• ప్రభుత్వ నిధులే కాదు.. ప్రజల ఐక్యతతోనే గ్రామాలకు జీవం
• మాట్లాడుకుందాం.. చర్చిద్దాం... సమస్యను పరిష్కరించుకుందాం
• వినోదాన్ని పంచే వెండి తెర... సమస్యలను తీర్చే వేదిక కావడం గొప్ప అనుభూతి
• శ్రీకాకుళం జిల్లా, రావివలస పంచాయతీ గ్రామస్తులతో ‘మన ఊరి కోసం మాటామంతీ’ కార్యక్రమం ద్వారా మాట్లాడిన ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ .
అమరావతి (ప్రజా అమరావతి);
రావివలస పంచాయతీకి రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరు
‘గ్రామాలను పట్టించుకోరు... అక్కడి మౌలిక సమస్యలు తీర్చరనే మాట ఇక వినపడకూడదనే ఆశయంతోనే ‘మన ఊరి కోసం మాటామంతీ’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాము. కేవలం సమస్యల గురించి మాట్లాడుకోవడమే కాదు... గ్రామాల్లో ఉండే అన్ని విషయాలను అందరూ కూర్చొని మాట్లాడుకుంటూ గ్రామస్తులలో ఐక్యత తీసుకురావడమే ఈ కార్యక్రమం లక్ష్యమ’ని ఉప ముఖ్యమంత్రి, పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ అన్నారు. రెండు గంటలపాటు సమస్యలు, గ్రామాభివృద్ధి, ఇతర ముఖ్య విషయాల గురించి చర్చిస్తే దాదాపు రూ.15 కోట్ల విలువైన పనులు ఓ గ్రామానికి మంజూరు కావడం చిన్న విషయం కాదన్నారు. ప్రభుత్వం చేయాల్సిన పనులతోపాటు ప్రజా చైతన్యం వెల్లివిరిస్తేనే గ్రామాలు కళకళలాడుతాయని పేర్కొన్నారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖల ఆధ్వర్యంలో వినూత్నంగా నిర్వహించిన ‘మన ఊరి కోసం మాటామంతీ’ కార్యక్రమాన్ని శ్రీ పవన్ కళ్యాణ్ గురువారం ప్రారంభించారు. శ్రీకాకుళం జిల్లా, టెక్కలి నియోజకవర్గం, రావివలస గ్రామపంచాయతీలోని గ్రామస్తులను టెక్కలిలోని సినిమా థియేటర్ కు తీసుకువెళ్లారు. మంగళగిరిలోని తన కార్యాలయం నుంచి శ్రీ పవన్ కళ్యాణ్ వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొని వెండి తెర ద్వారా ప్రత్యక్ష ప్రసారంలో ఆ ఊరి ప్రజలతో అనుసంధానం అయ్యారు. వారితో నేరుగా మాట్లాడుతూ గ్రామ సమస్యలను, అక్కడి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు.
రావివలస పంచాయతీకి రూ.15 కోట్ల విలువైన అభివృద్ధి పనులు మంజూరు చేశారు. 14 సీసీ రోడ్లు, 4 డ్రైనేజీలు, ఒక ధోబీ ఘాట్, ఒక బస్ షెల్టర్, స్కూల్ ప్రహరీ గోడ, ట్యాంక్ పునరుద్ధరణ, నీటి కాలువల పునరుద్ధరణ, శ్మశాన వాటికలలో సదుపాయాలు తదితర పనులకు నిధులు మంజూరు చేశారు.
ఈ సందర్భంగా శ్రీ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.... ‘‘గ్రామాలకు నిధులు ఇస్తేనే అభివృద్ధి జరుగుతుందనే వాస్తవం కాదు. గ్రామస్తులంతా కలిసి ఐక్యంగా ముందుకు కదలితేనే ఎలాంటి సమస్య అయినా పరిష్కారం అవుతుంది. గ్రామాల్లో పుట్టి పెరిగి, తరవాత ఉన్నత దశకు వెళ్లిన వారు కచ్చితంగా తమ సొంత గ్రామాన్ని మరవకూడదు. గ్రామాభివృద్ధిలో తగిన తోడ్పాటునందించాలి. గతంలో వినోదం కోసం మాత్రమే సినిమా థియేటర్లు ఉండేవి. ఇప్పుడు ఊరి సమస్యలను పరిష్కరించుకునే సామాజిక బాధ్యతకి వేదికలుగా నిలబడటం సంతోషకరం. వెండి తెర వేదికగా ప్రజలతో మాట్లాడటం గొప్ప అనుభూతి కలిగించింది.
• వెంటనే పరిష్కరించే ఏర్పాట్లు చేస్తున్నాం
మన ఊరు – మాటమంతీ కార్యక్రమం ద్వారా ప్రజలు చెప్పే సమస్యలు వెంటనే పరిష్కరించేవి ఉంటే పరిష్కరిస్తాం. సమయం తీసుకునేవి ఉంటే వాటిని పరిష్కరించే సమయం గ్రామస్తులకు తెలియపర్చడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. రావివలస గ్రామంలో స్వయంభువుగా నిలిచిన అతి పెద్ద లింగాకారం ఉంది. శ్రీ ఎండల మల్లికార్జున స్వామి లింగాకార రూపం అతి విశిష్టమైనది. ఈ ప్రాంతాన్ని ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా రూపుదిద్దడంపై అధికారులతో మాట్లాడి తగు ప్రణాళిక రూపొందిస్తాం. అలాగే రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో వాటి విశిష్టతలు, గొప్పదనాలు ఉన్నాయి. వాటిని గుర్తించి తగు విధంగా వాటికి బ్రాండ్ తీసుకురాగలిగితే గ్రామాల రూపురేఖలు మారుతాయి.
• గ్రామ ఐక్యతే బలం
గ్రామాల్లో చిన్నచిన్న సమస్యలను తీర్చుకోవడానికి ఆ ఊరి ప్రజలు ఏకమైతే చేసుకునేవి కొన్ని ఉంటాయి. వాటిని గుర్తించి పరిష్కరించుకోవాలి. అలాగే గ్రామాల్లో పాఠశాలలను జాగ్రత్తగా కాపాడుకోవాలి. పాఠశాలలకు కేవలం బోధనకు మాత్రమే పరిమితం కావాలి. అక్కడ అసాంఘిక కార్యకలాపాలు, రాజకీయ, మతపరమైన సభలు జరపడానికి వీల్లేదు. అలాగే స్కూలు పిల్లలకు శారీరక దృఢత్వం అవసరం. పాఠశాలలకు కచ్చితంగా క్రీడా మైదానం ఉండాలి. దానికి ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలి. నేను గతంలో మైసూరవారిపల్లెకు వెళ్లినపుడు ఆ ఊరి ప్రజలు ఆటస్థలం కావాలని కోరారు. పంచాయతీ రికార్డుల్లో చూస్తే కనీసం ఆటస్థలానికి సెంటు భూమి లేదు. నా సొంత డబ్బుతోనే ఆటస్థలానికి కావల్సిన భూమి కొనుగోలు చేసి ఇచ్చాను. ప్రతిచోటా ఇలా నా సొంత డబ్బులను వెచ్చించాలంటే కష్టతరం అవుతుంది. కాబట్టి పంచాయతీలోని స్థలాలను పిల్లల ఆట స్థలాలుగా మార్చే ప్రక్రియ జరగాలి.
• డ్రైనేజీ ప్లాను లేకుండా లే అవుట్లను అనుమతించొద్దు
గ్రామాల్లో లేదా కొత్తగా నిర్మితం అవుతున్న కాలనీల్లో కచ్చితమైన డ్రైనేజీ ప్లాను లేకుండా వాటిని అనుమతించకూడదు. దీనిపై నేను ముఖ్యమంత్రి గారితో, మంత్రివర్గ సహచరులతో మాట్లాడి దీనిపై ప్రత్యేక గైడ్ లైన్స్ తెచ్చేలా చూస్తాను. ముందుగా ప్లాన్ అప్రూవ్ అయిన తర్వాత డ్రైనేజీ ప్రణాళిక వేసే పద్ధతి కాకుండా, ముందుగా డ్రైనేజీపై స్పష్టత వచ్చిన తర్వాత లేఅవుట్లకు అనుమతించే పద్ధతి రావాలి. దీనిపై టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ శాఖ అధికారులతో చర్చిస్తాను. బెంగళూరు పరిస్థితి ఎలా ఉందో చూస్తున్నాం. సరైన డ్రైనేజీ అనుమతులు లేకుండా లే అవుట్లకు అనుమతి ఇస్తే భవిష్యత్తులో వాటి పరిస్థితి అగమ్యగోచరం అవుతుంది.
• ఉద్దానం పరిస్థితులు అన్ని చోట్లా వస్తున్నాయి
భూగర్భ జలాల రక్షణ విషయంలో అందరికీ తగిన చైతన్యం రావాలి. ఉద్దానం కిడ్నీ సమస్యలు వంటివి రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో రావడం వెనుక భూగర్భ జలాలు అడుగంటిపోవడం కూడా ప్రధాన కారణం. 1000 మీటర్లు దాటి బోర్లు వేస్తే ఆ నీరు తాగడానికి పనికిరాకుండా పోతోంది. భూగర్భజలాలు దారుణంగా పడిపోతున్నాయి. వర్షపు నీటిని భూగర్భంలోకి పంపే చైతన్యం అందరిలో రావాలి. దీంతోపాటు డ్రైనేజీల్లో రక్షిత మంచి నీటి పైపులు చాలా చోట్ల కనిపిస్తున్నాయి. ఈ సమస్యపై ఎప్పటికప్పుడు స్థానిక అధికారులు దృష్టి సారించాలి. ఇటీవల గుర్లలో జరిగిన అతిసార ఘటనకు కూడా ఇలాంటి పరిస్థితే కారణం. తాగునీరు గ్రామీణ ప్రజలకు సమృద్ధిగా అందాలి.
• ఆడబిడ్డకు అన్యాయం జరిగితే యువత స్పందించాలి
ఆడపిల్లలు, మహిళలపై ఎలాంటి నేరాలు జరగకుండా యువత బాధ్యత తీసుకోవాలి. ఏ ఆడపిల్లకు అన్యాయం జరిగినా మన ఇంట్లోని పిల్లగా భావించాలి. మన ఊరు – మాటామంతీ కార్యక్రమం కేవలం సమస్యలను చెప్పుకోవడానికి మాత్రమే కాదు... ప్రభుత్వం మీ పల్లెగొంతు వినడానికి ఓ వారధిగా ఉపయోగించుకోండి. ఈ కార్యక్రమాన్ని మినీ గ్రామసభ అనుకోండి. ఇక్కడ గ్రామంలోని సమస్యలపై తీర్మానాలనే చేసుకునే గొప్ప కార్యక్రమంగా తీసుకోండి. వెనువెంటనే మీ తీర్మానాలు అందుకొని, వాటిని పరిష్కరించే గొప్ప కార్యక్రమంగా ఇది నిలిచిపోతుంది.
జూన్ 21వ తేదీన అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్బంగా ప్రతి ఒక్కరూ దానిలో పాల్గొనాలి. యోగాను మన జీవిన విధానంలో భాగం చేసుకోవాలి. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ యోగా డే కార్యక్రమాల్లో పాల్గొనేందుకు విశాఖపట్నం వస్తున్నారు. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు ఇందుకు సంబంధించి ఇప్పటికే అధికారులతో చర్చించారు. యోగా సంబంధిత కార్యక్రమాలు చేపడుతున్నామ’’న్నారు.
• శ్రీ పవన్ కళ్యాణ్ చొరవ అభినందనీయం: శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు , వ్యవసాయ శాఖ మంత్రి
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కింజారపు అచ్చెన్నాయుడు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ... ‘‘గ్రామీణ ప్రజానీకంతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకోవాలనే గొప్ప ఆలోచనతో శ్రీ పవన్ కళ్యాణ్ 'మన ఊరి కోసం మాటామంతీ' కార్యక్రమాన్ని నా నియోజకవర్గంలో ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. వైసీపీ ప్రభుత్వ అయిదేళ్ల పాలనలో పూర్తిగా గ్రామీణ వ్యవస్థ నీరుగారిపోయింది. అభివృద్ధి కుంటుపడింది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్లీ పల్లెలు కళకళలాడుతున్నాయి. సీసీరోడ్లు, డ్రైన్లు, గోకులాలు, ఉపాధి పనులు, మూగ జీవాలకు నీటి వసతి ట్యాంకులు ఇతర ఎన్నో అభివృద్ధి పనులు సాగుతున్నాయి. వీటి కోసం ప్రత్యేక చొరవ తీసుకుంటున్న ఉప ముఖ్యమంత్రివర్యులు శ్రీ పవన్ కళ్యాణ్ కృషి అద్భుతం. ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబునాయుడి చొరవతో, ప్రధాని శ్రీ నరేంద్ర మోదీ గారి ఆశీస్సులతో మళ్లీ రాష్ట్రం అభివృద్ధి వైపు వడివడిగా అడుగులు వేస్తోంది” అన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీ శశిభూషణ్ కుమార్, కమిషనర్ శ్రీ కృష్ణ తేజ, ఎ.పి.ఎస్.ఐ.ఆర్.డి. కమిషనర్ శ్రీ ఆర్.ముత్యాలరాజు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. శ్రీకాకుళంలోని జిల్లా కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ శ్రీ స్వపిల్, జిల్లా అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment