మే 2వ తేదీన ప్రధానమంత్రి పర్యటనకు విస్తృతమైన ఏర్పాట్లు: సిఎస్.
విజయవాడ,28 ఏప్రిల్ (ప్రజా అమరావతి):మే 2వ తేదీన ప్రధాన మంత్రి నరేంద్ర మోడి అమరావతి రాజధాని పనుల పునః ప్రారంభించేందుకు వస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయా నంద్ పేర్కొన్నారు.సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన ప్రధాని పర్యటన ఏర్పాట్లపై అధికారులతో సమీక్షించారు.ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ వివిధ జిల్లాల నుండి వచ్చే ప్రజలందరూ 2వ తేది మధ్యాహ్నం 1.30 గం.లకు సభా వేదిక వద్దకు చేరుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు స్పష్టం చేశారు. ప్రతి బస్సులో ఒకవ్యక్తిని ఇన్చార్జిగా ఉంచి సురక్షితంగా తీసుకు వచ్చి తరిగి వారి గమ్య స్థానాలకు చేర్చేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సిఎస్ ఆదేశించారు.అంతేగాక వేసవి దృష్ట్యా సభకు వచ్చే వారందరికీ తగిన ఆహారం, తాగునీరు వంటి సౌకర్యాలు పూర్తి స్థాయిలో అందుబాటులో ఉంచాలని చెప్పారు.బస్సులు బయలుదేరే సమయంలోనే ఆహారం,తాగునీరు అందించాలని,మరలా దారిలో సంబంధిత జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో ఎంపిక చేసిన ప్రాంతాల్లో మధ్యాహ్న భోజనం అందించాలని సిఎస్ స్పష్టం చేశారు.అలాగే రాత్రి భోజనం ఏర్పాట్లను సభా వేదిక ప్రాంగణంలోని వివిధ పార్కింగ్ స్థలాల వద్ద గుంటూరు జిల్లా కలెక్టర్ ద్వారా ఏర్పాటు చేయడం జరుగుతుందని స్పష్టం చేశారు.
ప్రధాని సభకు వివిధ జిల్లాల నుండి ప్రజలను తీసుకు వస్తున్నందున పెద్ద ఎత్తున బస్సులు,ఇతర వాహనాలు జాతీయ రహదారులు,ఇతర ప్రధాన రహదారులపై ప్రయాణించనున్న నేపధ్యంలో ఎక్కడా ట్రాఫిక్ జామ్ కాకుండా ముందుగానే తగిన ప్రణాళిక చేసుకోవాలని అదనపు డిజిపి శాంతి భద్రతలు,కలెక్టర్లు,ఎస్పి లను సిఎస్ విజయానంద్ ఆదేశించారు.
ఈసమావేశంలో ప్రధాన మంత్రి పర్యటన ఏర్పాట్ల పర్యవేక్షణ రాష్ట్ర నోడలు అధికారి జి.వీరపాండ్యన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి అమరావతి పర్యటనకు సంబంధించి టెంటటివ్ కార్యక్రమాన్ని వివరిస్తూ 2వ తేది మధ్యాహ్నం 2.30.గం.లకు గన్నవరం విమానాశ్రయానికి చేరుకుని తదుపరి హేలీకాప్టర్లో రాష్ట్ర సచివాలయ ప్రాంగణానికి అక్కడ నుండి సభా ప్రాంగణానికి చేరుకుని సభ అనంతరం హెలీకాప్టర్లో గన్నవరం విమానాశ్రయం చేరుకుని ఢిల్లీ బయలుదేరి వెళతారని చెప్పారు.వివిధ జిల్లాల నుండి ప్రజలు సభా వేదికకు చేరుకునేలా విజయవాడ,గుంటూరుల నుండి 8 రూట్లను సిద్ధం చేశామని తెలిపారు.సభా వేదిక సమీపంలో 11 పార్కింగ్ ప్రాంతాలను ఏర్పాటు చేసినట్టు చెప్పారు.ఇంకా వివిధ ఏర్పాట్లపై వివరించారు.
ఈసమావేశంలో గుంటూరు జిల్లా కలెక్టర్ నాగలక్మి,ఇఎన్సి ఆర్ అండ్బి నయీముల్లా, ప్రోటోకాల్ అదనపు డైరెక్టర్ మోహన్ పాల్గొన్నారు.అలాగే వర్చువల్ గా శాంతి భధ్రతల అదనపు డిజిపి మదుసూదన్ రెడ్డి,సాధారణ పరిపాలన శాఖ ముఖ్య కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా,టిఆర్అండ్బి ముఖ్య కార్యదర్శి కాంతాలాల్ దండే,ఎన్టిఆర్,కృష్ణా,ఏలూరు, బాపట్ల,పల్నాడు జిల్లాల కలెక్టర్లు,విజయవాడ సిపి తదితర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment