వచ్చే సెప్టెంబర్ మాసంలో రచ్చబండ కార్యక్రమం మొదలు కానుందని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు వెల్లడించారు.

 నెల్లూరు, ఆగస్టు 16 (ప్రజా అమరావతి):---వచ్చే సెప్టెంబర్ మాసంలో రచ్చబండ కార్యక్రమం మొదలు కానుందని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు  వెల్లడించారు.


సోమవారం ఉదయం నగరంలోని కలెక్టరేట్  తిక్కన ప్రాంగణంలో జిల్లా కలెక్టర్ " స్పందన-  ప్రజా విజ్ఞప్తుల దినం"  కార్యక్రమం  నిర్వహించి ప్రజల నుండి అర్జీలు స్వీకరించారు.  అంతకుమునుపు జిల్లా కలెక్టర్ జిల్లా అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి వచ్చే సెప్టెంబరు మాసంలో రచ్చబండ కార్యక్రమం చేపట్టే అవకాశం ఉందన్నారు. జిల్లాలో  ఏదో ఒక గ్రామం ఎంపిక చేస్తారన్నారు. ఆ గ్రామంలో సంతృప్తస్థాయిలో అన్ని ప్రభుత్వ పథకాలు సక్రమంగా అమలు జరిగి ఉండాలన్నారు. ఏ మాత్రం లోపం ఉన్న  సంబంధిత అధికారులే  బాధ్యత వహించి పరిణామాలను ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు.  ప్రతి గ్రామంలో  అన్ని ప్రభుత్వ పథకాలు ఎలా అమలు అవుతున్నాయో గమనించాలని,  అందుకు సంబంధించిన పూర్తి సమాచారం సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. లబ్ధిదారుల జాబితా అందుబాటులో ఉండాలని,  ఎవరికైనా ప్రయోజనం దక్కకపోతే ఎందుకు ఇవ్వడం లేదు దానికి సంబంధించిన కారణాలు కూడా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు.  ఏ ప్రభుత్వ పథకం ఎప్పుడు ఇస్తున్నామో ప్రజలకు వివరంగా తెలపాలన్నారు.  పింఛన్, రేషన్ సక్రమంగా పంపిణీ చేయాలన్నారు. అందరూ బాగా కృషి చేసి నిన్నటి  75 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను విజయవంతం చేశారని అధికారులందరినీ కలెక్టర్ ఈ సందర్భంగా  అభినందించారు. గత సంవత్సర కాలంలో జిల్లాలో అమలైన వివిధ ప్రభుత్వ పథకాలను,కార్యక్రమాలను ప్రదర్శనశాల లోనూ, శకటాల ద్వారాను చక్కగా ప్రదర్శించారని కితాబిచ్చారు.   జిల్లాలో రాబోయే సంవత్సర కాలంలో చేయబోతున్న కార్యక్రమాల వివరాలను కూడా చెప్పడం జరిగిందని,  వాటన్నిటికీ ప్రాధాన్యతనిచ్చి అంకితభావంతో అమలు జరపాలన్నారు. ప్రతి మంగళవారం ప్రభుత్వ స్థాయిలో రాష్ట్ర ముఖ్యమంత్రి  సమీక్ష చేస్తున్నారని,   జాతీయ ఉపాధి హామీ పథకం, పంచాయతీ రాజ్, ఆరోగ్యం, పేదలందరికీ ఇల్లు తదితర ప్రభుత్వ పథకాలలొ మంచి పనితీరు,  కొలమానాలు గమనించి వచ్చే గణతంత్ర దినోత్సవం నాడు  పురస్కారాలు అందజేయడం జరుగుతుందన్నారు. కోవిడ్ నేపథ్యంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకల సందర్భంగా వివిధ ప్రభుత్వ శాఖల  సిబ్బందికి నేరుగా ప్రశంసాపత్రాలు ఇవ్వలేక__ పోయామని, వాటిని సంబంధిత జిల్లా అధికారులు వారివారి సిబ్బందికి అందచేయాలని తెలుపుతూ వారి సర్వీసు రిజిస్టర్ లో కూడా ఆ వివరాలు నమోదు చేయాలని సూచించారు. ప్రతి సోమవారం ప్రజల నుండి అందే స్పందన అర్జీలను సంఖ్యాపరంగా,నాణ్యతా వరంగా ప్రమాణాలు పాటిస్తూ  అన్ని అర్జీలను పరిష్కరించాలన్నారు.   కొన్ని అర్జీలు  మరల మరల వస్తున్నాయని,  వాటికి సంబంధించి ఎందుకు చేయడం లేదొ ప్రజలకు అర్థమయ్యే విధంగా తెలియ చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు.  ప్రతి గ్రామంలో నవరత్నాలు తదితర ప్రభుత్వ పథకాలు సంబంధించి వచ్చే అభ్యర్థనలు,  రాష్ట్ర ముఖ్యమంత్రి, ఎమ్మెల్సీ ,ఎమ్మెల్యే తదితర ప్రముఖులను నుండి వచ్చే  అభ్యర్థనలను సజావుగా పరిష్కరించాలన్నారు. వివిధ ప్రభుత్వ పథకాల కు సంబంధించి చేపట్టిన పనుల విషయంలో సంబంధిత ఇంజనీరింగ్  శాఖ అధికారులు శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలు  సందర్భంగా శిలా ఫలకాల లో  తప్పనిసరిగా జిల్లా ప్రోటోకాల్ అధికారి అయిన జిల్లా రెవెన్యూ అధికారి ని ముందుగా సంప్రదించి  ప్రోటోకాల్ విధిగా పాటించాలని ఆదేశించారు. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ కార్యక్రమాలన్నీ ప్రోటోకాల్ ప్రకారమే విధిగా జరిగేలా సంబంధిత తహసీల్దార్లు,  ఎంపీడీవోలు బాధ్యత వహించాలన్నారు. ఈ సందర్భంగా ఈ జిల్లా మేనేజర్ శ్రీరాములు  స్పందన అర్జీల పరిష్కారంపై  పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు.  ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ లు శ్రీ హరెందిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ  విదేహ్ ఖరే, శ్రీమతి రోజ్ మాండ్, డిఆర్ ఓ శ్రీ చిన్న ఓబులేసు,   తెలుగు గంగ ప్రత్యేక కలెక్టర్, శ్రీ  నాగేశ్వరరావు,  జడ్పీ సీఈఓ శ్రీమతి పి సుశీల,  డి ఆర్ డి ఏ పి డి శ్రీసాంబశివారెడ్డి, డ్వామా పి డి శ్రీ తిరుపతయ్య,  డి పి ఓ శ్రీమతి ధనలక్ష్మి డి ఎస్ ఓ శ్రీ సుధాకర్ తదితర జిల్లా అధికారులు  పాల్గొన్నారు. ..........................….............. ఉప సంచాలకులు , సమాచార పౌర సంబంధాల శాఖ,  నెల్లూరు వారిచే జారీ చేయబడినది

Comments