అమరావతి (ప్రజా అమరావతి);
*కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:*
*జగనన్న పాలవెల్లువ- చారిత్రక ఘట్టం*
ఈ రోజు కృష్ణా జిల్లాలో 264 గ్రామాలలో ఏపీ పాలవెల్లువ ద్వారా పాలసేకరణ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఇదొక మంచి చారిత్రక ఘట్టం. ఇందులో పాలుపంచుకుంటున్నందుకు సబర్ కాంత మిల్క్ యూనియన్ ఎండీ డాక్టర్ బీ ఎం పటేల్ గారికి హృదయపూర్వక కృతజ్ఞతలు, అభినందనలు.
ఈ కార్యక్రమం మొదలుపెట్టేముందు ఇక్కడే జరుగుతున్న విషయాల మీద మనమంతా అవగాహన పెంచుకోవాలి. కారణమేమిటంటే ఏ రంగమైనా తీసుకుంటే.. ఒకడే కొనేవాడు, అనేకమంది అమ్మేవారుంటే దాన్ని బయ్యర్స్ మోనోపొలీ అంటారు. అంటే కొనేవారు ఎంత చెపితే అంతకు అమ్మేవారు ఇవ్వాల్సిన పరిస్థితి ఉండటం. కొనేవారు ఒకరు కంటే ఎక్కువ ఉన్నా కూడా ధర అన్నది వారు అందరూ కట్టకట్టుకుని ఇంతరేటుకే కొంటాం, ఇంతకంటే ఎక్కువ ఇవ్వం అన్న పరిస్థితే ఉంటే.. అమ్మేవారు ఎక్కువగా ఉన్నా... అలాంటి మార్కెట్లో అమ్మేవారికి అన్యాయమే జరుగుతుంది.
*ఈ పరిస్థితి మార్చడానికే...*
ఇలాంటి మార్కెట్ను ఈ రోజు మన రాష్ట్రంలో కూడా చూస్తున్నాం. ఈ రోజు ఈ రెండు పరిస్థితులలో ఏది ఉన్నా కూడా ఉత్పత్తి చేసేవారికి అన్యాయమే జరుగుతుంది. ఇటువంటి పరిస్థితిని మార్చడానికి మనందరి ప్రభుత్వం గట్టిగా నిర్ణయించుకుంది. అందుకే ఏపీ పాలవెల్లువ ద్వారా ఈ రోజు నుంచి కృష్ణా జిల్లా రైతులకు, అక్కచెల్లెమ్మలకు మరింత మెరుగైన ధర లభించబోతుంది.
*అమూల్ - ఏడాదిలోనే 5 జిల్లాలు*
ఈ రోజు అమూల్ ప్రారంభించిన ఏడాదిలోగానే 5 జిల్లాల్లో పాడిరైతులకు, అక్కచెల్లెమ్మలకు న్యాయం చేస్తూ... పాలవెల్లువ స్కీం ఇవాళ 6వ జిల్లాలో ప్రవేశిస్తుంది. రాబోయే రోజుల్లో మిగిలిన 7 జిల్లాలలో ఉధృతంగా కదులుతుంది. ముఖ్యంగా మన రైతులు అమ్మబోతే అడవి కొనబోతే కొరివి అనే పరిస్థితిని ఎదుర్కొంటున్నారు కాబట్టే.. మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్(ధరల స్థిరీకరణ నిధి) అనేది పెట్టి ప్రభుత్వమే మార్కెట్లో రంగ ప్రవేశం చేసింది. దీనివల్ల వ్యవసాయఉత్పత్తులును కొనుగోలు చేసే దళారులకు, వాళ్లు తక్కువ రేటుకు కొనుగోలు చేసి, రైతులకు ఇబ్బందికర పరిస్థితులను క్రియేట్ చేయడాన్ని సవాల్ చేసింది. ఈ రేటు కంటే తక్కువకు అమ్మాల్సిన పనిలేదు ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది అని చెప్పడంతో.. దళారులు అంతకన్నా ఎక్కువ రేటు ఇచ్చి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి వచ్చింది.
*ధరల స్థిరీకరణ నిధితో*
గత రెండున్నరేళ్లుగా అనేక ఉత్పత్తులను మనం మార్కెట్ ఇంటర్వెన్షన్తో ప్రైస్ స్టెబులైజేషన్ ఫండ్(ధరల స్థిరీకరణ నిధి) ద్వారా కొనుగోలు చేసి రైతులకు తోడుగా నిలబడగలిగాం. ధాన్యం, కూరగాయలు, పండ్లతో పాటు పాడి రైతులకు, ముఖ్యంగా అక్కచెల్లెమ్మలకు ఎలా న్యాయం చేయాలన్న ఆలోచనతోనే అధికారంలోకి వచ్చినవెంటనే ఆదిశగా అడుగులు వేశాం.
*అమూల్ - పాలుపోసేవారే యజమానులు*
అందులో భాగంగానే అమూల్తో మాట్లాడటం, వారిని తీసుకురావడం జరిగింది. అమూల్ కంపెనీ కాదు.. మనలాంటి వాళ్లు కలిసికట్టుగా ఒక్కటైతే అమూల్ అవుతుంది. అమూల్ యజమానులు ఎవరంటే మీరే... పాలు పోసే మీరే అమూల్లో యజమానులు. ఈ డబ్బులు కూడా వాళ్లు పెట్టుకోరు. అత్యధిక రేటు మీకిస్తారు. ఆ తర్వాత వచ్చే లాభాలను బోనస్గా మనకే తిరిగి పంపిణీ చేస్తారు. వాళ్ల దగ్గరున్న ప్రాసెసింగ్ మరెవ్వరి దగ్గరా లేదు. ఏకంగా పాల నుంచి చాక్లెట్స్ చేసే స్ధాయిలోకి ఎదిగిన సంస్ధ అది.
*2022 సెప్టెంబరు నాటికి లక్ష్యం...*
అందుకే అమూల్ని తీసుకొచ్చాం. అమూల్ సంస్ధ రాష్ట్రంలో ప్రకాశం జిల్లాలో 245 గ్రామాలలోనూ, చిత్తూరు జిల్లాలో 275 గ్రామాలలోనూ, వైయస్సార్ జిల్లాలో 149 గ్రామాలలోనూ, గుంటూరులో 203 గ్రామాల్లోనూ, పశ్చిమ గోదావరి జిల్లాలో 174 గ్రామాల నుంచి ఇప్పటికే పాలసేకరణచేస్తుంది. ఆయా జిల్లాలలో 1046 గ్రామాల నుంచి పాలసేకరిస్తుండగా... 2022 సెప్టెంబరు నాటికి 17,629 గ్రామాల నుంచి పూర్తిగా పాలసేకరణకు ప్రణాళికలు రచించాం.
*రూ.10 కోట్లు అదనం.*
గత ఏడాది డిసెంబరు నుంచి ఈ ఐదు జిల్లాలలో ఇప్పటివరకు 30,951 మంది మహిళా పాడిరైతుల నుంచి 168.50 లక్షల లీటర్లు పాలసేకరణ అమూల్ చేసింది. దాదాపు రూ.71 కోట్లు చెల్లించాం. ఇది పెద్ద విషయం కాదు. ఇతర డెయిరీలకు పాలసరఫరా చేస్తే వచ్చే దానికంటే దాదాపు రూ.10 కోట్లు అదనంగా వచ్చిందన్నది మనం గమనించాల్సిన అంశం. అంటే ఈ రూ.71 కోట్లలో ఇంతకముందు ఇదే అక్కచెల్లెమ్మలు ..వాళ్లు గతంలో పాలుపాసేవాళ్లకు ఇస్తే.. రూ.61 కోట్లే వచ్చేవి. అమూల్ రావడంతో వాళ్లకు రూ.71 కోట్లు వచ్చాయి. అంటే రూ.10 కోట్లు అమూల్ వల్ల అక్కచెల్లెమ్మలకు మేలు జరిగిందన్నది మనం గమనించాల్సిన విషయం.
*మహిళా సాధికారతే లక్ష్యం*
మహిళా సాధికారతకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్న ప్రభుత్వం మనది. ఏపీ అమూల్ పాలవెల్లువ పథకం ద్వారా గ్రామీణ స్ధాయిలోనే ఆర్ధిక స్వావలంబనకు, ప్రత్యేకంగా మహిళా సాధికారితకు ఇది ఊతమిస్తుంది. కృష్ణా జిల్లాలో పాలసేకరణకు 264 గ్రామాలను ఈ దశలో ఎంపిక చేయగా... ఆయా గ్రామాలలో 37,474 మంది పాడి రైతులను గుర్తించడం జరిగింది.
కృష్ణా జిల్లాలో ఇటీవల లాంఛనంగా 51 కేంద్రాల్లో పాలసేకరణను ప్రారంభిస్తే.. వారం రోజుల్లోనే18,414 లీటర్ల పాలు సేకరించడం జరిగింది. 941 పాడి రైతులకు రూ.8.15 లక్షలు బిల్లు కూడా చెల్లించాం. ఆశ్చర్యమేమిటంటే శాంపిల్గా ఈ కార్యక్రమం చేయడంలో .. రైతులకు ప్రతి లీటరుకు అదనంగా రూ.20 పైగా లాభం వచ్చింది.
ఉదాహరణకు చాట్రాయి మండలం సోమవరంకు చెందిన పి వెంకటనర్మమ్మ అనే సోదరి గతంలో కృష్ణా మిల్క్ యూనియన్కు పాలు పోయగా... లీటరుకు రూ.44.80 గిట్టుబాటు అయింది. అదే అక్క అమూల్ పాలవెల్లువ కేంద్రంలో పాలు పోయగా.. లీటరుకు రూ. 74.78 వచ్చాయి. అంటే లీటరు పాలపై ఆమె దాదాపు రూ.20 నుంచి రూ.30 అదనంగా సంపాదించింది.
*ఈ పరిస్థితి ఎందుకు ?*
మనరాష్ట్రంలో ఎందుకు ఈ పరిస్థితి ఉంది?. అమూల్ వస్తే తప్ప మన రైతులకు కానీ, మన అక్కచెల్లెమ్మలకు మెరుగైన రేటు రాని పరిస్థితి ఎందుకు వచ్చింది ?. దీనిపై అందరూ ఆలోచన చేయాలి. అమూల్ వస్తే తప్ప మోసాలకు అడ్డుకట్ట పడదు అనే పరిస్థితి ఈ రోజు మన రాష్ట్రంలో ఎందుకు ఉంది ? ఈ విషయాలను అందరూ ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది.
*పాదయాత్రలో ఇదే విషయాన్ని..*
నా పాదయాత్రలో ప్రతిజిల్లాలో పాలుపోసే రైతులు, అక్కచెల్లెమ్మలు నా దగ్గరకు వచ్చి కలిసేవారు. చాలా సందర్భాలలో పబ్లిక్ మీటింగ్లలో వాళ్లు చెప్పిన ఆ మాటలు కూడా నేను చెప్పేవాడిని. ఒక లీటరు మినరల్ వాటర్ ధర రూ.23 అయితే, ఒక లీటరు పాలు ధర కూడా రూ.23 వస్తుంది , ఏ రకంగా బ్రతకగలుగుతాం ? మినరల్ వాటర్కి ఇచ్చే రేటు మా పాలకు రాకపోతే ఎలా బ్రతకగలుగుతామని ప్రతి జిల్లాలో చెప్పేవాళ్లు. నేను కూడా ఇదే ప్రస్తావించేవాడిని.
దురదృష్టవశాత్తూ అటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉండేది. అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత అమూల్ సంస్ధతో ఒప్పందం చేసుకుని, పాలసేకరణ చేపట్టడం జరిగింది.
అమూల్కు మిగిలిన సంస్ధలకు ఉన్న తేడా ఏంటన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. పాల నుంచి నేరుగా ఏకంగా చాక్లెట్ తయారు చేసే ప్రాససింగ్ వ్యవస్ధ వీళ్ల దగ్గర ఉంది. అమూల్ దేశంలో మిల్క్ ప్రాససింగ్లో మొదటి స్ధానంలో ఉండగా... ప్రపంచంలో 8వ స్ధానంలో ఉంది. మందరికీ గర్వకారణమైన విషయం. కారణం అలాంటిసంస్ధలో యజమానులెవరూ లేరు.. పాలుపోసేవాళ్లే యజమానులు.
*ఏడాదికి ఒకమారు బోనస్గా*
అంతే కాకుండా మిగిలిన వాళ్లతో పోల్చితే అమూల్ పాలసేకరణ ధర అక్కచెల్లెమ్మలకు అధికంగా ఇస్తోంది. ఈ కంపనీలో వాటాదారులు అంతా మీరే. లాభాపేక్ష అనేది అమూల్కు లేదు. సంస్ధ గడించే లాభాలను కూడా సంవత్సరానికి ఒకసారి తిరిగి అక్కచెల్లెమ్మలకు వెనక్కి ఇచ్చే గొప్ప ప్రక్రియ అమూల్లోనే ఉంది. పాలకు కూడా మిగతా డెయిరీలో పోల్చితే అధిక ధరలను చెల్లించడమే కాకుండా పాల బిల్లును కూడా కేవలం పదిరోజుల్లోనే పాడిరైతుల ఖాతాల్లోకి నేరుగా జమచేయడం వల్ల మన అక్కచెల్లెమ్మలకు అందరికీ ఆర్ధికంగా మరింత మేలు జరుగుతుంది. అమూల్తో ఇబ్బంది పడే పరిస్థితి రాదు, ఉండదు.
*సంస్ధ బాగే - రైతుల బాగు*
ఇదొక సహకార రంగ సంస్ధ, సహకారరంగ సంస్ధ బాగుంటే.. రైతులు బాగుంటారు. అమూల్ సంస్ధను చూసిన ఎవరైనా ఈ విషయాలు చెప్పగలుగుతారు. మరొక్క విషయమేమిటంటే సంవత్సరంలో కనీసం 182 రోజులు అంటే ఆరు నెలలు సొసైటీకి పాలుపోసిన మహిళా పాడి రైతులకు అమూల్ ద్వారా ఏడాది చివరిలో ప్రతిలీటరుపై 50 పైసలు బోనస్గా కూడా చెల్లిస్తున్నారు.
అంతే కాకుండా అమూల్ సంస్ధ నాణ్యమైన పశుదాణాను కూడా తక్కువ ధరకే సరఫరా చేస్తున్నారు. బీఎంసీయూ,ఏఎంసీయూలలో అందుబాటులో ఉంచుతున్నారు.
*డెయిరీలు- ప్రయివేటు వ్యక్తుల ఆక్రమణ*
ఈ సహకార రంగ డెయిరీలలో బాగున్నవాటిలో కొన్నింటిని.. దురదృష్టవశాత్తూ కొంతమంది ప్రైవేటు వ్యక్తులు పూర్తిగా ఆక్రమించుకున్నారు. అవి వాళ్ల ప్రయివేటు ఆస్తుల కింద మారిపోయాయి. ప్రభుత్వానికి ఇది ఒక సమస్య అయితే.. రెండోది ప్రభుత్వంలోని వ్యక్తులకు వాళ్లకే ప్రయివేటు డెయిరీల్లో వాటాలు ఉండటం వల్ల, ఏరోజు కూడా రాష్ట్రంలో పాలుపోసే అక్కచెల్లెమ్మలకు మంచి ధరలు ఇప్పించాలన్న తపన, తాపత్రయం ఉండేది కాదు.
*వాటిని మార్చాలన్నదే మన తాపత్రయం*
వాటిని మార్చాలని మన ప్రభుత్వం మనసా, వాచా, కర్మణా కట్టుబడి రకరకాల కార్యక్రమాలు చేస్తుంది. రాష్ట్రంలో పాడి ఎక్కువగా ఉన్న 4796 గ్రామాలను రాష్ట్ర ప్రభుత్వం గుర్తించింది. మహిళా పాడి రైతులకు సహకార సంఘాలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఆయా గ్రామాలలో బల్క్ మిల్క్ కూలింగ్ యూనిట్లను కూడా ఏర్పాటు చేస్తున్నాం. వీటితో పాటు ప్రతి మహిళా డెయిరీ సహకార సంఘానికి అనుబంధ గ్రామాలలో కూడా పాలసేకరణ చేయడానికి ఆటోమేటిక్ మిల్క్ కలెక్షన్ యూనిట్స్ను కూడా ఏర్పాటు చేస్తున్నాం. రూ.979 కోట్లతో బీఎంసీయూలు, 12,883 ఏఎంసీయూల నిర్మాణం కోసం మరో రూ. 1600 కోట్లు ఖర్చు చేస్తున్నాం. ఎందుకంటే వీటి ద్వారా అక్కచెల్లెమ్మలకు భరోసా వస్తుంది. మోసం ఉండదు. వాళ్లు పోసే పాలు వాళ్లంతట వాళ్లే మీటర్లో పెట్టుకుని ఎంత ఎస్ఎన్ఎఫ్ ఉందని వాళ్లే చూసుకోగలుగుతారు. అలాగే బిల్లు కూడా ఎవరి ప్రమేయం లేకుండా వస్తుంది. ఎక్కడా కూడా మోసం అనేదానికి తావులేకుండా ప్రతి గ్రామంలో వాళ్లంతట వాళ్లే నిర్ధారించుకుని, వాళ్లంతట వారే చెక్ చేసుకుంటే.. మా పాలకు ఇంత ధర వస్తుందనేది తెలుస్తుంది.
*దోచుకున్న వారికి దిక్కుతోచడం లేదు*
ఇవన్నీ మనసున్న మీ ప్రభుత్వంగా చేస్తున్నాం. ఇంతకాలం రైతులుకు ప్రధానంగా అక్కచెల్లెమ్మలకు ఇవ్వాల్సిన డబ్బు ఎగ్గొట్టి దోచుకున్న డెయిరీలకు, వాటి ద్వారా లబ్ది పొందుతున్న వారికి, పాడి మార్కెట్లో మన ప్రభుత్వం తరపున పోటీ వచ్చేసరికి వీళ్లెవరికీ కూడా దిక్కుతోచడం లేదు. నిజంగా అమూల్ రావడంతో వాళ్లు కూడా రేట్లు పెంచుతున్నారు. అమూల్ మంచి రేట్లు ఇస్తుంది కాబట్టి... దాన్ని తట్టుకునేదానికోసం అమూల్ అడుగుపెట్టిన ప్రతిచోటా రేట్లు పెరుగుతున్నాయి. ఏ కారణం చేత పెరిగినా, ఏ భయం వల్ల పెరిగినా ఇదొక మంచి పరిణామం. దానివల్ల మన అక్కచెల్లెమ్మలకు మంచి జరుగుతుంది. మనకు కూడా కావల్సింది అదే.
*చివరిగా...*
దేవుడు దయ , మీ అందరి చల్లని దీవెనలతో ఇంకా మీకు మంచి చేసే అవకాశం రావాలని, దేవుడు ఇవ్వాలని, మీకు కూడా మంచి జరగాలని మనసారా కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నాను అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
అనంతరం సీఎం కృష్ణా జిల్లాలో జగనన్న పాలవెల్లువ కార్యక్రమాన్ని క్యాంప్ కార్యాలయం నుంచి వర్చువల్గా ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో క్యాంప్ కార్యాలయం నుంచి పశుసంవర్ధక, పాడిపరిశ్రమాభివృద్ధి శాఖ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజు, దేవాదాయశాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్, వ్యవసాయ, పశుసంవర్ధశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కోపరేటివ్ ఫెడరేషన్ (ఏపీడీడీసీఎఫ్) ఎండీ ఎ బాబు, పశుసంవర్ధకశాఖ డైరెక్టర్ డాక్టర్ ఆర్ అమరేంద్రకుమార్, అమూల్ ప్రతినిధులు, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కార్యక్రమంలో పాల్గొన్న సబర్ కాంత మిల్క్ యూనియన్ (సబర్ డెయిరీ) ఎండీ డాక్టర్ బీ ఎం పటేల్.
addComments
Post a Comment