నెల్లూరు (prajaamaravati);
జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం పేదలకు వరం
లాంటిదని, జిల్లాలో అర్హులైన వారు ఈ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.
గురువారం దగదర్తి మండల పరిధిలోని కొత్తకౌరగుంట గ్రామ సచివాలయాన్ని జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు సందర్శించి, సచివాలయ పరిధిలో సంపూర్ణ గృహ హక్కు పథకం అమలు పురోగతిని పరిశీలించారు. జగనన్న సంపూర్ణ గృహ పథకం పేద ప్రజలకు రాష్ట్ర ప్రభుత్వం కల్పించిన చక్కటి అవకాశమని, గ్రామ వాలంటీర్లు గ్రామ సచివాలయ సిబ్బంది ప్రత్యేక శ్రద్ధ తీసుకొని అర్హులందరూ జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, కొత్తకౌరగుంట పరిధిలో ఏర్పాటు చేసిన జగనన్న కాలనీ లేఔట్ ను పరిశీలించారు. లే అవుట్ లో రోడ్లు, విద్యుత్, ఇళ్ల నిర్మాణల గురించి అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. పనుల నాణ్యత లో రాజీ పడొద్దని సూచించారు. గృహ నిర్మాణాల లబ్దిదారులతో మాట్లాడి త్వరితగతిన పూర్తి చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులందరూ సమిష్టిగా కృషి చేయాలని అన్నారు. బిల్లులు త్వరితగతిన మంజూరుకు కృషిచేసి లబ్దిదారుల ఖాతలో పడేటట్టు చూడాలని అధికారులను ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు, దగదర్తి మండల కేంద్రంలోని గ్రామ సచివాలయాన్ని సందర్శించి సచివాలయ పరిధిలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకానికి సంబంధించిన డేటా నమోదు ప్రక్రియను స్వయంగా పరిశీలించారు. సచివాలయ పరిధిలో జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకం లబ్ధిదారులు మొత్తం 353 మంది ఉండగా కేవలం 90 మంది మాత్రమే పథకాన్ని సద్వినియోగం చేసుకోవడం పట్ల జిల్లా కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. 100 శాతం ఈ నెల 20 వ తేదీ లోపు సద్వినియోగం చేసుకునేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్, సచివాలయ సిబ్బందిని, వాలంటీర్లను ఆదేశించారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మీడియాతో మాట్లాడుతూ, ఈ నెల 21వ తేదీన జగనన్న సంపూర్ణ గృహ హక్కు పథకాన్ని లాంఛనంగా ప్రారంభిస్తున్నందున జిల్లాలో లక్ష మందికి ఈ పధకం వర్తించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఈ రోజు వరకు 45 వేల మంది సద్వినియోగం చేసుకోవడం జరిగిందని, ఈ పధకం అమలుకు 4 రోజులు గడువు వున్నందున, గడువు లోపు మరో 55 వేల మంది ఈ పధకాన్ని సద్వినియోగం చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నంట్లు కలెక్టర్ తెలిపారు. అన్నీ శాఖ సమన్వయంతో ఈ పధకం పట్ల ప్రజల్లో మరింత అవగాహన కల్పించి, దీనిని సద్వినియోగం చేసుకొనేలా చర్యలు చేపట్టినట్లు కలెక్టర్ అన్నారు. రాష్ట్రప్రభుత్వం సంపూర్ణ గృహ పథకంకు అవకాశం ఇవ్వడం ద్వారా జరిగే లాభాల గురించి కరపత్రాలు ద్వారా కూడా లబ్ధిదారులకు అవగాహన కల్పించడం జరుగుచున్నదని కలెక్టర్ తెలిపారు. ఈ పధకం పట్ల అపోహలు, సందేహాలు లేకుండా సంబందిత లబ్దిదారులకు విస్తృత స్థాయి లో అవగాహన కల్పిస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. ఈ పధకం క్రింద జిల్లాలో మొత్తం 3.34 లక్షల మంది తమ పేర్లను నమోదు చేసుకోవడం జరిగిందని కలెక్టర్ తెలిపారు.
ఈ కార్యక్రమంలో కావలి ఆర్.డి.ఓ శ్రీ శీనా నాయక్, దగదర్తి ఎం.పి.డి.ఓ శ్రీ ఆర్.వి. కళాధర్ రావు, తహశీల్దార్ ప్రమీల, వివిధ శాఖల మండల అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment