వ్యవసాయం, పశు సంపదను ప్రోత్సహించడమే లక్ష్యం





- నేటి నుండి జాతీయ స్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలు

- ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న కొడాలి సోదరులు

- వ్యవసాయం, పశు సంపదను ప్రోత్సహించడమే లక్ష్యం


- ఏడు విభాగాల్లో రూ.18.40 లక్షల నగదు బహుమతులు

- వైసిపి రంగులతో కళ కళ, జెండాలతో రెపరెపలాడుతున్న ట్రాక్



గుడివాడ, జనవరి 10 (ప్రజా అమరావతి): కృష్ణాజిల్లా గుడివాడ పట్టణం లింగవరం రోడ్ లోని కే. కన్వెన్షన్ లో వరుసగా ఐదవ ఏడాది ఈనెల 11వ తేదీ నుండి 15వ తేదీ వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని), ఆయన సోదరుడు కొడాలి నాగేశ్వరరావు (చిన్ని)లు ప్రతిష్టాత్మకంగా జాతీయ స్థాయిలో ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నారు. ఎన్టీఆర్ టు వైయస్సార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వ్యవసాయం, పశు సంపదను ప్రోత్సహించడమే లక్ష్యంగా ఈ పోటీలు జరుగుతున్నాయి. 2018 వ సంవత్సరం నుండి జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో భాగంగా జాతీయస్థాయి ఒంగోలు జాతి ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహిస్తున్నట్టు మంత్రి కొడాలి నాని, ఆయన సోదరుడు కొడాలి చిన్ని చెప్పారు. ఈ పోటీలకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాల నుండి దాదాపు 150 వరకు ఎడ్ల జతలు రానున్నాయని నిర్వాహకులు అంచనా వేస్తున్నారు. మొత్తం ఏడు విభాగాల్లో నిర్వహించే ఈ పోటీల్లో మొదటి 9 స్థానాల్లో నిలిచిన విజేతలకు భారీగా నగదు బహుమతులను అందజేయనున్నారు. రెండు పళ్ళ విభాగంలో విజేతలకు వరుసగా రూ. 30వేలు, రూ.25 వేలు, రూ. 22 వేలు, రూ. 18 వేలు, రూ. 15 వేలు, రూ. 13 వేలు, రూ. 10 వేలు, రూ. 8 వేలు, రూ. 5 వేల నగదు బహుమతులను అందజేయనున్నారు. నాలుగు పళ్ళ విభాగంలో విజేతలకు వరుసగా రూ. 35వేలు, రూ.30 వేలు, రూ. 25 వేలు, రూ. 22 వేలు, రూ. 18 వేలు, రూ. 15 వేలు, రూ. 13 వేలు, రూ. 10 వేలు, రూ. 8 వేల నగదు బహుమతులను అందజేస్తారు. ఆరు పళ్ళ విభాగంలో విజేతలకు వరుసగా రూ. 40వేలు, రూ.35 వేలు, రూ. 30 వేలు, రూ. 25 వేలు, రూ. 22 వేలు, రూ. 18 వేలు, రూ. 15 వేలు, రూ. 13 వేలు, రూ. 10 వేల నగదు బహుమతులను ఇవ్వనున్నారు. సేద్య విభాగంలో విజేతలకు వరుసగా రూ. 50వేలు, రూ.45 వేలు, రూ. 40 వేలు, రూ. 35 వేలు, రూ. 30 వేలు, రూ. 25 వేలు, రూ. 20 వేలు, రూ. 15 వేలు, రూ. 10 వేల నగదు అందజేయనున్నారు. సబ్ జూనియర్స్ విభాగంలో విజేతలకు వరుసగా రూ. 60వేలు, రూ.50 వేలు, రూ. 40 వేలు, రూ. 35 వేలు, రూ. 30 వేలు, రూ. 25 వేలు, రూ. 20 వేలు, రూ. 15 వేలు, రూ. 10 వేల నగదు అందజేస్తారు. జూనియర్స్ విభాగంలో విజేతలకు వరుసగా రూ. 70వేలు, రూ.50 వేలు, రూ. 40 వేలు, రూ. 35 వేలు, రూ. 30 వేలు, రూ. 25 వేలు, రూ. 20 వేలు, రూ. 15 వేలు, రూ. 10 వేల నగదు ఇవ్వనున్నారు. సీనియర్స్ విభాగంలో విజేతలకు వరుసగా రూ. లక్ష, రూ.80 వేలు, రూ. 70 వేలు, రూ. 60 వేలు, రూ. 50 వేలు, రూ. 40 వేలు, రూ. 30 వేలు, రూ. 20 వేలు, రూ. 10 వేల నగదు బహుమతులను అందజేయనున్నారు. ఇదిలా ఉండగా ఈ పోటీల్లో పాల్గొనేందుకు తరలి వచ్చే ఎడ్ల జతలకు ఆహారం, వసతి సౌకర్యం కల్పించేందుకు కే. కన్వెన్షన్ ఆవరణలో టెంట్లు ఏర్పాటు చేశారు. పశు పోషకులు, రైతులకు భోజన సదుపాయం కూడా కల్పించారు. పలు విభాగాల్లో పోటీలను నిర్వహించేందుకు బండలను కూడా సిద్ధం చేశారు. జాతీయస్థాయి పోటీల వేదిక, ట్రాక్ వైసిపి రంగులతో కలకలలాడుతూ, జెండాలతో రెపరెపలాడుతూ కనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాలు, నలుమూలల నుండి వచ్చే లక్షలాదిమంది రైతులు, పశు పోషకులు, ప్రజలు ఈ పోటీలను ప్రత్యక్షంగా వీక్షించేందుకు భారీ ఎత్తున గ్యాలరీలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ పోటీల్లో పాల్గొనే ఎడ్ల జతల యజమానులు అందరికీ నిర్వాహకులు మెమొంటోలను కూడా బహుకరిస్తున్నారు.

Comments