రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వల సామర్థ్యం పెంపు

 రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వల సామర్థ్యం పెంపు


ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని)

ఆక్సిజన్ వృథా అరికట్టడానికి మానటరింగ్ సెల్ లు ఏర్పాటు

రాష్ట్రంలో 49 మినీ ఆక్సిజన్ ప్లాంట్ల నిర్మాణానికి కేంద్రం అనుమతి

వ్యాక్సిన్ కోసం ఎన్ని కోట్లయినా వెచ్చిస్తాం... : డిప్యూటీ సీఎం

శాస్త్రీయమైన మందులనే వాడండి : మంత్రి కురసాల కన్నబాబు

అమరావతి, మే 12 (ప్రజా అమరావతి) : రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వల కెపాసిటీ పెంపునకు చర్యలు తీసుకుంటున్నట్లు ఉప ముఖ్యమంత్రి(వైద్య ఆరోగ్య శాఖ) ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్(నాని) తెలిపారు. ప్రస్తుతమున్న 517 మెట్రిక్ టన్నుల నుంచి 600 మెట్రిక్ టన్నుల కెపాసిటీ పెంపునకు చర్యలు తీసుకుంటున్నామని ఆయన వెల్లడించారు. ఆక్సిజన్ వృథా అరికట్టడానికి రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆసుపత్రుల్లోనూ మానటరింగ్ సెల్ ఏర్పాటు చేస్తున్నామన్నారు. మంగళగిరిలోని ఏపీఐఐసీ భవనంలో బుధవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబుతో కలిసి ఆయన మాట్లాడారు. కొవిడ్ నియంత్రణ కార్యక్రమంలో భాగంగా సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఏర్పాటు చేసిన అయిదుగురు మంత్రుల సబ్ కమిటీ సమావేశ వివరాలను వెల్లడించారు. ఆక్సిజన్, రెమిడెసివిర్ ఇంజక్షన్లు, ఆసుపత్రుల్లో బెడ్లు కల్పన, హోం ఐసోలేషన్ లో ఉన్న పేషంట్ల బాగోగులపైనా కూలంకషంగా చర్చించామన్నారు. రుయా ఆసుపత్రి ఘటన దురదృష్టకరమని, ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా పటిష్టచర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. ఆక్సిజన్ కొరత రానివ్వకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ఆక్సిజన్ ను సరఫరా చేసే పైప్ లైన్లను తరచూ పరిశీలించాలని, ఏవైనా లోపాలుంటే తక్షణమే మరమ్మతులు చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి స్పష్టం చేశారన్నారు. రోజు రోజుకూ పెరుగుతున్న కరోనా కేసుల దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ కు 910 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను పంపాలని కేంద్ర ప్రభుత్వానికి సీఎం జగన్మోహన్ రెడ్డి లేఖ రాశారన్నారు. రాష్ట్రంలో ఆక్సిజన్ నిల్వ సామర్థ్యం మరింత పెంచడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 517 మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ను నిల్వ చేసే సామర్థ్యం ఉందన్నారు. ఈ నిల్వ సామర్థ్యాన్ని 600 మెట్రిక్ టన్నుల సామర్థ్యానికి పెంచేలా ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోందన్నారు. రాష్ట్రంలో 49 మినీ ఆక్సిజన్ ప్లాంట్ల ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులిచ్చిందన్నారు. ఇప్పటికే కొన్ని ప్లాంట్లలో ఉత్పత్తి ప్రారంభమైందన్నారు. పూర్తిస్థాయిలో ఉత్పత్తి ప్రారంభమైతే రాష్ట్రంలో ఆక్సిజన్ కొరత తీరే అవకాశముందని మంత్రి ఆశాభావం వ్యక్తంచేశారు. 

ఆక్సిజన్ వృథా నివారణకు మానటరింగ్ సెల్ ల ఏర్పాటు...

ఆసుపత్రుల్లో ఆక్సిజన్ వృథా నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఇప్పటికే జిల్లా కేంద్రాల్లో మానటరింగ్ సెల్ లు ఏర్పాటు చేశారన్నారు. ఇపుడు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లోనూ మోనటరింగ్ సెల్ లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. నెల్లూరులో జిల్లాలో మోనటరింగ్ సెల్ పర్యవేక్షణతో 4 నుంచి 5 టన్నుల ఆక్సిజన్ ను ఆదా చేసినట్లు ఆయన తెలిపారు. ఆక్సిజన్ మేనేజ్ మెంట్ పై ప్రత్యేక దృష్టి సారించాలని మంత్రి కోరారు. 

వ్యాక్సిన్ కోసం ఎన్ని కోట్లయినా వెచ్చిస్తాం...

ఆర్థిక ఇబ్బందులున్నా రాష్ట్ర ప్రజలందరికీ ఉచిత వ్యాక్సినేషన్ చేయాలని సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిర్ణయించారని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. ఉచిత వ్యాక్సినేషన్ కు రూ.1600 కోట్లు వ్యయమవుతుందని, ఎన్ని కోట్లయినా వెచ్చించడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వ్యాక్సిన్ పై ప్రతిపక్షాలు అవాస్తవాలు చెబుతూ, ప్రజల్లో భయాందోళనలను రేకెత్తిస్తున్నాయని, ఇది సరికాదని ఆయన అన్నారు. ఒకే రోజు 60 లక్షల టీకాలు పంపిణీ చేసి, వ్యాక్సినేషన్ లో దేశానికే ఏపీ ఆదర్శంగా నిలిచిందన్నారు. ఇదీ వ్యాక్సినేషన్ పై సీఎం జగన్మోహన్ రెడ్డి సన్నద్ధతకు నిదర్శమని కొనియాడారు. తాము నిర్ణయించిన కోటా మేరకే రాష్ట్రాలకు వ్యాక్సిన్లు అందజేస్తున్నామని సుప్రీం కోర్టులో వేసిన అఫిడవిట్ లో కేంద్ర ప్రభుత్వం తెలిపిందన్నారు. వ్యాక్సిన్ పంపిణీ కేంద్రాల్లో రద్దీ నివారణకు ప్రత్యేక చర్యలు చేపట్టామన్నారు. రెండో డోస్ తీసుకునేవారికి వలంటీర్లు, ఎస్ఎంఎస్ ల ద్వారకా సమాచారమిచ్చి రద్దీని నివారించామన్నారు. టీకా పంపిణీ కేంద్రాల్లో షామియాన్లు, తాగునీరు వంటి సౌకర్యాలు కల్పిస్తున్నామన్నారు.

ప్రజలు భయాందోళనలు చెందొద్దు...

రెమిడెసివిర్ ఇంజక్షన్లను బ్లాక్ మార్కెట్ కు తరలిపోకుండా అడ్డుకున్నామని ఉప ముఖ్యమంత్రి ఆళ్ల నాని తెలిపారు. రెమిడెసివిర్ వినియోగంలో అక్రమాల నివారణకు టాస్క్ ఫోర్స్ కమిటీలు ఏర్పాటు చేశామన్నారు. రెమిడెసివిర్ ఇంజక్షన్ల కొరత లేకుండా చూస్తున్నామన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో బెడ్ల సంఖ్య పెంచుతున్నామన్నారు. ఆ సెంటర్లలో కరోనా బాధితులకు పౌష్టికాహారం, అవసరమైన మందులు పంపిణీ చేయడంతో పాటు పారిశుద్ధ్యంపైనా ప్రత్యేక దృష్టి సారించామన్నారు. హోం ఐసోలేషన్ లో ఉన్న రోగులకు అవసరమైన కిట్లు అందజేస్తున్నామన్నారు. 104 కాల్ సెంటర్ కు వచ్చే ప్రతి ఫోన్ కాల్ కూ స్పందించాలని అన్ని జిల్లాల కలెక్టర్లను సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశించారన్నారు. ప్రజలు భయాందోళనలు చెందాల్సిన అవసరం లేదని, కరోనా నియంత్రణకు సీఎం జగన్మోహన్ రెడ్డి పటిష్ట చర్యలు తీసుకుంటున్నారని తెలిపారు. 

రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కురసాల కన్నబాబు మాట్లాడుతూ, రాష్ట్రంలో కొవిడ్ కేర్ సెంటర్లను మరింత బలోపేతం చేయాలని అయిదుగురు మంత్రుల సబ్ కమిటీ సిఫార్సు చేసిందన్నారు. కొవిడ్ కేర్ సెంటర్లలో 15 వేలకు పైగా బెడ్లు ఏర్పాటు చేశామన్నారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్స్ లను అడ్డుకోవడం వల్ల కలిగే ఇబ్బందులపై తెలంగాణా ప్రభుత్వంతో చర్చించామన్నారు. ప్రస్తుతం తెలంగాణా బోర్డర్ల వద్ద ఏపీ అంబులెన్స్ లను అడ్డుకోవడం లేదన్నారు. కరోనా నివారణకు ఒళ్లంతా ఆవు పేడ పూసుకోవాలని, ముక్కులో ఉల్లి రసం వేసుకోవాలని....సూచిస్తూ సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారాన్ని నమ్మొద్దన్నారు. శాస్త్రీయమైన, నిపుణులు సూచించే పరిష్కార మార్గాలనే పాటించాలని మంత్రి కోరారు. కరోనా లక్షణాలు గుర్తించిన వెంటనే వైద్య సేవలు పొందాలని మంత్రి కన్నబాబు సూచించారు. 


Comments