మార్చి 1 నుండి 20 వరకు ఇంటర్మీడియెట్ పరీక్షలు-విస్తృత ఏర్పాట్లు
• 1నుండి 19 వరకూ ఇంటర్ ప్రధమ,3నుండి 20 వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు
• మార్చి 3 నుండి 15 వరకూ ఎపి ఓపెన్ స్కూల్ సొసైటీ ఇంటర్మీడియెట్ పరీక్షలు
• ఉ.9 గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకు పరీక్షలు
• పరీక్షా కేంద్రాల్లో అవసరమైన కనీస సౌకర్యాలు కల్పనకు ఏర్పాట్లు
• ఫిర్యాదులు స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో కంట్రోల్ రూమ్ నంబరు:1800 425 1531
• జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేయాలి
• పరీక్షల ఏర్పాట్లను సమీక్షించిన సిఎస్ విజాయనంద్
అమరావతి,20 ఫిబ్రవరి (ప్రజా అమరావతి):మార్చి 1వ తేదీ నుండి 20వ తేదీ వరకూ ఇంటర్మీడియెట్ పరీక్షలు జరగన్నాయి.మార్చి 1నుండి 19 వరకూ ప్రధమ సంవత్సర పరీక్షలు,3 నుండి 20 వరకూ ద్వితీయ సంవత్సర పరీక్షలు రోజూ ఉదయం 9గం.ల నుండి మధ్యాహ్నం 12 గం.ల వరకూ జరగనుండగా 26 జిల్లాల్లో 1535 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేయగా మొత్తం 10 లక్షల 58వేల 892 మంది విద్యార్ధులు పరీక్షలు వ్రాయనున్నారు.అదే విధంగా ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటికి సంబంధించిన ఇంటర్మీడియెట్ పరీక్షలు మార్చి 3 నుండి 15వ తేదీ వరకూ జరగనుండగా 325 కేంద్రాల్లో ఈపరీక్షలకు మొత్తం 67వేల 952 మంది విద్యార్ధులు పరీక్షలు వ్రాయనున్నారు.ఈపరీక్షల ఏర్పాట్లపై గురువారం రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ విద్యాశాఖ అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మార్చి-ఏప్రిల్ నెలలు పరీక్షల మాసాలని కావున ఆయా పరీక్షలు సజావుగా సాగేందుకు తగిన విస్తృత ఏర్పాట్లు చేయాలని కలక్టర్లు,ఎస్పిలను ఆదేశించారు.ఈపరీక్షలకు సంబంధించి 1535 కేంద్రాలను ఏర్పాటు చేయగా వాటిలో 68 కేంద్రాలను సెన్సిటివ్,36 కేంద్రాలు వల్నరబుల్ కేంద్రాలుగా గుర్తించడం జరిగిందని అక్కడ గతంలో జరిగిన సంఘటనలను దృష్టిలో ఉంచుకుని కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలని సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
వేసవి దృష్ట్యా ఆయా పరీక్షా కేంద్రాల్లో తాగునీరు,ప్రధమ చికిత్స ఏర్పాట్లు,విద్యుత్,బెంచ్ లు వంటి కనీస సౌకర్యాలు అందుబాటులో ఉండే విధంగా తగిన చర్యలు తీసుకోవాలని సిఎస్ విజయానంద్ కలక్టర్లకు స్పష్టం చేశారు.పరీక్షల సమయంలో పేపరు లీకేజి వంటి వదంతలు తప్పుడు వార్తలు ప్రసారం చేసే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.పరీక్షలను సజావుగా నిర్వహించేందుకు వీలుగా పరీక్షా కేంద్రాలకు 100 మీటర్ల పరిధిలో 144వ సెక్షన్ కింద నిషేధాజ్ణలు జారీ చేయాలని ఆదేశించారు.పరీక్షా కేంద్రాల పరిధిలో పరీక్షల సమయంలో జిరాక్సు కేంద్రాలు,నెట్ కేంద్రాలు మూసి ఉంచేలా చర్యలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.
విద్యాశాఖ కార్యదర్శి కె.శశిధర్ మాట్లాడుతూ ఇంటర్మీడియెట్ మరియు ఎపి ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియెట్ పరీక్షల నిర్వహణకు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. పరీక్షలు జరిగే రోజుల్లో ఆయా పరీక్షా కేంద్రాలకు విద్యార్ధులు సకాలంలో చేరుకునే విధంగా ఆర్టీసీ తగిన బస్సులను నడపాలని చెప్పారు.పరీక్షల నిర్వహణలో ఫిర్యాదుల స్వీకరణకు రాష్ట్ర స్థాయిలో టోల్ ఫ్రీ నంబరు 1800 425 1531 కంట్రోల్ రూమ్ ను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు.అదే విధంగా జిల్లా కేంద్రాల్లో కూడా కంట్రోల్ రూమ్ లను ఏర్పాటు చేయాలని కలక్టర్లకు సూచించారు.
వయోజన విద్యాశాఖ డైరెక్టర్ కృతికా శుక్ల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఏర్పాట్లను వివరిస్తూ పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు,ఇతర ఎలక్ట్రానికి వస్తువులేవీ అనుతించ కూడదని స్పష్టం చేశారు.తగిన తాగునీరు అందుబాటులో ఉంచడం తోపాటు తగిన వెలుతురు ఉండాలని,విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా చూడాలని సూచించారు.అన్ని పరీక్షా కేంద్రాలను సిసిటివి కవరేజ్ తో అనుసంధానించి చీఫ్ సూపరింటిండెంట్ ఆ సిసి కమెరాలను లైవ్ స్ట్రీమింగ్ ద్వారా పర్యవేక్షించాలని తెలిపారు.అంతేగాక ప్రధమ చికిత్స సౌకర్యాన్ని అందుబాటులో ఉంచడం తోపాటు అత్యవసర సమయాల్లో చికిత్సకై 108 అంబులెన్సును కూడా అందుబాటులో ఉంచేలా చూడాలని తెలిపారు.ప్రశ్నాపత్రాలను పోలీస్ స్టేషన్ సేఫ్ కస్టడీ ఉంచి ఆయా పరీక్షా కేంద్రాలకు తీసుకువెళ్ళాలని పరీక్ష అనంతరం జవాబు పత్రాలను సీల్ చేసి చీఫ్ సూపరింటిండెంట్,డిపార్టుమెంటల్ అధికారి ఆయా జవాబు పత్రాల బండిళ్ళను స్పీడు పోస్టు ద్వారా పంపాలని చెప్పారు.
ఈసమావేశంలో రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ హిమాన్షు శుక్ల, వర్చువల్ గా జిల్లా కలక్టర్లు,ఎస్పిలు,సిపిలు,డిఇఓలు,ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment