-వరదల్లో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలకు రూ. 48 లక్షలు సాయం చేసిన ఎన్టీఆర్ ట్రస్ట్
-ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున ఆర్థిక సాయం
-స్వయంగా చెక్కులను బాధితులకు అందజేసిన నారా భువనేశ్వరి
తిరుపతి (ప్రజా అమరావతి);
సమాజమే దేవాలయం-ప్రజలే దేవుళ్లు అనే సిద్ధాంతంతో ఎన్టీఆర్ ట్రస్ట్ తెలుగు రాష్ట్రాల్లో పలు సేవా కార్యక్రమాలు కొనసాగిస్తోంది. ఎవరికి ఏ కష్టమొచ్చినా క్షణాల్లో స్పందించి ఆపన్న హస్తం అందిస్తోంది. ఇటీవల చిత్తూరు, నెల్లూరు, కడప జిల్లాల్లో సంభవించిన వరద బీభత్సానికి సర్వం కోల్పోయిన బాధితులకు ఎన్టీఆర్ ట్రస్ట్ అండగా నిలిచింది. వరదల్లో ప్రాణాలు కోల్పోయిన 48 కుటుంబాలకు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ, టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు సతీమణి నారా భువనేశ్వరి ఆర్థికసాయం చేశారు. ఒక్కో కుటుంబానికి రూ. లక్ష చొప్పున చెక్కులను స్వయంగా అందజేశారు. తిరుపతి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా నారా భువనేశ్వరి మాట్లాడుతూ...భావజాలం వేరైనా కష్టకాలంలో బాధితులకు మనమంతా ఒక్కటై సాయం చేయాలి. వరద బీభత్సానికి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయారు. భారీ ఆస్తి నష్టం జరిగింది. ఈ సమయంలో చంద్రబాబు క్షేత్రస్థాయిలో పర్యటించి బాధితులకు అండగా నిలబడ్డారు. వరదల వల్ల సర్వం కోల్పోయిన వారిని చూసి నా మనసు కలిచివేసింది. కష్టాల్లో ఉన్న వారికి సాయం చేయాల్సిన బాధ్యత మనపై ఉంది. అసూయ, ద్వేషాల స్థానంలో ప్రేమను పెంచాలి. పరిస్థితులు మనకు అనుకూలంగా లేకపోతే అందరూ మనవైపే వేలెత్తి చూపిస్తారు. ఎన్ని కష్టాలు వచ్చినా లక్ష్యాన్ని మరవకూడదు. విజేతలుగా నిలిచేందుకు నిత్యం ప్రయత్నిస్తూనే ఉండాలి. ఏ దారి లేని చోట కొత్త దారిని సృష్టించి ఆ మార్గంలో ప్రయాణించి మార్గదర్శిగా నిలవాలి. మంచి ఆలోచనలతో ముందుకెళ్లాలి. విలువలతో కూడిన జీవనాన్ని మనమంతా కొనసాగించాలి. సమాజానికి సేవ చేయాలని ఎన్టీఆర్ ఎప్పుడూ తపించేవారు. నిరుపేదలను ఆదుకోవడానికే తన జీవితాన్ని ఎన్టీఆర్ అంకితం చేశారు. అందుకే తెలుగువారు అన్నగారిని తమ కుటుంబసభ్యునిగా భావిస్తారు. తారక రామారావు ఆశయాలను ఎన్టీఆర్ ట్రస్ట్ ముందుకుతీసుకెళ్తుంది. వరద బాధితులకు సాయం చేయడంలో నాకు సహకరించిన ఎన్టీఆర్ ట్రస్ట్ సభ్యులందరికీ ఈ సందర్భంగా పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. జై ఎన్టీఆర్ ట్రస్ట్. జై అమరావతి. సర్వేజనా సుఖినోభవతు.
addComments
Post a Comment