ప్రభుత్వ సేవలకు రేటింగ్స్.


ప్రభుత్వ సేవలకు రేటింగ్స్.


*కలెక్టర్ల నుంచి సెక్రటరీలు రిపోర్టులు కోరవద్దు*

*క్షేత్రస్థాయి సమాచారాన్ని ఆర్టీజీఎస్ నుంచి తీసుకోవాలి*

*మెరికల్లా ఉన్న యువ ఐఏఎస్‌ల సేవల్ని వాడుకుంటాం*

*టెక్నాలజీ వినియోగంపై మంత్రులు, అధికారులు కలెక్టర్లకు శిక్షణ*

*నవంబర్ నుంచి అందుబాటులోకి ఆర్టీజీ జిల్లా కేంద్రాలు*

*రెండో రోజు కలెక్టర్ల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు*

*క్వాంటం భవనాల డిజైన్లపై కలెక్టర్ల అభిప్రాయం కోరిన సీఎం*

అమరావతి, సెప్టెంబర్ 16 (ప్రజా అమరావతి): వివిధ ప్రభుత్వ శాఖలు అందించే సేవలకు ఇకపై రేటింగ్స్ ఇస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. క్వాంటం వ్యాలీ, వాట్సప్ గవర్నెన్స్, డేటా లేక్, ఆర్టీజీఎస్ లెన్స్, అవేర్ 2.0 అంశాలపై సీఎం సమీక్షించారు. పాలనలో టెక్నాలజీ వినియోగంపై జిల్లా కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ..”కొన్ని ప్రభుత్వ శాఖల పనితీరు మరింతగా మెరుగు పడాల్సి అవసరం ఉంది. గతంతో పోల్చుకుంటే కొన్ని శాఖల పనితీరు మెరుగు అయినా... రెవెన్యూ లాంటి శాఖల పనితీరు మరింత బాగుపడాల్సి ఉంది. ఎన్ని సార్లు చెబుతున్నా రెవెన్యూ శాఖ ప్రజలకు సంతృప్త స్థాయిలో సేవలు అందించటం లేదు. ఈ పరిస్థితుల్లో అన్ని ప్రభుత్వ సేవల్ని రేటింగ్ చేయాలని నిర్ణయించాం. కలెక్టర్లు చూసే దస్త్రాల క్వాలిటీ ఎంత ఉందో కూడా తనిఖీ చేస్తాం. సీనియర్ అధికారులు కూడా తమ పని విధానం మార్చుకోవాలి. ఇకపై తమ తమ శాఖలకు సంబంధించిన క్షేత్ర స్థాయి సమాచారం కోసం పదే పదే కలెక్టర్లను నివేదికలు అడిగే పరిస్థితి రాకూడదు. ఆర్టీజీఎస్ నుంచి అవసరమైన మేరకు నివేదికలు తీసుకోవాలి. దానికి అనుగుణంగా క్షేత్ర స్థాయిలో పని చేయించాలి. ఉన్నతాధికారులు కలెక్టర్లను రిపోర్టులు కోరుతూ ఉండడం వల్ల పనులు ముందుకు కదలడం లేదనే విమర్శలు వస్తున్నాయని... ఇకపై ఇలాంటి వాటికి చెక్ పెట్టాలి. ఆ కాలం ముగిసింది.” అని చంద్రబాబు స్పష్టం చేశారు.

*ఫైళ్లన్ని ఆన్ లైన్ చేయాల్సిందే*

“రెండు నెలల్లో 100 శాతం అన్ని ఫైళ్లు ఆన్ లైన్ లో ఉండాల్సిందే. మానుప్యులేషన్ లేకుండా ఫోరెన్సిక్ ఆడిటింగ్ లాంటివి కూడా తీసుకువస్తాం. నెక్స్ట్ జెన్ టెక్నాలజీ వైపు మనం ముందడుగు వేయాలి. ఆర్టీజీఎస్ ద్వారా అవేర్ వ్యవస్థను ఏర్పాటు చేశాం. దీని ద్వారా 42 రకాల సమాచారం కలెక్టర్లకు అందుతోంది. నవంబరు నెలలోగా డేటా లేక్ పూర్తిగా అందరికీ అందుబాటులోకి వస్తుంది. వచ్చే కలెక్టర్ల సదస్సు నాటికి ఏయే జిల్లాలు ఎక్కడెక్కడ తమ పనితీరు మెరుగుపరుచుకోవాలో కూడా రియల్ టైమ్ లో చెప్పేలా వ్యవస్థను తీర్చిదిద్దుతున్నాం. లాస్ట్ మైల్ వరకూ ప్రయోజనాలు అందేలా టెక్నాలజీ వినియోగించాలి. వచ్చే రెండేళ్లలో ఈ ఫలితాలను కూడా అందుకోవచ్చు. ఆర్టీజీ జిల్లా కేంద్రాలు నవంబర్ నాటికి సిద్దం అవుతాయి. టెక్నాలజీ వినియోగంపై అక్టోబరు నెలలో మంత్రులు, అధికారులు, కలెక్టర్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తాం.” అని సీఎం వెల్లడించారు.

*టెక్నాలజీ ఎకో సిస్టం తెస్తాం*
 
“ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కానీ... ఇతర అత్యవసర సమయాల్లో ప్రజలను అలెర్ట్ చేసేలా అలెర్ట్ బ్రాడ్ కాస్ట్ సిస్టం ఏర్పాటు చేయాలి. దీన్ని వివిధ ప్రాంతాల్లో చేపట్టాలి. అలాగే సీసీ టీవీ ఫుటేజీలను అనాలసిస్ చేసే పరిస్థితి తీసుకురావావి. బ్యాండ్ విడ్త్ లేని సమయం నుంచి అత్యధిక బ్యాండ్ విడ్త్ తో పనిచేసే సమయం వచ్చింది. చురుగ్గా ఉండే యువ అఖిల భారత సర్వీసు అధికారుల సేవల్ని వినియోగించుకుంటాం. ఏపీలో టెక్నాలజీ ఎకో సిస్టం క్రియేట్ చేసేందుకు ఐదుగురు యువ అధికారులను నియమించాం. టెక్నాలజీ రంగంతోపాటు... ఇన్నోవేషన్ వంటి రంగాల్లో కూడా యువ ఐఏఎస్సులకు బాధ్యత అప్పజెప్పాం. ఇటీవల కాలంలో నేను చాలా మంది ఐఏఎస్సులతో మాట్లాడాను. కొందరు యువ ఐఏఎస్సుల్లో చాలా ఆలోచనలు ఉన్నాయి. చాలా వినూత్నంగా ఆలోచిస్తున్నారు. అలాంటి వాళ్లను పికప్ చేస్తున్నాం.” అని చంద్రబాబు చెప్పారు.

*క్వాంటం భవనాల డిజైన్లు*

కలెక్టర్ల కాన్ఫరెన్సులో క్వాంటం వ్యాలీ భవనాల డిజైన్లను ప్రదర్శించారు. ఆ భవనాలపై కలెక్టర్ల అభిప్రాయాలను సీఎం కోరారు. భవిష్యత్తులో 3 వేల క్యూబిట్ క్వాంటం కంప్యూటర్ల ఏర్పాటుకు వీలుగా కార్యాలయ స్థలం అందుబాటులోకి రానున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. 80 వేలమంది పని చేసేలా క్వాంటం వ్యాలీ భవనాల నిర్మాణం చేపడుతున్నట్టు ముఖ్యమంత్రి చెప్పారు.
Comments