*ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో అనుకున్న పనులు అనుకున్న సమయానికి జరగాల్సిందే
*
*అన్ని అనుమతులు, నిధులు ఉన్న ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదు*
*2027 జూన్ లక్ష్యంగానే పోలవరం పనులు జరగాలి*
*పోలవరం ఫలితాలు వచ్చేనాటికి ఉత్తరాంధ్ర సుజల స్రవంతి అదుబాటులోకి రావాలి*
*గ్రౌండ్ వాటర్ పెంపుపై ప్రణాళికకు నాలుగు శాఖల మంత్రులతో కమిటీ*
*వెలుగొండ ప్రాజెక్టుపై ప్రత్యేక ఫోకస్...త్వరలోనే ప్రాజెక్టును సందర్శిస్తా*
*జలవనరుల శాఖపై సమీక్షలో సీఎం చంద్రబాబు నాయుడు*
అమరావతి, ఫిబ్రవరి 13 (ప్రజా అమరావతి): సాగునీటి ప్రాజెక్టుల పనుల్లో లక్ష్యాల మేర పనులు జరగాల్సిందేనని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. గత ప్రభుత్వం ఇరిగేషన్ రంగానికి తీరని ద్రోహం చేసిందని...వాటిని సరిదిద్ది, రైతులకు సాగునీరు అందించాలంటే....లక్ష్యాలను చేరుకునేలా వేగంగా పనులు జరగాలని అన్నారు. ముఖ్యంగా పోలవరం వంటి భారీ ప్రాజెక్టుల్లో ఈ రోజుకు ఎంత పని జరగాలి, ఈ నెలకు ఎంతపని జరగాలనేది లక్ష్యంగా పెట్టుకుని ఆ మేరకు పనులు పూర్తి అయ్యాయా లేదా అనేది సమీక్షించుకోవాలని సీఎం అన్నారు. నిర్దేసించుకున్న లక్ష్యాల మేర పనులు జరగకపోతే....ఇటు అధికారులు, అటు కాంట్రాక్టర్లు బాధ్యత వహించాల్సి ఉంటుందని సిఎం అన్నారు. అనుమతులు ఉండి, నిధుల సమస్యలేని ప్రాజెక్టుల్లో జాప్యాన్ని సహించేది లేదని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఇరిగేషన్ శాఖపై సచివాలయంలో సీఎం సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న వివిధ సాగునీటి ప్రాజెక్టుల పనులు, కొత్తగా చేపట్టే ప్రాజెక్టులపై సిఎం సమీక్ష చేశారు. ముందుగా పోలవరం పనులపై అధికారులు ప్రజెంటేషన్ ఇచ్చారు. మొత్తం 1379 మీటర్ల డయాఫ్రం వాల్ నిర్మాణం జరగాల్సి ఉందని....గత నెల ప్రారంభమైన డయాఫ్రం వాల్ పనుల్లో ఇప్పటి వరకు 35 మీటర్లు పూర్తి అయ్యిందని...ఇంకా 1344 మీటర్లు పూర్తి చెయ్యాల్సి ఉందని అధికారులు వివరించారు. పోలవరం ఎడమ కాలువ కనెక్టివిటీ పనుల్లో కొంత జాప్యం జరిగిందని అధికారులు చెప్పగా....పనులు వేగవంతం చేయాలని...వచ్చే సమీక్ష నాటికి ప్రోగ్రెస్ కనిపించాలని సిఎం తెలిపారు. పోలవరం కాలువల సామర్థ్యం విషయంలో మొదట ఎంత సామర్థంతో(17500 క్యూసెక్కులు) అయితే డిజైన్ చేశారో..అంత సామర్థ్యం మేర నిర్మాణం చేపట్టాలని సిఎం సూచించారు. అనుమతులు, నిధులు ఉన్న పోలవరం ప్రాజెక్టు పనులు వేగంగా జరగాలని సిఎం సూచించారు. 2027 జూన్ నాటికి ప్రాజెక్టు పూర్తి అవ్వాలనే లక్ష్యంతో పనులు చేయాలని ఆదేశించారు. ఏ కారణాల చేత అయినా 2027 జూన్ నాటికి ఆ పనులు పూర్తి కాకపోతే.... 2027 డిసెంబర్కు ఖచ్చితంగా పనులు పూర్తి చెయ్యాలని సిఎం తెలిపారు. పోలవరం ఎడమ కాలువ పనులు పూర్తి చేసి నీళ్లు విశాఖకు తీసుకువెళ్లే సమయానికి....ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ప్రాజెక్టు కూడా అందుబాటులోకి రావాలని...తద్వారా గోదావరి నీటి ఉత్తరాంధ్ర ప్రాజెక్టులకు మళ్లించే అవకాశం లభిస్తుంద నిసిఎం అన్నారు. చింతలపూడి లిఫ్ట్ పనులకు సంబంధించి కోర్టుల్లో ఉన్న సమస్యలు పరిష్కరించి పనులు గాడిన పెట్టాలని సిఎం సూచించారు. వెలిగొండ విషయంలో జరుగుతున్న జాప్యంపై సీఎం ఆవేదన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో నా చేతుల మీదుగా వెలిగొండ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశానని....ఆ ప్రాంత అవసరాలు గుర్తించి 2014-19 మధ్యలో అత్యంత ప్రాధాన్యం ఇచ్చి పనులు ముందుకు తీసుకువెళ్లానని అన్నారు. కానీ తరువాత వచ్చిన ప్రభుత్వం డ్రామాలు చేసి పూర్తికాని ప్రాజెక్టున ప్రారంభోత్సవాలు చేసింది..దీని వల్ల ఆ ప్రాంత వాసులకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. 25 ఏళ్ల క్రితం అనుకున్న ప్రాజెక్టు నేటికీ పూర్తికాకపోవడం బాధాకరం అని వ్యాఖ్యానించిన సిఎం...ఈ ప్రాజెక్టుపై ఎక్కువ ఫోకస్ పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టు విషయంలో గత ప్రభుత్వం చేసిన మోసాలను కూడా ప్రజలకు వివరించి...మనం ఎలా న్యాయం చెయ్యబోతున్నామో కూడా చెప్పాలని అన్నారు. అధికారులు ఈ ప్రాజెక్టు పూర్తిపై ప్రత్యేక శ్రద్ద పెట్టాలని తాను కూడా ఈ ప్రాజెక్టును సందర్శించి త్వరితగతిని ప్రాజెక్టు పూర్తికి చర్యలు చేపడతానని సిఎం అధికారులకు సూచించారు.
*పోలవరం-బనకచర్ల కార్పొరేషన్*
రాష్ట్రాన్ని కరువు రహితంగా మార్చే పోలవరం-బనకచర్ల అనుసంధాన ప్రాజెక్టును పట్టాలెక్కించాలని సిఎం అన్నారు. పోలవరం - బనకచర్ల కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని సీఎం అధికారులకు సూచించారు. దీనిపై కసరత్తు చేయాలని ఆదేశించారు. నిధుల సమీకరణకు కేంద్రంతో చర్చిస్తున్నామని...దీనిపై పలు ఆలోచనలు ఉన్నట్లు సిఎం తెలిపారు. ఇకపోతే పంట కాలువల ఆపరేషన్ అండ్ మేనేజ్మెంట్ ను ప్రైవేటు సంస్థలకు ఇచ్చే అంశాన్ని సిఎం ప్రస్తావించారు. ఇరిగేషన్ డెవల్మెంట్ కార్పొరేషన్ కింద ఉన్న వెయ్యికిపైగా చిన్న లిఫ్ట్లను మళ్లీ అందుబాటులోకి తెచ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపైనా సమీక్షలో చర్చించారు.
*భూగర్భ జలాల పెంపు నా కల*
భూగర్భ జలాల పెంపు అంశంపై తాను మొదటి నుంచి ప్రయత్నం చేస్తున్నానని సిఎం వ్యాఖ్యానించారు. ఉమ్మడి రాష్ట్రంలో సైతం భూగర్భ జలాల పెంపునకు అనేక చర్యలు తీసుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు. భూమిలో 3 నుంచి 9 మీటర్లలోపు భూగర్భ జాలాల లభ్యత ఉండేలా చూడాల్సిన అవసరం ఉందన్నారు. రిజర్వాయర్లలో నీటిని సమృద్ధిగా ఉంచి బెస్ట్ వాటర్ మేనేజ్మెంట్ చేయడంతో పాటు....భూమిలో నీటి లభ్యత పెంపు కోసం కూడా అన్ని శాఖలు కలిసి పని చేయాలని సిఎం అన్నారు. భూగర్భ జలాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రణాళిక కోసం పంచాయతీ రాజ్, ఫారెస్టు, ఇరిగేషన్, వ్యవసాయ, మునిసిపల్ శాఖ మంత్రులతో కలిసి కమిటీ ఏర్పాటు చేస్తామన్నారు. గ్రౌండ్ వాటర్ పెంపు, పచ్చదనం పెంపుపై కమిటీ కసరత్త చేసి సూచనలు చేస్తుందని అన్నారు. ఈ సమీక్షలో జలవనరుల శాఖా మంత్రి నిమ్మల రామానాయుడు తో పాటు...ఇరిగేషన్ శాఖ అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment