డా. అబ్దుల్ కలాం ఆదర్శంగా యువత ఉన్నత లక్ష్యాలు సాధించాలి

 * డా. అబ్దుల్ కలాం ఆదర్శంగా  యువత ఉన్నత లక్ష్యాలు సాధించాలి


:

రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు


* ఎపిఎస్‌ఎస్‌డిసి ఆధ్వర్యంలో తగరపువలసలోని అవంతి ఇంజనీరింగ్ కాలేజ్ లో మెగా జాబ్ మేళా


* మెగా జాబ్ మేళాలో వివిధ కంపెనీల్లో 1860 ఉద్యోగాలు 


* హాజరైన 3750 మంది యువతకు 32 కంపెనీల ప్రతినిధులతో ఇంటర్య్వూలు



విశాఖపట్నం, ఆగస్టు 31 (ప్రజా అమరావతి):

యువత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఎపిజె అబ్దుల్ కలాంను ఆదర్శంగా తీసుకుని జీవితంలో ఉన్నత లక్ష్యాలు చేరుకోవాలని రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ (ఎపిఎస్‌ఎస్‌డిసి) ఆధ్వర్యంలో తగరపువలసలోని అవంతి కాలేజ్ లో జరిగిన జాబ్ మేళా-2021 లో మంత్రి పాల్గొన్నారు. ఈ జాబ్ మేళా యువతకు ఒక నిచ్చెన వంటిదని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు వెళ్లాలన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నిరుద్యోగ యువతను దృష్టిలో పెట్టుకుని స్థానికులకే 75 శాతం ఉద్యోగాలు ఇచ్చేలా జీవో తీసుకొచ్చారని తెలిపారు. కంపెనీలు కూడా స్థానికులకు ఉద్యోగాలు కల్పించడం ద్వారా నిరుద్యోగాన్ని తగ్గించాలనేది ముఖ్యమంత్రి ఉద్దేశమని ఆయన చెప్పారు. 


డిగ్రీ చదివిన యువత కూడా తమకు ఆసక్తి ఉన్న రంగాలను ఎంచుకుని జీవితంలో పైకి ఎదగాలన్నారు. హార్డ్ వర్క్, డెడికేషన్ ఉంటే అనుకున్న లక్ష్యాలను సాధించవచ్చని.. తమలోనున్న నైపుణ్యంతో ప్రపంచంలో ఎక్కడైనా ఉద్యోగ అవకాశాలు పొందవచ్చునని అన్నారు. యువతకు ముఖ్యంగా కమ్యూనికేషన్ స్కిల్స్, హార్డ్ వర్క్, నిజాయితీ, నిబద్ధత ఎంతో ముఖ్యమని అన్నారు. ప్రతిరంగంలోనూ మంచి, చెడు ఉంటాయని.. మంచివైపు అడుగులేస్తూ జీవితంలో ఎదగాలని అన్నారు.  స్వామి వివేకానంద భావాలను యువత ఆదర్శంగా తీసుకోవాలని ఆయన నిజమైన హీరో అన్నారు. జాబ్ మేళాలో 1860 పోస్టులు ఉన్నాయని.. 32 సంస్థలు ఉద్యోగాలు కల్పించేందుకు వచ్చాయని.. విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని జీవితంలో మరింత ఉన్నత స్థానాలకు ఎదగాలని మంత్రి అభిలాషించారు. 


అనంతరం ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం యువతలో నైపుణ్యాలు పెంచడంతోపాటు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందేలా చర్యలు తీసుకుంటోందన్నారు. ఇందులో భాగంగానే మన జిల్లాలో త్వరలోనే 3 స్కిల్ కాలేజీలు ఏర్పాటు కానున్నాయని ఆయన అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాలేజీ విద్యార్థులను ఆర్థికంగా ఆదుకోవడం కోసం అమ్మఒడి కార్యక్రమాన్ని ప్రారంభించారని ఆయన గుర్తు చేశారు. ఇలాంటి జాబ్ మేళాలు జీవితంలో స్థిరపడడానికి ఒక అవకాశంగా  యువత వినియోగించుకోవాలని ఆయన సూచించారు. 


ఈ కార్యక్రమంలో మంత్రి అవంతి శ్రీనివాస్ తోపాటు జాయిట్ కలెక్టర్ ఎం. వేణుగోపాల్ రెడ్డి, డీసీపీ గౌతమి షాలి, ఎపిఎస్‌ఎస్‌డిసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ డి.వి. రామకోటి రెడ్డి, అవంతి ఇంజనీరింగ్ కాలేజీ ప్రిన్సిపాల్ ఎస్ఎన్వీ గణేష్, జిల్లా నైపుణ్యాభివృద్ధి సంస్థ అధికారి చాముండేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

Comments