ఎల్ఐసి ఏజెంట్ల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించాలి.
* కేంద్ర ప్రభుత్వానికి ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ విజ్ఞప్తి.
* లోక్ సభ స్పీకర్ కు నివేదిక సమర్పించిన ఎంపీ మహేష్ కుమార్
దిల్లీ/ ఏలూరు, మార్చి 21 (ప్రజా అమరావతి);: ఎల్ఐసి ఏజెంట్ల భద్రత, బీమా రంగ స్థిరత్వాన్ని కాపాడేందుకు ప్రభుత్వం వెంటనే కమీషన్ మార్పులను రద్దు చేస్తూ, ఏజెంట్ల ఆర్థిక భద్రతకు భరోసా కల్పించాలని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు పార్లమెంట్ సమావేశాల సందర్భంగా లోక్ సభ స్పీకర్ ఓం బిర్లాకు శుక్రవారం నివేదిక సమర్పించారు.
కోట్లాది మంది భారత ప్రజల భవిష్యత్ కు ఆర్థిక భద్రత కల్పిస్తున్న ఎల్ఐసి ఏజెంట్ల సమస్యల పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం చొరవ చూపాలని, లైఫ్ ఇన్షూరెన్స్ ఏజెంట్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఉన్న 14.4 లక్షల మంది ఏజెంట్లు రూ.44.31 లక్షల కోట్ల లైఫ్ ఫండ్, రూ.52.85 లక్షల కోట్ల జీవిత బీమా సంస్థ ఆస్తులకు విశేషంగా సహకరిస్తున్నారని, ఇన్షూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా ఇటీవల తీసుకొచ్చిన మార్గదర్శకాల వల్ల ఎల్ఐసి ఏజెంట్ల జీవనోపాధిని ప్రశ్నార్థకంగా మార్చిందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు.
కొత్త నిబంధనల ప్రకారం పాలసీదారులు తమ పాలసీలను రెండేళ్లకే సరెండర్ చేయడానికి ప్రోత్సహించే విధంగా ఉన్నాయని, దీని వల్ల దీర్ఘకాలిక బంధం దెబ్బతింటుందని, ఐఆర్డిఏఐ స్పష్టమైన కమీషన్ మార్గదర్శకాలను రూపొందించకుండా అధికారాలను బీమా కంపెనీలకు అప్పగించడం ద్వారా ఏర్పడే అసమానతల వల్ల ఏజెంట్ల ఆర్థిక భద్రత దెబ్బతింటోందని, కమిషన్ మార్చడం వల్ల మొదటి సంవత్సరపు ఆదాయం తగ్గి, చెల్లింపులు ఆరేళ్లకు పొడిగించడం ద్వారా ఏజెంట్లపై మరింత భారం పడుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ వివరించారు.
అంతే కాకుండా "క్లాబ్యాక్ ప్రొవిజన్" ద్వారా పాలసీదారులు ఐదేళ్ల లోపు పాలసీ సరెండర్ చేస్తే ఏజెంట్లు తమ కమిషన్ తిరిగి ఇవ్వాల్సి ఉంటుందని, ఈ నిబంధన కూడా అవరోధంగా మారడంతో జీవిత భీమా రంగం అస్థిరతకు దారి తీస్తుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ అభిప్రాయం వ్యక్తం చేశారు.
కొత్తగా తీసుకొచ్చిన మార్గదర్శకాల వల్ల పాలసీ కొనసాగింపు రేటు తగ్గిందని, 2010లో 4.4% ఉన్న ఈ రేటు 2023లో 3%కు పడిపోయిందని, ఏజెంట్ల తగ్గుదలతో బీమా రంగ స్థిరత్వం మరింత దెబ్బతింటోందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తన నివేదికలో వివరించారు.
addComments
Post a Comment