స్వచ్ఛాంధ్ర ఓ ఉద్యమం.



స్వచ్ఛాంధ్ర ఓ ఉద్యమం.




*జనవరి నుంచి వేస్ట్ అనేదే కన్పించకూడదు*


*అర్బన్ సౌకర్యాలతో ఏజెన్సీ గ్రామాల అభివృద్ధి*


*కొండపల్లి, ఏటికొప్పాక బొమ్మల కలపకు చెట్లు పెంచాలి*


*రాష్ట్రంలో 5 సర్క్యులర్ ఎకానమీ పార్కులు*


*రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు*


అమరావతి, సెప్టెంబర్ 16 (ప్రజా అమరావతి): రాష్ట్రంలో అమలు చేస్తున్న స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని ఉద్యమ స్పూర్తితో కొనసాగించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కోరారు. మంగళవారం రాష్ట్ర సచివాలయంలో రెండో రోజు కలెక్టర్ల సమావేశం జరిగింది. స్వచ్ఛాంధ్ర, సర్కులర్ ఎకానమీ వంటి అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ...”జనవరి నుంచి వేస్ట్ అనేది ఎక్కడా కనిపించకూడదు. 83 లక్షల మెట్రిక్ టన్నుల లెగసీ వేస్ట్ క్లియర్ చేసాం. చెత్తపై పన్ను కూడా రద్దు చేశాం. స్వచ్ఛాంధ్ర కార్యక్రమాల కోసం కార్పొరేషన్ ద్వారా నిధులిస్తున్నాం. స్వచ్ఛ భారత్ కోసం ఏ జిల్లాలో అయినా పైలట్ ప్రాజెక్టుగా కార్యక్రమాలు చేపడితే అది రాష్ట్రమంతా వర్తింప చేయండి. ఉమ్మడి రాష్ట్రంలోనే సింగపూర్ విధానాలను పరిశీలించి ఉమ్మడి రాష్ట్రంలో స్వచ్ఛతా కార్యక్రమాలు చేపట్టాం. ఆ తర్వాత క్లీన్ అండ్ గ్రీన్ పచ్చదనం పరిశుభ్రం పేరిట కార్యక్రమాలు నిర్వహించాం. స్వచ్ఛత అంటే పరిశుభ్రత పాటించేలా చూడడమే కాదు... ప్రజల ఆలోచనా విధానం కూడా మారేలా చూడాలి. ఇంట్లో చెత్తను రోడ్డు బయట వేయటం కొందరికి అలవాటు. డ్రెయిన్స్ లో చెత్తవేయటం వల్ల అవి అడ్డుపడి నీటి ప్రవాహానికి ఇబ్బంది. ఇలాంటి అలవాట్లకు ప్రజలు దూరం జరిగేలా చూడాలి. ఎలాంటి కార్యక్రమమైనా ప్రజల భాగస్వామ్యం ఉంటే సక్సెస్ అవుతుంది. అందర్నీ గేదర్ చేసి కార్యక్రమాలు నిర్వహిస్తే ఆయా కార్యక్రమాలు సక్సెస్ కావడంతో పాటు... ఒత్తిడి కూడా తగ్గుతుంది. దీన్ని దృష్టిలో పెట్టుకునే గతంలో హ్యాపీ సండే వంటి కార్యక్రమాలు చేపట్టాం. ప్రజలు ఆ కార్యక్రమాల్లో పాల్గొని తమ టాలెంట్ ను ప్రదర్శించేవారు. ఇక ఒత్తిడి తగ్గించుకునేందుకు లాఫింగ్ సొసైటీల నుంచి షౌటింగ్ సొసైటీలు ఏర్పాటు చేసేంత వరకు వెళ్లారు. జాతరలు వంటివి చేపట్టేది ప్రజల గ్యాదరింగ్ కోసమే. ఆ తరహాలోనే స్వచ్ఛాంధ్ర కార్యక్రమాలు చేపట్టాలి. స్వచ్ఛతాహీ సేవ సెప్టెంబరు 17 నుంచి అక్టోబరు 2 తేదీ వరకూ చేపట్టాలి.” అని సీఎం చెప్పారు.


*చేతి వృత్తులకు చేయూతనివ్వాలి*


“ఏటి కొప్పాక, కొండపల్లి బొమ్మలు మన సంస్కతీ సంప్రదాయం. ఆ బొమ్మలకు అవసరమైన కలప కోసం చెట్లు పెంచడానికి కలెక్టర్లు చర్యలు తీసుకోవాలి. చేతివృత్తులను, కుల వృత్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత మనపై ఉంటుంది. గిరిజన, వెనుకబడిన ప్రాంతాల్లో వెదురుతో చేసే ఉత్పత్తుల కోసం ఓ కార్యక్రమాన్ని రూపోందించండి. వెదురు ఉత్పత్తులు చేసేవారికి వెదురును సరఫరా చేసేలా చూడాలని కలెక్టర్లకు సూచనలు. చేతివృత్తులు, కులవృత్తులు దెబ్బతినకుండా కాపాడాలి. ఎన్ఆర్ఈజీఎస్ కింద ఘన వ్యర్ధాల షెడ్లు నిర్మాణానికి కేంద్రానికి లేఖ రాద్దాం. ఇక సీసీ రోడ్ల నిర్మాణం సమయంలో కాలువల కోసం మళ్లీ తవ్వకుండా ముందుగానే పైపులైన్లు పెట్టేలా నిర్మాణం చేపట్టండి. ఏజెన్సీ ప్రాంతాలను రూ-అర్బన్ సౌకర్యాలతో మోడల్ పంచాయితీలుగా తీర్చిదిద్దండి. రూరల్ ఏరియా అర్బన్ సౌకర్యాలతో ప్రాంతాలను అభివృద్ధి చేయండి. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో సీసీ రోడ్లు ఉన్నా.. డ్రెయిన్లు సరిగ్గా లేవు. ఇలాంటి చోట్ల మేజిక్ డ్రైన్ల నిర్మాణం చేపట్టాలి. చాలా చోట్ల మరుగుదొడ్లు లేవు. వాటి వాడకం కూడా జరగటం లేదు. పంచాయితీల్లో పిట్స్ ను ఎప్పటికప్పుడు క్లీన్ చేసేలా చూడాలి. అత్యవసర పనులకు నిధులు తక్షణం మంజూరు చేస్తాం.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.


*గ్రీన్ కవర్ పెంచే బాధ్యతను ముందుకొచ్చే కార్పోరేట్లకు అప్పజెప్పండి*


“సర్క్యులర్ ఎకానమీ పాలసీలు చేపట్టాం. ఐదు జోన్లలో ఐదు సర్క్యులర్ ఎకానమీ పార్కులు ఏర్పాటు చేస్తాం. సాలిడ్, లిక్విడ్ వేస్ట్ మేనేజ్మెంట్ అనేది సక్రమంగా జరగాలి. ప్రభుత్వ కార్యాలయాలు, ప్రాంగణాలు శుభ్రంగా ఉండేలా కలెక్టర్లు చూసుకోవాలి. నెట్ జీరో, వేస్ట్ టూ వెల్త్ కాన్సెప్టుతో పని చేయాలి. గ్రీన్ కవర్ పెంచడానికి కృషి చేయండి. 2029కి 39 శాతానికి 2047కి 50 శాతానికి గ్రీన్ కవర్ చేరుకోవాలి. కార్పోరేట్ సెక్టార్ ను కూడా గ్రీన్ కవర్ పెంచటంలో ఇన్వాల్వ్ చేయాలి. 10-20 మంది కార్పోరేట్లకు కొంత ప్రాంతం ఇస్తే ఫారెస్టు ఏరియాను అభివృద్ధి చేస్తారు. నగర వనాలు కూడా అభివృద్ధి చేయాలి. కార్తీక మాసాన్ని కూడా సెలెబ్రేట్ చేసుకుందాం. ఎకోటూరిజం మనకు అతిపెద్ద వనరు. విద్యార్ధులకు ఇచ్చిన గ్రీన్ పాస్ పోర్టును ప్రమోట్ చేయండి. పట్టణాల్లో స్వచ్ఛత కోసం తీసుకునే చిన్న చిన్న మార్పులే మంచి ప్రభావం చూపిస్తాయి.” అని సీఎం చెప్పారు. ఈ సమావేశంలో డెప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, పలువురు మంత్రులు పాల్గొన్నారు.

Comments