*మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం*
*అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్, గ్యాస్ ఫైప్ లైన్ల ఏర్పాటుకు ప్రణాళికలు*
*మార్చిలోగా డెవలప్మెంట్ ప్లాన్ పూర్తి చేయాలని అధికారులకు మంత్రి లోకేశ్ ఆదేశం*
*మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధి పనులపై మంత్రి నారా లోకేష్ సమీక్ష*
ఉండవల్లి, జనవరి 03 (ప్రజా అమరావతి): మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ నూతన రూపరేఖలు సంతరించుకోనుంది. కార్పొరేషన్ పరిధిలో పలు అభివృద్ధి పనులు చేపట్టడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో చేపట్టనున్న అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ఫైప్ లైన్, గ్యాస్ ఫైప్ లైన్ పనులపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. ఉండవల్లిలోని ఆయన నివాసంలో శుక్రవారం మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ను రాష్ట్రంలో ఉత్తమ మున్సిపాలిటిగా తీర్చిదిద్దాలని అధికారులకు సూచించారు. అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, వాటర్ ఫైప్ లైన్, గ్యాస్ ఫైప్ లైన్ పనుల డెవల్మమెంట్ ఫ్లాన్ను వచ్చే మార్చి నాటికి పూర్తి చేయాలని అధికారులకు స్పష్టం చేశారు. గత ఎన్నికల్లో కార్పొరేషన్ అభివృద్ధికి ఇచ్చిన హామీ నెరవేర్చే దిశగా అడుగులేస్తున్నట్లు తెలిపారు. మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్లో పార్కులు, శానిటేషన్పైనా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. ఇప్పటికే శానిటేషన్ విషయంలో బాగా పనిచేశారని కొనియాడుతూ, ఇదే స్ఫూర్తితో స్వచ్ఛ మంగళగిరిలో భాగంగా పలు పనులు చేపట్టాలని తెలిపారు. అభివృద్ధి పనులు నిర్వహణలో వేగవంతంతో పాటు నాణ్యత ముఖ్యమని స్పష్టంచేశారు. నాణ్యత విషయంలో రాజీపడే ప్రసక్తేలేదని మంత్రి లోకేశ్ స్పష్టంచేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ షేక్ అలీమ్ బాషా, అడిషనల్ కమిషనర్ శకుంతల, డిప్యూటీ కమిషనర్ శ్రీకాంత్, టౌన్ ప్లానింగ్ డిప్యూటీ కమిషనర్ అశోక్, ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment