ఉద్యోగుల టవర్ల నిర్మాణానికి రూ.1,732.31 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం.

*ఉద్యోగుల టవర్ల నిర్మాణానికి రూ.1,732.31 కోట్ల పనులకు సీఆర్డీఏ ఆమోదం*


*•కోర్ క్యాపిటల్ ఏరియాలో ఇప్పటి వరకూ 71 సంస్థలకు 1,050 ఎకరాలు కేటాయింపు*

*రాష్ట్ర పురపాలక & పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ*


అమరావతి, మే 5 (ప్రజా అమరావతి):   రాష్ట్ర రాజధాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో గజిటెడ్ మరియు నాన్ గజిటెడ్ ఉద్యోగుల నివాసానికై నాలుగు ప్యాకేజీల్లో టవర్ల నిర్మాణానానికై రూ.1,732.31 కోట్ల విలువైన పనుల టెండర్లకు సీఆర్డీఏ ఆమోదం తెల్పిందని రాష్ట్ర పురపాలక మరియు పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం ప్రచార విభాగంలో పాత్రికేయులతో  ఆయన మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు అధ్యక్షతన  47 వ సీఆర్డిఏ సమావేశం  రాష్ట్ర సచివాలయంలో జరిగిందని, ఈ సమావేశంలో రాజధాని అమరావతి అభివృద్ది పనులకు సంబంధించిన పలు టెండర్లను ఆమోదించడం జరిగిందన్నారు. 2014-19 మద్య కాలంలో చేపట్టిన గజిటెడ్ అధికారుల టవర్ల నిర్మాణ పనులను పూర్తి చేసేందుకు రూ.514.41 కోట్ల విలువైన టెండర్లకు, బాహ్య మౌలిక సధుపాయాల కల్పనకు రూ.194.73 కోట్ల విలువైన టెండర్లకు సీఆర్డిఏ సమావేశం లో ఆమోదం తెల్పడం జరిగిందన్నారు. నాన్ గజిటెడ్ ఉద్యోగుల నివాసానికై తొమ్మిది టవర్ల నిర్మాణానికై రూ.506.67 కోట్ల విలువైన టెండర్లకు మరియు  మరో 12 టవర్ల నిర్మాణానికి, మౌలిక వసతుల కల్పనకు రూ.517.10 కోట్ల విలువైన  టెండర్లకు  ఈ సమావేశంలో ఆమోదం తెల్పడం జరిగిందని మంత్రి తెలిపారు. 190 MLD సామర్థ్యంగల వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణానికి, ఐదేళ్ల పాటు ఆపరేషన్ మరియు నిర్వహణకై రూ.560.57 కోట్ల విలువైన టెండర్లకు మరియు ఓవర్ హెడ్ ట్యాంకుల నిర్మాణానికి రూ.494.86 కోట్ల విలువైన టెండర్లకు ఆమోదం తెల్పడం జరిగిందన్నారు.  జాతీయ రహదారికి అనుసంధానం అయ్యే ఇ-3, ఇ-13 మరియు ఇ-15 రోడ్ల నిర్మాణానికై అవసరమైన టెండర్లను పిలిచేందుకు కూడా  ఈ సమావేశంలో ఆమోదం తెల్పడం జరిగిందన్నారు. ఇ-3 సీడ్ యాక్సిస్ రోడ్డులో 1.5 కి.మి. మేర ఎలివేటెడ్ రోడ్ల నిర్మాణానికి మరియు 4.10 కి.మి. ఇ-13  రోడ్డును రూ.384.78 కోట్లుతో పొడిగించేందుకు  మరియు  3.98 కి.మి. ఇ-15 రోడ్డును  రూ.70 కోట్లతో పొడిగించేందుకు ఆమోదం తెల్పడం జరిగిందన్నారు. 


*ఇప్పటి వరకూ 71 సంస్థలకు 1,050 ఎకరాలు కేటాయింపు…….*

                                                                                                                                                                           రాష్ట్ర రాజదాని అమరావతి కోర్ క్యాపిటల్ ఏరియాలో  పలు సంస్థలకు భూముల కేటాయింపుకు సంబందించి మంత్రుల బృందం సమావేశం నేడు జరిగిందని, ఈ సమావేశంలో ఏడు సంస్థలకు భూములను కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు.  న్యాయ విశ్వ విద్యాలయాలనికి  55 ఎకరాలు, క్వాంటమ్ వేలీకి  50 ఎకరాలు, ఆదాయ పన్ను శాఖకు  0.78 ఎకరాలు, ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీకి  0.78 ఎకరాలు, కోస్టల్ బ్యాంక్ హెడ్ ఆఫీసుకి 0.40 ఎకరాలు మరియు ఐఆర్సిటిసి హోటల్స్ కి ఒక ఎకరం కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. అదే విధంగా బసవతారకం క్యాన్సర్ ఇన్స్టిట్యూకు గతంలో 15 ఎకరాలు ఇవ్వడం జరిగిందని, అయితే వైద్య కళాశాల నిర్మాణానికి ఇప్పుడు మరో 6 ఎకరాలను కేటాయించడం జరిగిందన్నారు.  గతంలో 64 సంస్థలకు భూములను కేటాయించడం జరిగిందన్నారు. ఈ విధంగా  ఇప్పటి వరకూ మొత్తం 71 సంస్థలకు 1,050 ఎకరాలను కేటాయించడం జరిగిందని మంత్రి తెలిపారు. 


Comments