*ఇన్ సర్వీస్ రిజర్వేషన్ విషయంపై ఆందోళన చేస్తున్న పీహెచ్సీ డాక్టర్లు వెంటనే విధుల్లో చేరాలని ప్రభుత్వ సూచన*
*ప్రజారోగ్యం నిత్యావసర సేవల( ఎస్సెన్షియల్ సర్వీసెస్) పరిధిలోకి వస్తుంది*
*పీహెచ్సీ డాక్టర్ల డిమాండ్లపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది*
*ప్రజారోగ్య పరిరక్షణ ప్రభుత్వం, డాక్టర్ల సమిష్టి బాధ్యత*
*పీహెచ్సీ డాక్టర్ల సంఘానికి కమీషనర్ లేఖ*
అమరావతి, సెప్టెంబర్ 20 (ప్రజా అమరావతి);
శుక్రవారం నుండి పీజీ వైద్య విద్యలో ఇన్ సర్వీస్ రిజర్వేషన్ కు సంబంధించి పీహెచ్సీ డాక్టర్లు తమ ఆందోళన కార్యక్రమాల్ని తిరిగి ప్రారంభిస్తామంటూ పిహెచ్సీల డాక్టర్ల సంఘం అధ్యక్షుడు డాక్టర్ యూనస్ మీర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి శ్రీ ఎం.టి.కృష్ణబాబుకు గురువారంనాడు రాసిన లేఖకు ప్రభుత్వం సవివరంగా స్పందించింది. ఈ మేరకు ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ కమీషనర్ సి.హరికిరణ్ డాక్టర్ యూనస్కు నేడు లేఖ రాసారు. ప్రధానంగా...ప్రజారోగ్య సేవలు నిత్యావసర సేవలైనందున ఆందోళన చేస్తున్న పీహెచ్సీల డాక్టర్లందరూ వెంటనే విధుల్లో చేరాలని సూచించారు.
*ఈ లేఖలోని ఇతర ప్రధాన అంశాలు*
1) పీహెచ్సీల డాక్టర్ల సంఘం అధ్యక్షుడు తమ లేఖలో వాడిన భాష, ఆందోళ కార్యక్రమాల పునఃకొనసాగింపు ప్రతిపాదన ఈనెల 18న ఆరోగ్య శాఖామంత్రి శ్రీ సత్యకుమార్ యాదవ్ ఆధ్వర్యంలో గత గురువారం నాడు రెండు గంటల పాటు జరిగిన చర్చల స్ఫూర్తికి విరుద్ధంగా ఉంది.
2) పీహెచ్సీల డాక్టర్ల ఆశలు, ఆకాంక్షలు, డిమాండ్లను సుదీర్ఘంగా విన్న తర్వాత వారి కోరికల మేరకు జీఓ 85ను సవరిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. రిజర్వేషన్ విషయంతో పాటు, గతంలో అపరిష్కృతంగా ఉన్న పలు ఇతర డిమాండ్లపై మంత్రి స్పష్టమైన హామీ ఇచ్చారు.
3) మంత్రి హామీల నేపథ్యంలో పీహెచ్సీల డాక్టర్లు సమ్మె విరమించుకుని విధుల్లో చేరాలని మంత్రి కోరారు.
4) తాజాగా పీహెచ్సీ డాక్టర్ల సంఘం వైఖరి ఆ స్ఫూర్తికి పూర్తి విరుద్ధంగా ఉంది.
5)ఇన్ సర్వీస్ రిజర్వేషన్ విషయాన్ని చర్చల ద్వారా త్వరలో పరిష్కరించుకుందామని మంత్రి చెప్పినా పీహెచ్సీ డాక్టర్లు భిన్న వైఖరిని అవలంభించడం సమంజసం కాదు.
6) పీహెచ్సీ డాక్టర్లు శ్రమతో ప్రజారోగ్య పరిరక్షణకు చేస్తున్న కృషికి గుర్తింపుగా ఆరోగ్య శాఖా మంత్రి ఎంతో విశాల హృదయంతో సమస్యల పరిష్కారానికి ముందుకొచ్చి జీఓ 85ను సవరించడానికి అంగీకరించారు.
7) కోవిడ్ సమయంలో తామెంతో శ్రమించామంటూ లేఖలో పీహెచ్సీ డాక్టర్ల సంఘం చేసిన ప్రస్తావనకు స్పందిస్తూ...2018-22 కాలంలో ఇన్ సర్వీస్ రిజర్వేషన్ కు నిర్దిష్టమైన కోటా లేదని, సేవలందించిన కాలం ఆధారంగా వెయిటేజీ మార్కుల ఆధారంగా పీజీ విద్యలో ప్రవేశాలు జరిగాయని హరికిరణ్ స్పష్టం చేశారు.
8) ఇన్ సర్వీస్ రిజర్వేషన్ డిమాండ్ పరిష్కారానికి రెండు విడతల చర్చలు జరిగాయని, ఈ ప్రక్రియను కొనసాగించి తుది నిర్ణయం తీసుకోవడం సమంజసం
9) ప్రస్తుత వర్షా కాలంలో భారీ వర్షాలు, వరదల వల్ల పలు ప్రాంతాల్లో సీజనల్ మరియు కీటక జనిత వ్యాధులు ప్రబలుతున్నాయని, ఈ సమయంలో ప్రభుత్వ వైద్యులు ప్రజలకు అండగా ఉండాలి.
10) ఈ నేపథ్యంలో తిరిగి ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్న పీహెచ్సీ వైద్యులు వెంటనే తమ విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆశిస్తోంది.
addComments
Post a Comment