కాకినాడ, ఆగస్టు 02 (ప్రజా అమరావతి);,
సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో జిల్లాస్థాయి ఉన్నతాధికారులు ఇళ్ల స్థలాల పట్టాలు, గృహాల మంజూరు, ఉపాధి కల్పన, పింఛన్లు, స్కాలర్షిప్, భూ వివాదాలు, బియ్యంకార్డు మంజూరు తదితరాలకు
సంబంధించి దాదాపు 435 అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీల తక్షణ పరిష్కారానికి కలెక్టర్, జాయింట్ కలెక్టర్లు అధికారులకు ఆదేశాలు జారీచేశారు. గడువులోగా పరిష్కరించేందుకు సూచనలు చేశారు.
- గత నెలలో ఎస్సీ కులానికి చెందిన కలవల అంజిబాబు మరణించగా.. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం పరిధిలో ఆయన భార్య కలవల అనితకు రెవెన్యూ శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా కారుణ్య నియామక పత్రాన్ని కలెక్టర్ ఈ సందర్భంగా అందజేశారు.
*దివ్యాంగులకు ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లు అందించిన కలెక్టర్*
పదో తరగతి, ఇంటర్ చదువుతున్న బధిర (మూగ, చెవిటి) విద్యార్థులతో పాటు డిగ్రీ, పీజీ చదువుతున్న దివ్యాంగులకు రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా అందించిన ల్యాప్టాప్, మొబైల్ ఫోన్లను సోమవారం స్పందన కార్యక్రమంలో భాగంగా వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ కామరాజు, జాయింట్ కలెక్టర్ (ఆసరా,సంక్షేమం) జి.రాజకుమారి సమక్షంలో జిల్లా కలెక్టర్ సి.హరికిరణ్ పది మంది విద్యార్థులకు అందజేశారు.
- కాకినాడ గ్రామీణ నియోజకవర్గంలోని ఇంద్రపాలెం వాసి సూరంపూడి మాధవ స్థానిక ఐడియల్ కళాశాలలో24 సంవత్సరాలు నుంచి అటెండర్గా పనిచేస్తున్నానని, 2020లో కోవిడ్ కారణంగా ఉద్యోగం నుంచి తొలగించడం జరిగిందని ఏదైనా ఉద్యోగ అవకాశం కల్పించాలని కలెక్టర్కు అర్జీని అందించగా.. ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ ఆర్ఐవోను పరిష్కరించాలని ఆదేశించారు.
- పెదపూడి మండలం, గొల్లల మామిడాడ గ్రామానికి చెందిన ఆర్వీఎం ఆచార్యులు తనకు 2013లో చొల్లంగి వద్ద రాజీవ్ స్వగృహలో గృహం మంజూరైందని, అక్కడ సరైన తాగునీరు, రోడ్లు లేక నానా ఇబ్బందులు పడుతున్నామని తాగునీరు సరఫరా, రోడ్లు వేయాలని కలెక్టర్కు విజ్ఞప్తి చేయగా సమస్యను పరిష్కారించాల్సిందిగా రాజీవ్ స్వగృహ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
- మండపేట మండలం, కేశవరం గ్రామానికి చెందిన కామిరెడ్డి జాన్ ప్రసాదు తమ నివాసాలకు దగ్గరలో డ్రైనేజీ నిమిత్తం కేటాయించిన స్థలంలో ఆక్రమణలు తొలగించి డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటుచేయాలంటూ కలెక్టర్కు విజ్ఞప్తి చేయగా పరిష్కరించాల్సిందిగా మండపేట ఎంపీడీవోను ఆదేశించారు.
addComments
Post a Comment