ఆర్.బి.కె.ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు


ఆర్.బి.కె.ల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు


ఖరీఫ్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యం

నేటి వరకూ 17.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ

76 వేల 158 మంది రైతులకు రూ.1,153 కోట్ల చెల్లింపు

ధాన్యం కొనుగోలు సొమ్ము 21 రోజుల్లోనే  రైతుల ఖాతాల్లో జమ

 

అమరావతి, జనవరి 10 (ప్రజా అమరావతి): రాష్ట్రంలోని 4 వేల 813 రైతు భరోసా కేంద్రాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటుచేసి  రైతుల నుండే ప్రభుత్వం నేరుగా  ధాన్యం కొనుగోలు చేసే నూతన విధానాన్ని రాష్ట్రంలో అమలు పర్చడం జరుగుచున్నదని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ కమిషనర్  గిరిజా శంకర్ తెలిపారు.  అమరావతి సచివాలయం  నాల్గో బ్లాక్ లోని  పబ్లిసిటీ సెల్ లో రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్  డైరెక్టర్ జి.వీరపాండ్యన్ తో కలసి పాత్రికేయులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని రైతుల నుండి ధాన్య కొనుగులుకు ప్రభుత్వం అనుసరిస్తున్న నూతన విధానాన్ని వివరించారు.  కేంద్ర ప్రభుత్వం 2013-14 వ సంవత్సరంలో ప్రవేశపెట్టిన వికేంద్రీకృత సేకరణ విధానంలో భాగంగా  రైతుల ముంగిళ్లలోనే ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రభుత్వం  ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు.  ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో 50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం నిర్ణయించిందని, అయితే ఇప్పటి వరకూ ఈ కొనుగోలు కేంద్రాల ద్వారా  17.09 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని 2,35,886 రైతుల నుండి  సేకరించడం జరిగిందన్నారు. ఇందుకు గాను 76 వేల 158 మంది రైతులకు రూ.1,153 కోట్లను నేరుగా వారి బ్యాంకు ఖాతాలకే  జమచేయడం జరిగిందన్నారు.  రైతుల నుండి ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లోనే  ఈ సొమ్మును రైతుల ఖాతాల్లోకి  నేరుగా జమచేయడం జరిగిందన్నారు.  అయితే బ్యాంకు ఖాతాల్లో, ఆధార్ లింకుల్లో ఏమన్నా తేడాలు ఉంటే కొంత ఆలస్యానికి కారణం అవుతున్నదని ఆయన స్పష్టంచేశారు. మిగిలిన ధాన్య సేకరణ లక్ష్యాన్ని కూడా రానున్నరెండు మాసాల్లో పూర్తిచేసే దిశగా  చర్యలు తీసుకుంటున్నట్లు ఆయన తెలిపారు. 

కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన ప్రమాణాలకు లోబడి ధాన్యం కొనుగోలుకై కనీస మద్దతు ధరను ప్రభుత్వం నిర్ణయించడం జరిగిందన్నారు.  గ్రేడ్-ఏ కేటగిరీ క్రిందకు వచ్చే ధాన్యం క్వింటాల్ ధరను రూ.1,960/-గాను, 75 కేజీలకు రూ.1,470/- గాను , కామన్ కేటగిరీలో ధాన్యం క్వింటాల్ ధరను రూ.1,940/-గాను, 75 కేజీలకు రూ.1,455/- గాను ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆయన తెలిపారు. ఆ రేట్ల ప్రకారమే రైతులు విక్రయించే ధాన్యం ధరలను నిర్ణయిస్తూ వారికి  చెల్లింపులు 21 రోజుల్లోనే చేయడం జరుగుచున్నదన్నారు.  

రైతులకు ఎటు వంటి అన్యాయం జరుగకుండా ఉండేదుకై మరియు మిల్లర్లతో ప్రమేయం ఏమాత్రం లేకుండా  ఆర్.బి.కె.లోని సిబ్బంది నేరుగా రైతుల పొలాల్లోకి వెళ్లి ధాన్యం నమూనాలను సేకరించి పరీక్షించిన తదుపరి ధాన్యాన్ని సేకరించడం జరుగుతున్నదన్నారు. రైతులకు అవసరమైన గోనెసంచులను ఆర్.బి.కె.ల్లోని ధాన్యం కొనుగోలు కేంద్రాల ద్వారా పంపిణీచేయడం జరుగుతున్నదని, సేకరించిన ధాన్యాన్ని నిర్ణీత రైస్ మిల్లులకు రవాణా చేసేందుకై  అవసరమైన వాహనాలను, లోడింగ్ మరియు అన్ లోడింగ్ కు అవసరమైన హమాలీలను పౌర సరఫరాల సంస్థ సమకూర్చుతున్నదని ఆయన తెలిపారు.  పంటలు పండించే రైతుల వివరాలను ఆర్.బి.కె.ల్లో ముందుగానే     ఇ-క్రాప్ విధానంలో  నమోదు చేయడం వల్ల మరియు ఇ-కెవైసి విధానం ద్వారా రైతుల ఆధార్ అథంటికేషన్ వెరిఫికేషన్ చేయడం వల్ల నకిలీ రిజిస్ట్రేషన్ మరియు సేకరణ ను నిరోదిస్తూ రైతులకు పూర్తి స్థాయిలో లబ్దిచేకూర్చడం జరుగుతున్నధి ఆయన తెలిపారు. 

ఐరన్, ఫోలిక్ యాసిడ్ మరియు బి-12 విటమిన్ తదితర మూడు సూక్ష్మపోషకాలతో సమృద్ది పర్చిన బియ్యాన్ని (Fortified Rice) ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పంపిణీ చేసే విధానాన్ని గత ఏడాది  దేశంలోనే తొలిసారిగా  రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ప్రారంభించడం జరిగిందని ఆయన తెలిపారు. విశాఖపట్నం మరియు కడప జిల్లాలో కూడా ఫోర్టిఫైడ్ రైస్ ను ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా త్వరలో పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. పి.ఎం.జి.కె.వై. క్రింద డిశంబరు,  జనవరి మాసాలకు  పంపిణీ చేయాల్సిన బియ్యాన్ని ఈ నెల 18 నుండి పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. 

ధాన్యం కొనుగోలులో సమస్యల పరిష్కారానికి రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్…. 

ధాన్యం కొనుగోలుకు సంబందించి రైతులు ఎటు వంటి సమస్యలను ఎదుర్కొంటున్నా, వాటిని తక్షణమే పరిష్కరించేందుకై  రాష్ట్ర స్థాయిలో కమాండ్ కంట్రోల్ సెంటర్ ను ఏర్పాటు చేయడం జరిగిందని రాష్ట్ర పౌర సరఫరాల సంస్థ మేనేజింగ్  డైరెక్టర్ జి.వీరపాండ్యన్ తెలిపారు. 1902 మరియు 155215 నెంబర్లకు ఫోన్ చేసి రైతులు తమ సమస్యలపై ఫిర్యాదు చేయవచ్చన్నారు.  

పొలాల నుండే ధాన్యం కొనుగోలు చేసుకునేందుకు వీలుగా మొబైల్ యాప్ ను ప్రవేశ పెట్లడం  జరిగిందని ఆయన తెలిపారు.  ఆర్.బి.కె.ల్లో చేసే  ఐదు రకాల టెస్టులను ఐ.ఓ.టి. ఆధారంగా రియల్ టైమ్ లో చేసేందుకు ఒక స్టార్టుఅప్ కంపెనీ సహకారంతో కృష్ణా జిల్లాలో పైలెట్ ప్రాజక్టును ప్రారంభించడం జరిగిందన్నారు.  ఇది మంచి ఫలితాలను ఇస్తే  రాష్ట్ర వ్యాప్తంగా ఈ విదానాన్ని అమల్లోకి తెస్తామన్నారు.  ప్రభుత్వ గోదాముల్లోకి రిసైకిల్డు రైస్  కాకుండా  చెక్ పెట్టేందుకు ఏజ్ టెస్టింగ్ విదానాన్ని తొలిసారిగా రాష్ట్రంలో ప్రారంభించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు.  


Comments