*విద్యార్థులను ఆకట్టుకుంటున్న సర్కారీ బడులు*..
• *రూ.731.30 కోట్ల ఖర్చుతో తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలో 2వ విడత జగనన్న విద్యాకానుక కిట్ల పంపిణీ*
• *సీబీఎస్ఈ సిలబస్ తో ప్రాథమిక స్థాయి నుండే ఆంగ్లంలో విద్యాబోధన*
• *విద్యార్థులకు ఆంగ్లంలో నైపుణ్యాలు పెంపొందించేందుకు ఇంగ్లీష్ ల్యాబ్ లు*
• *‘మనబడి-నాడు నేడు’ కార్యక్రమం ద్వారా కార్పొరేట్ లకు ధీటుగా ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతుల కల్పన*
• *విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతో ప్రభుత్వ పాఠశాలల్లో పెరిగిన విద్యార్థుల సంఖ్య*
• *విద్యారంగంపై ఇప్పటి వరకు రూ.29,114.37 కోట్లు ఖర్చు చేసిన ప్రభుత్వం*
అమరావతి (ప్రజా అమరావతి);
“ఉన్నత చదువులే పిల్లలకు మనం ఇవ్వగలిగే ఆస్తి అని, చదువులకు చేసే ఖర్చంతా రాష్ట్రంలోని పిల్లల భవిష్యత్ కు పెట్టుబడి” అని బలంగా విశ్వసించిన ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ఆ దిశగా వడివడిగా అడుగులు వేసి విద్యారంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టారు.
విద్యాసంవత్సరం విద్యార్థులకు భారం కాకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి “జగనన్న విద్యాకానుక” పథకం ప్రవేశపెట్టి రాష్ట్రంలోని ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో చదివే 42,34,322 మంది విద్యార్థులకు వారి విద్యాభ్యాసానికి అవసరమైన ఏడు రకాల వస్తువులను కిట్ల రూపంలో అందిస్తున్నారు. పాఠశాలల్లో పిల్లల నమోదును గణనీయంగా పెంచడంతో పాటు, మెరుగైన ఫలితాలు సాధించడమే ధ్యేయంగా దేశంలో ఎక్కడా లేని విధంగా ఒకటవ తరగతి నుంచి 10వ తరగతి వరకు విద్యార్థిని, విద్యార్థులకు ప్రత్యేక స్కూల్ కిట్ల పంపిణీ కార్యక్రమం చేపట్టింది. ఇప్పటికే మొదటి విడతగా రూ.648.10 కోట్ల ఖర్చుతో స్కూల్ కిట్లు పంపిణీ చేయగా, రూ.731.30 కోట్ల ఖర్చుతో రెండో విడత పంపిణీ కార్యక్రమాన్ని స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా నేడే తూర్పుగోదావరి జిల్లా పి.గన్నవరంలోని జిల్లా పరిషత్ హైస్కూల్ లో ముఖ్యమంత్రి ప్రారంభిస్తున్నారు.
*ప్రత్యేక ఆకర్షణగా విద్యార్థులకు ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్- తెలుగు డిక్షనరీలు* :
పాఠశాలల్లో పిల్లలను చేర్పించేందుకు తల్లిదండ్రులపై ఆర్థికభారం పడకూడదన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన జగనన్న విద్యాకానుక పథకాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. విద్యాకానుక కిట్ ద్వారా ప్రతి విద్యార్థికి ఉచితంగా అందించే బై లింగువల్ పాఠ్యపుస్తకాలు, నోట్ బుక్ లు, వర్క్ బుక్ లు, కుట్టుకూలితో సహా మూడు జతల యూనిఫాం క్లాత్, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగుతో పాటు ఆక్స్ ఫర్డ్ ఇంగ్లీష్-తెలుగు డిక్షనరీలు అందిస్తున్నారు.
సీబీఎస్ఈ సిలబస్ తో ప్రాథమిక స్థాయి నుండే ఆంగ్లంలో విద్యాబోధన, ‘జగనన్న విద్యాకానుక’ ద్వారా కిట్ల పంపిణీ కారణంగా ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్లు బాగా పెరిగాయి. కొన్ని స్కూళ్లలో 100 శాతానికి పైగా కూడా ఎన్ రోల్ మెంట్ పెరిగిందని ఉపాధ్యాయులు చెబుతున్నారు. గతంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య కేవలం 37 లక్షలుగా ఉంటే, ప్రస్తుతం వారి సంఖ్య గణనీయంగా పెరిగి 43 లక్షలకు చేరింది. దీన్ని బట్టి విద్యారంగం పటిష్టతపై ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి తెలుస్తోంది. ప్రభుత్వం విద్యారంగంలో తీసుకువచ్చిన విప్లవాత్మక మార్పులతో 6 లక్షల మంది విద్యార్థులు అదనంగా ప్రభుత్వ పాఠశాలల్లో చేరడం సానుకూల పరిణామం...
*ఆంగ్లంలో నైపుణ్యాలు పెంపొందేందుకు ఇంగ్లీష్ ల్యాబ్ లు* :
జగనన్న అమ్మఒడి, జగనన్న విద్యా దీవెన, జగనన్న వసతి దీవెన వంటి పథకాల ద్వారా ప్రభుత్వం విద్యార్థుల తల్లుల ఖాతాల్లో ఆర్థిక సాయం జమ చేయడమే గాక విద్యార్థుల కోరిక మేరకు నగదు లేదా ల్యాప్ టాప్ అందిస్తోంది ప్రభుత్వం. అదేవిధంగా జగనన్న గోరుముద్ద ద్వారా రోజూ మెనూ మార్చి రుచికరమైన, నాణ్యమైన, పౌష్టికాహారాన్ని అందిస్తోంది. ‘మనబడి-నాడు నేడు’ కార్యక్రమం ద్వారా పాఠశాలలో విద్యార్థులకు, ఉపాధ్యాయుకు ఫర్నీచర్, రక్షిత త్రాగునీరు, పెయింటింగ్, ఆకర్షణీయంగా కనిపించే ప్రహారీ గోడ, పాఠశాలకు అవసరమైన మరమ్మతులు, రంగు రంగుల బెంచీలు, విశాలమైన ఆట స్థలం, నిరంతర నీటి వసతితో కూడిన మంచి బాత్ రూమ్ లు, గ్రీన్ చాక్ బోర్డు, ప్రతి గదికి ఫ్యాన్లు, ట్యూబ్ లైట్లు, వంటగది, ఆంగ్లంలో నైపుణ్యాలు పెంపొందేందుకు ఇంగ్లీష్ ల్యాబ్ లు వంటి మౌలిక వసతుల కల్పనతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారాయి. కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా ప్రభుత్వం కల్పిస్తున్న వసతులతో తమ పిల్లలు కాన్వెంట్ లకు వెళుతున్నారు అని గర్వంగా చెప్పుకునే స్థాయికి పేదోడు ఎదిగాడని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు.
*విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో దేశంలోని ఇతర రాష్ట్రాలకు ఆదర్శం గా నిలిచిన ఏపీ*:
రాష్ట్రంలో 34 వేలకు పైగా ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చేసి ఏ సిలబస్ తీసుకున్నా కూడా ఇంగ్లిష్, తెలుగు మాధ్యమాల్లో పాఠ్యపుస్తకాలు అందించిన మొట్టమొదటి ప్రభుత్వం ఏపీనే. ప్రతి తరగతికి తెలుగు తప్పనిసరి సబ్జెక్ట్ గా తీసుకురావడమే గాక సీబీఎస్ఈతో అనుసంధానం చేసింది. మరోవైపు నూతన విద్యావిధానంలో స్కూళ్లను 6 రకాలుగా వర్గీకరించి.. ఏ స్కూల్ మూసివేయ కూడదు.. ఏ ఒక్క టీచర్ను తీసేయడకూడదని నిర్ణయించిన ప్రభుత్వం ప్రతి సబ్జెక్ట్ కు ఒక టీచర్, ప్రతి తరగతికి ఒక గది ఉండేలా చర్యలు తీసుకుంటోంది. తాజాగా రాష్ట్రంలో కొత్తగా 4,878 అదనపు తరగతి గదులు మంజూరు చేస్తూ ఇటీవలే మంత్రిమండలి కూడా తీర్మానం చేసింది.
జగనన్న అమ్మ ఒడి, జగనన్న విద్యాదీవెన, జగనన్న వసతి దీవెన, జగనన్న గోరుముద్ద, జగనన్న విద్యా కానుక, మనబడి నాడు-నేడు కింద విద్యారంగంపై ఇప్పటి వరకు రూ.29,114.37 కోట్ల ఖర్చు చేయడమే కాకుండా వైఎస్సార్ ప్రీ ప్రైమరీ స్కూళ్లుగా అప్ గ్రేడ్ కాబోతున్న అంగన్ వాడీలలో ఆటపాటలతో విద్యాబోధన ద్వారా పిల్లల శారీరక, మానసిక వికాసానికి గట్టి పునాదులు వేయడమే గాకుండా పిల్లలు, గర్భిణీలు, బాలింతల పోషకాహారం కోసం వైఎస్సార్ సంపూర్ణ పోషణ పథకం ద్వారా మరో రూ.1800 కోట్లు అదనంగా ఖర్చు చేస్తోంది ప్రభుత్వం.
పేద విద్యార్థులు కూడా పెద్ద చదువులు చదువుకోవాలని, వారి కుటుంబాలు ఆర్థికంగా స్థిరపడాలని, రాబోయే రోజులు మన విద్యార్థులు ప్రపంచంతో పోటీపడి గెలవాలన్న సమున్నత లక్ష్యంతో వినూత్న పథకాలు ప్రవేశపెట్టి విద్యార్థుల బంగారు భవిష్యత్ కు బాటలు వేస్తున్న ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డిని యావత్ ప్రపంచం కొనియాడుతోంది.
రాష్ట్రంలో జగనన్న విద్యా కానుక అమలు, విద్యారంగంలో విప్లవాత్మక మార్పులతో చిన్నారులు బడికెళ్ళడం ఒక వేడుకగా మారడమే కాదు, ప్రభుత్వ పాఠశాలలు పండుగ శోభను సంతరించుకోనున్నాయనడంలో ఎటువంటి అతిశయోక్తి లేదు. ముఖ్యమంత్రి శ్రీ వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి విద్యారంగానికిస్తున్న ప్రాధాన్యతతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో పోటీపడేందుకు ఆంధ్రప్రదేశ్ నవతరం సన్నద్ధమవుతోంది.
addComments
Post a Comment