వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు.


*వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం ట్రస్ట్ ఏర్పాటు


*

*ప్రతి రాజధానిలో వేంకటేశ్వరస్వామి ఆలయం నిర్మాణం...అన్ని రాష్ట్రాల సీఎంలకు లేఖ రాస్తాం*

*తిరుపతిలో ముంతాజ్, ఎమర్, దేవాలోక్ హోటల్స్‌కు కేటాయించిన 35 ఎకరాలు రద్దు*

*24 క్లేమోర్స్ పేలినా బతికున్నానంటే వేంకటేశ్వరస్వామి భిక్షతోనే*

*-తిరుమలలో మీడియా సమావేశంలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు*

*మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకున్న సీఎం*

*అనంతరం భక్తులకు అన్నవితరణ కేంద్రంలో భోజనం వడ్డించిన సీఎం, కుటుంబ సభ్యులు*

తిరుమల, మార్చి 21 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో ఇప్పటికీ చాలా గ్రామాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు లేవు. ఆయా గ్రామాల్లో వెంకన్న ఆలయాల నిర్మాణాల కోసం నిధులు సేకరించేందుకు ట్రస్టు ఏర్పాటు చేస్తాం. నాడు ఎన్టీఆర్ అన్నదానం, నేను ప్రాణదానం కార్యక్రమాలు ప్రవేశపెట్టాం. మూడవ కార్యక్రమంగా ఆలయాల నిర్మాణాలను తలపెడుతున్నాం. మాధవ సేవ కోసమే ఆలయాల నిర్మాణానికి ట్రస్ట్ ఏర్పాటు చేస్తాం. ట్రస్ట్‌కు వచ్చే నిధులు పగడ్బంధీగా ఖర్చు చేస్తాం. వేంకటేశ్వరస్వామి ఆస్తులు ఎవరు కబ్జా చేసినా వాటిని తిరిగి దేవుడికే చెందేలా చేస్తాం’ అని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అన్నారు. తన మనవడు దేవాన్ష్ పుట్టిన రోజు సందర్భంగా శుక్రవారం వేంకటేశ్వరస్వామిని కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం భక్తులకు వెంగమాంబ అన్నవితరణ కేంద్రంలో అన్నప్రసాదం స్వయంగా వడ్డించారు. అనంతరం మీడియాతో సీఎం మాట్లాడారు. 

*వేంకటేశ్వరుడి ప్రాణభిక్షతోనే బతికున్నా*

దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా వేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నాం. ప్రతి పుట్టిన రోజు నాడు తిరుమలలో అన్నదానం చేయడం ఆనవాయితీగా పెట్టుకున్నాం. తిరుమలలో అన్నదానాన్ని ఎన్టీఆర్ ప్రారంభించారు. ఇప్పటికి విరాళాల ద్వారా రూ.2,200 కార్పస్ ఫండ్ ఏర్పాటైంది. అన్నదానం ఒక మహత్తర కార్యక్రమం. ఇది శాశ్వతంగా జరుగుతుంది. నేను ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించా. మానవ సేవ మాధవ సేవ రెండూ ఉంటాయని ప్రాణదానం తీసుకొచ్చాం. ఏడు కొండలు వేంకటేశ్వరస్వామి సొంతం. ఇక్కడ అపవిత్రం చేయడం,  వ్యాపారాలు జరగకూడదు. గతంలో అసెంబ్లీలో ఏడుకొండలు కాదు 5 కొండలు అని వ్యాఖ్యానించినప్పుడు పోరాడాం. ప్రాణదానం కార్యక్రమం ప్రారంభించి కిందకు వస్తున్న సమయంలో నాపై 24 క్లేమోర్‌మైన్స్ పేల్చారు. అన్ని క్లేమోర్స్ పేల్చినప్పుడు నేను ప్రాణాలతో బతికేవాడిని కాదు..సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రాణభిక్ష పెట్టారు. ఇందులో వేంకటేశ్వరస్వామి మహిమ ఏంటో ఆలోచించుకోవాలి. 24 క్లేమోర్ పేలితే ప్రాణాలతో తప్పించుకోలేరు. వేంకటేశ్వరస్వామి మహిమ వల్లే బతికాను. 

*3 హోటళ్లకు కేటాయించిన భూమి రద్దు చేస్తున్నాం* 

గత ఐదేళ్లలో తిరుమల పవిత్రత కోసం చాలా పోరాటాలు చేశాం. అందుకే అధికారంలోకి వచ్చాక వేంకటేశ్వరస్వామి దేవాలయం నుంచే ప్రక్షాళన చేపడతామని చెప్పి చేశాం. కొండకు ఆనుకుని ఉన్న ముంతాజ్, ఎమర్, దేవాలోక్ హోటల్స్‌కు అనుమతులు ఇచ్చి 35.32 ఎకరాలు కేటాయించారు. ఈ కేటాయింపులను రద్దు చేస్తున్నాం. ఏడు కొండనలు ఆనుకుని ఎవరూ వ్యాపారం చేయడం, అపవిత్రం చేయడానికి వీళ్లేదు. టీటీడీలో పని చేసే ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం...వేంకటేశ్వరస్వామి పవిత్రను కాపాడటానికి ఒకడుగు ముందుకేయాలిగానీ వ్యక్తిగత ప్రయుజనాల కోసం వ్యవహరించ వద్దు. దేశం, ప్రపంచలో వేంకటేశ్వరస్వామి ఆస్తులను కాపాడటానికి కంకణం కట్టుకున్నాం. టీటీడీలో పని చేసేవారు హిందువులై ఉండాలి...ఇతర మతస్తులను గౌరవ ప్రదంగా మరోచోట అవకాశం కల్పిస్తాం. క్రిస్టియన్, ముస్లిం ఆలయాల్లో కూడా ఇతర మతస్తుల ఉండరు. ఏ మతానికి సంబంధించిన ఆలయాల్లో ఆ మతం వారే ఉంటారు. దేశంలోని అన్ని రాజధానుల్లో వేంకటేశ్వరస్వామిని దేవాలయం నిర్మించాలని సంకల్పించాం. దీనికోసం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు లేఖలు రాస్తాం.  ప్రపంచ దేశాల్లో హిందువుల ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో వేంకటేశ్వరస్వామి దేవాలయాలు నిర్మిస్తాం.’ అని సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు. 

Comments