*ఏపీ అమూల్ ప్రాజెక్టు మరో జిల్లాకు విస్తరణ*
*నేటి (4వ తేదీ శుక్రవారం) నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ*
*క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించనున్న సీఎం శ్రీ వైయస్ జగన్*
అమరావతి (ప్రజా అమరావతి);
పాడి రైతులకు అదనంగా గిట్టుబాటు ధర కల్పిస్తూ, సహకార రంగంలోని డైరీల పునరుద్ధరణకు ఏపీ అమూల్ ప్రాజెక్టు చేపట్టిన ప్రభుత్వం, ఆ దిశలో మరో అడుగు ముందుకు వేస్తోంది. ప్రాజెక్టులో భాగంగా శుక్రవారం నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణ మొదలు పెడుతున్నారు. క్యాంప్ కార్యాలయం నుంచి సీఎం శ్రీ వైయస్ జగన్ వర్చువల్గా ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు.
*అమూల్ పాల సేకరణ:*
రాష్ట్రంలో అమూల్ సంస్థ ఇప్పటికే చిత్తూరు, వైఎస్సార్ కడప, ప్రకాశం, గుంటూరు జిల్లాలలో పాలు సేకరిస్తుండగా, కొత్తగా పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా పాలు సేకరించనున్నారు. జిల్లాలో తొలి విడతగా 142 గ్రామాల్లో పాలు సేకరిస్తారు. పాల నాణ్యత, వెన్న ఆధారంగా లీటర్కు రూ.5 నుంచి రూ.7 వరకు రైతులకు అదనపు ఆదాయం లభించే విధంగా ప్రభుత్వం ఏపీ అమూల్ ప్రాజెక్టు అమలు చేస్తోంది.
పశ్చిమ గోదావరి జిల్లాలో పాల సేకరణకు సంబంధించి దాదాపు 15 వేల మంది రైతులను గుర్తించి రిజిస్ట్రేషన్ పూర్తి చేశారు. పాలు సేకరిస్తున్న అమూల్ సంస్థ పాడి రైతులకు 10 రోజులకు ఒకసారి బిల్లు చెల్లిస్తోంది. నేరుగా రైతుల ఖాతాల్లో ఆ మొత్తం జమ చేస్తోంది.
addComments
Post a Comment