కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో పేద ప్రజలకు మంచి జీవనోపాధిని కల్పించే జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించడం

 

రంపచోడవరం ,ఆగస్టు04 (ప్రజా అమరావతి);


   *కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో పేద ప్రజలకు మంచి జీవనోపాధిని కల్పించే జీడిపిక్కల ప్రాసెసింగ్ యూనిట్లు ప్రారంభించడం


శుభ పరిణామమని జిల్లా కలెక్టర్ సి. హరికిరణ్ పేర్కొన్నారు.*

      బుధవారం రంపచోడవరం పందిరిమామిడి కృషి విజ్ఞాన కేంద్రంలో వ‌న్ ధ‌న్ వికాస్ కేంద్రం (వీడీవీకే)నిధులతో  దాదాపు రూ.25 లక్షలతో నూతనంగా నిర్మించిన జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్‌ను స్థానిక శాసన సభ్యురాలు నాగులపల్లి ధనలక్ష్మి, ఐటిడీఎ పీవో సీవీ.ప్రవీణ్ ఆదిత్య లతో కలిసి జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ ప్రారంభించారు.

       ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బడుగు ,బలహీన, పేద వర్గాల అభివృద్ధే ధ్యేయంగా రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు, జీవనోపాధి కల్పించే అనేక కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు నేరుగా (డీబిటి) లబ్ధి చేకూరే విధంగా  వేల కోట్ల రూపాయలు రైతు భరోసా, మత్స్యకార భరోసా నేతన్న నేస్తం,విద్యార్థులకు ఫీజు అందించడం,ఇతర సంక్షేమ పథకాల ద్వారా అందిస్తుందన్నారు.  రంపచోడవరం డివిజన్ ప్రాంతానికి సంబంధించి సుమారుగా 66 వేల ఎకరాలలో దాదాపు 20 వేల మంది రైతులు జీడిమామిడి పంటను సాగు చేస్తున్నారన్నారు. 15 వన్ ధన్ వికస్ కేంద్రాలలో సుమారుగా 4,500 మంది సేకరించిన జీడి పిక్కలను ప్రాసెసింగ్ చేసుకునే విధంగా కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వ నిధులను సేకరించి దాదాపు రూ.25 లక్షల వ్యయంతో జీడి పిక్కల ప్రాసెసింగ్ యూనిట్ స్థాపించడం జరిగింది అన్నారు.దీని ద్వారా గిరిజన ప్రాంత రైతులకు ప్రతి కేజీకు సుమారుగా రూ.200 నుంచి 300లు వరకు అదనంగా లాభం చేకూరుతుందన్నారు. జీడీ మామిడి సాగు చేసే రైతులకు ఈ యూనిట్ అధిక ఆదాయాన్ని ఇస్తుందన్నారు .జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన తరువాత తొలిసారిగా రంపచోడవరం ప్రాంతంలో కోవిడ్ వంటి క్లిష్ట పరిస్థితుల్లో పేద  ప్రజలకు మంచి జీవనోపాధిని కల్పించి యూనిట్ ను ప్రారంభించడం సంతోషాన్నిచ్చిందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాసెసింగ్ యూనిట్ పనితీరు ఆధారంగా మిగిలిన 6 మండలాల్లో కూడా ఇటువంటి ప్రాసెసింగ్ యూనిట్లను విస్తరించేందుకు  కృషి చేయడం జరుగుతుందని  కలెక్టర్ తెలిపారు.

జీడి పిక్క‌ల ప్రాసెసింగ్ యూనిట్‌లో ప్రాసెసింగ్ యంత్ర పరికరాల పనితీరు, జీడి పిక్కల ప్రాసెసింగ్ విధానం ఎమ్మెల్యే నాగులపల్లి ధనలక్ష్మి ,పీవో ప్రవీణ్ ఆదిత్య తో కలిసి కలెక్టర్ ఈ సందర్భంగా పరిశీలించి  అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం

పనసతో విలువ ఆధారిత ఉత్ప‌త్తుల తయారీపై రూపొందించిన క‌ర‌దీపిక‌ను కలెక్టర్ ఆవిష్క‌రించి‌ , కృషి విజ్ఞాన కేంద్రం ఆవరణంలో మొక్కలు నాటారు.

     ఈ కార్య‌క్ర‌మంలో రంప‌చోడవరం  సబ్ కలెక్టర్ కట్టా సింహాచలం, డా. వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయ కృషి విజ్ఞాన కేంద్రం హెచ్‌వోడీ డా. లలిత కామేశ్వరి, అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్ (వెలుగు) చిన్న శ్రీనివాసరావు, డ్వామా అసిస్టెంట్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఏ.ముఖ‌లింగం, వివిధ స్వయం సహాయక సంఘాల మహిళలు ఇతర అధికారులు పాల్గొన్నారు.


Comments