వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి సరికొత్తగా ఎస్వీ మ్యూజియం : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి

 వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి సరికొత్తగా ఎస్వీ మ్యూజియం : టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి


తిరుమల, 28 నవంబరు (ప్రజా అమరావతి): తిరుమలలోని శ్రీ వేంకటేశ్వర మ్యూజియాన్ని సరికొత్తగా అభివృద్ధి చేసి వచ్చే బ్రహ్మోత్సవాల నాటికి భక్తులకు అందుబాటులోకి తీసుకురావాలని టిటిడి ఈవో డాక్టర్ కెఎస్.జవహర్ రెడ్డి అధికారులను ఆదేశించారు. తిరుపతిలోని శ్రీ పద్మావతి విశ్రాంతి గృహంలో ఆదివారం ఆయన మ్యూజియం అభివృద్ధిపై అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ మ్యూజియంలో వేలాది పురాతన కళాకృతులు ఉన్నాయని, వీటన్నింటి గురించి భక్తులకు తెలిపేందుకు వీలుగా కంటెంట్ ను టాటా సంస్థ ప్రతినిధులకు అందించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. శ్రీవారి ఆభరణాల విశిష్టతను భక్తులు తెలుసుకునేలా, ఆకట్టుకునేలా పూర్తి స్థాయిలో కంటెంట్ తయారు చేయాలన్నారు. వచ్చే సమావేశం నాటికి టాటా సంస్థ చేపడుతున్న అభివృద్ధి పనుల ప్రాజెక్టు రిపోర్టును సిద్ధం చేయాలని కోరారు.

మ్యూజియంలో గ్రౌండ్, ఫస్ట్, సెకండ్ ఫ్లోర్లలో ఎక్కడెక్కడ ఎయే కళాకృతులు ప్రదర్శనకు ఉంచాలనే విషయంపై ఇంజినీరింగ్ అధికారులు ఇప్పటికే ప్రణాళికలు రూపొందించారని, ఈ ప్రక్రియను మరింత మెరుగుపరిచేందుకు టాటా సంస్థ కార్యాచరణ సిద్ధం చేయాలని ఆయన కోరారు. అభివృద్ధి పనులు పూర్తయితే బ్రహ్మోత్సవాలకు విచ్చేసే లక్షలాది మంది భక్తులకు స్వామివారి వైభవాన్ని కళ్లకు కట్టినట్టుగా చూపేందుకు వీలవుతుందన్నారు. పురాతన కాలం నాటి కళాకృతులు, యుద్ధ సామగ్రి, పాత్రలు తదితరాలు భక్తులను ఎంతగానో ఆకట్టుకుంటాయన్నారు.

ఈ సమావేశంలో టిటిడి అదనపు ఈవో శ్రీ ఏవి.ధర్మారెడ్డి, జెఈఓ శ్రీ వీరబ్రహ్మం, సివిఎస్ఓ శ్రీ గోపీనాథ్ జెట్టి, ఎఫ్ఏసిఎఓ శ్రీ బాలాజి, చీఫ్ ఇంజినీర్ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 మరియు మ్యూజియం అధికారి శ్రీ జగదీశ్వర్ రెడ్డి, ఐటి విభాగాధిపతి శ్రీ శేషారెడ్డి, వర్చువల్ విధానంలో టిసిఎస్ సంస్థ ప్రతినిధులు శ్రీ భీమశేఖర్, శ్రీ అఖిలేష్ పాల్గొన్నారు.

Comments