిగా ఎపి ప్రజలకు పిలుపునిస్తున్నా. మేలుకోండి ఆంధ్రులారా! ఎన్నాళ్లు ఉద్యోగాల కోసం పొరుగురాష్ట్రాలకు వలస వెళ్లాలి. మనకు పౌరుషం లేదా, ఆత్మగౌరవం లేదా, పరిశ్రమలు తెచ్చుకోలేమా, 63సంవత్సరాలు కష్టపడి హైదరాబాద్ ను అభివృద్ధి చేసుకున్నాం. ఆ చరిత్రను తిరగరాసేదానికే అమరావతి రాజధానిగా ప్రకటించాం. టిడిపి హయాంలో సాగు,తాగునీటి ప్రాజెక్టులు, పెట్టుబడులు తెచ్చాం. నేను యువగళంలో ఎక్కువ నడిచింది రాయలసీమలోనే. కియా, టిసిఎల్ ఎదుట సెల్ఫీ ఛాలెంజ్ విసిరాను. జగన్ ఒక్క కంపెనీ అయినా తీసుకువచ్చారా అని సవాల్ విసిరా. అక్కడ నుంచి సౌండ్ రాలేదు. జగన్ పనైపోయింది. జరుగు జగన్, వచ్చేది కూటమి ప్రభుత్వమే. రాష్ట్ర సమగ్రాభివృద్దికి కులం, మతం పక్కనబెట్టి కూటమి అభ్యర్థులను గెలిపించండి. వైసిపి నాయకులకు తెలిసింది ఒక్కటే కులం, మతం, ప్రాంతం పేరుతో చిచ్చుపెట్టడం. సిఎఎపై దుష్ప్రచారాన్ని నమ్మవద్దు. మన ఓటుపైనే మన భవిష్యత్ ఆధారపడి ఉంది. అందరూ గర్వపడేలా రాజధాని నిర్మాణం, రాష్ట్రమంతా సమగ్రాభివృద్ధి చేస్తాం. మీ ఆలోచనలు ఏమిటి తెలుసుకోవడానికి వచ్చాను. జగన్ లా పరదాలు కట్టుకుని తిరగాలని నాకు లేదు.

*పరిశ్రమలకు కులం రంగు రుద్దుతున్నారు*

5కోట్ల ఆంధ్రులు తెలుసుకోవాలి. జగన్ వచ్చాక పరిశ్రమలకు పార్టీ పేర్లు రుద్దుతున్నారు. అమర్ రాజా బ్యాటరీ అత్యధిక పన్ను కట్టే కంపెనీ. జయదేవ్ టిడిపి ఎంపిగా ఉన్నారని వేధించి పొల్యూషన్, లేబర్ డిపార్ట్ మెంట్ తో దాడులు చేయించి ఇబ్బందిపెట్టారు. దాంతో అమర్ రాజా విస్తరణ ప్లాంటు తెలంగాణాకు వెళ్లింది. 20వేల ఉద్యోగాలు వెళ్లిపోయాయి. టిడిపి అధికారంలో ఉండగా భారతి, సాక్షి, సాండూర్ పవర్ జోలికి వెళ్లామా? పార్టీలకు అతీతంగా రాష్ట్రాభివృద్ధి, ఉపాధి కల్పనే బాబు లక్ష్యం. జగన్ పిపిఎలు రద్దుచేశారు, క్వారీ ఓనర్లు, మైన్ ఓనర్ల నుంచి పాపాల మిధున్ రెడ్డి మైన్లు కూడా లాక్కున్నారు. దీనివల్ల నష్టపోయింది ఎపి యువత. ఇలాంటి పరిస్థితుల్లో ఎవరు వచ్చి ఎపిలో పెట్టుబడి పెడతారు. అయిదేళ్లలో ఒక్క పరిశ్రమ రాలేదు. అందుకే ఫ్యాన్ కు కరెంటు షాక్ ఇవ్వాలి. మన ప్రభుత్వం వస్తుంది. ఎంఎస్ ఎంఈలకు సబ్సిడీలు ఇస్తాం. జగన్ వచ్చాక వంద సంక్షేమాలు రద్దుచేశారు జగన్. ఆపేసిన సంక్షేమపథకాలు ప్రారంభించే బాధ్యత తీసుకుంటాం. అందులో భాగంగా అన్నా క్యాంటీన్లు తెరిపిస్తాం.

*భూకబ్జాలు, రెవిన్యూ అక్రమాలపై విచారణ*

వైసిపి నాయకులు యథేచ్చగా భూకుంభకోణాలు చేస్తున్నారు. అబ్దుల్ సలామ్ భూమి సండే ఎమ్మెల్యే లాక్కున్నారు. దాంతో ఆయన కుటుంబంతో ఆత్మహత్య చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అనేక ఘటనలు జరిగాయి. అధికారంలోకి వచ్చాక భూకబ్జాలు, రెవిన్యూ అక్రమాలపై ఎంక్వయిరీ వేస్తాం, బలవంతం భూములు లాక్కున్న వారిపై చర్యలు, వాస్తవదారులకు అందజేసే బాధ్యత తీసుకుంటాం. రాబోయేది డబుల్ ఇంజన్ ప్రభుత్వం, అహర్నిశలు కష్టపడి 20లక్షల ఉద్యోగాలు తెస్తాం. జగన్ విధ్వంసక పాలనలో వెళ్లిపోయిన పరిశ్రమలను బతిమాలి తిరిగి పెట్టుబడులను ఎపికి తెచ్చి యువతకు ఉద్యోగాలు, ఉపాధి కల్పిస్తాం. స్థానికంగానే యువతకు ఉద్యోగాలిస్తాం. చంద్రబాబు హయాంలో షామి ఫోన్, కియా, అపోలో టైర్స్, హీరో, ఏసియన్ పెయింట్స్, బర్జర్ పెయింట్స్ మేడిన్ ఎపి. అయిదేళ్లలో ఎన్నో పరిశ్రమలు తెచ్చాం. 

*అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి*

అరాచక ప్రభుత్వం పోవాలంటే కూటమి ఎంపి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్యే అభ్యర్థిగా సుబ్రహ్మణ్యంను గెలిపించాలి. అప్పుడే నియోజకవర్గం, రాష్ట్రం అభివృద్ధి చెందుతాయి. 2014లో మేం అధికారంలోకి వచ్చాక ఈ ప్రాంతంలో వేలకోట్లతో అభివృద్ధి చేశాం. అయినా ప్రజలు వైసిపిని గెలిపించారు. భూకబ్జాలు చేస్తూ కొండలు, గుట్టలు, శ్మశానాలు కొట్టేస్తున్నారు. కబ్జాదారుగా పేరొందిన ఆకేపాటి అమర్ నాథ్ రెడ్డికే మళ్లీ జగన్ టిక్కె ట్ ఇచ్చారు. ఈసారి ఆయనను గెలిపిస్తే మన ఇంటిపైన ఉన్న కప్పు కూడా పీక్కెళతారు. రాత్రికిరాత్రి భూములు లాక్కుంటారు. అది ఆగాలంటే సుబ్రహ్మణ్యంను భారీ మెజారిటీతో శాసనసభకు పంపిండి. ఎంపి అభ్యర్థిగా కిరణ్ కుమార్ రెడ్డి పోటీచేస్తున్నారు. ఆయన హయాంలో కౌలు రైతులకు చట్టాన్ని తెచ్చారు. ఆ చట్టాన్ని ఆదర్శంగా మేం తీసుకుంటాం. మంచి ఆలోచనలను ఉన్నవ్యక్తి. పరిశ్రమలు, పెట్టుబడులు తెచ్చే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి. పాపాల మిథున్ రెడ్డిని 2 సార్లు గెలిపించారు. ఒక్క పరిశ్రమ తెచ్చారా, ఉద్యోగాలు ఇచ్చారా. మన కోసం పనిచేసే కిరణ్ కుమార్ ను గెలిపించాలని విజ్ఞప్తిచేశారు. రాజంపేట టిడిపి అభ్యర్థి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. నేను అభ్యర్థిగా వచ్చిన 30రోజుల్లో చంద్రబాబు ఇక్కడకు వచ్చి రాజంపేటను జిల్లా కేంద్రం చేయిస్తానని హామీ ఇప్పించాను. జిల్లా కేంద్రం రాకుండా చేసిన వ్యక్తి స్థానికుడా, నేను స్థానికుడినా? రాజంపేట ఆకాంక్షలను అసెంబ్లీలో విన్పించి జిల్లా కేంద్రం చేయిస్తాను. రాజంపేటలో మెడికల్ కాలేజి కూడా మంజూరు చేయిస్తాం. రాజంపేట అసెంబ్లీ అభివృద్ధికి కట్టుబడి ఉంటా. టిడిపి అజెండా అమలుచేస్తాను… ఈ ఎన్నికల్లో నన్ను ఆశీర్వదించాలని కోరారు.


Comments