తిరుచానూరులో వేడుకగా ప్రారంభమైన నవకుండాత్మక శ్రీ‌యాగం

 తిరుచానూరులో వేడుకగా ప్రారంభమైన నవకుండాత్మక శ్రీ‌యాగం


– 50 సంవత్సరాల తరువాత టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతుల చే నిర్వహణ

– అమ్మవారికి 34 గ్రాముల బంగారు హారం బహుకరించిన చైర్మన్ కుటుంబం

తిరుప‌తి,  జ‌న‌వ‌రి 21 (ప్రజా అమరావతి): ప్ర‌పంచ శాంతి, సౌభాగ్యం కోసం శ్రీ ప‌ద్మావ‌తి అమ్మ‌వారిని ప్రార్థిస్తూ తిరుచానూరు ఆల‌యంలో శుక్ర‌వారం నవకుండాత్మక శ్రీ యాగం ప్రారంభమైంది. ఏడు రోజుల పాటు జ‌రుగ‌నున్న శ్రీ‌యాగాన్ని కోవిడ్‌-19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలోని శ్రీకృష్ణ ముఖ మండ‌పంలో అర్చ‌కులు శ్రీ వేంపల్లి .శ్రీ‌నివాస‌న్ ఆధ్వ‌ర్యంలో ఏకాంతంగా నిర్వహిస్తున్నారు.

శ్రీ వేంక‌టేశ్వ‌ర భ‌క్తి ఛాన‌ల్ ఈ యాగాన్ని లో ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం చేస్తోంది.

ఇందులో భాగంగా శుక్రవారం ఉదయం 9. 30 గంటలకు సంకల్పం తో యాగం ప్రారంభమైంది. మ‌ధ్యాహ్నం 1 గంట వ‌రకు యాగశాలలో సంకల్పం, హోమాలు, చ‌తుష్టానార్చ‌న‌, అగ్ని ప్ర‌తిష్ట‌, నిత్య‌పూర్ణాహుతి, నివేద‌న‌, వేద విన్న‌పం, మ‌హామంగ‌ళ‌హార‌తి నిర్వ‌హించనున్నారు. సాయంత్రం 5 నుండి రాత్రి 9 గంట‌ల వ‌ర‌కు చ‌తుష్టానార్చ‌న‌, శ్రీ‌యాగం హోమాలు, ల‌ఘుపూర్ణాహుతి, మ‌హానివేద‌న‌, వేద విన్న‌పం, మ‌హామంగ‌ళ‌హార‌తి చేపట్టి అమ్మ‌వారి ఉత్స‌వ‌ర్ల‌ను స‌న్నిధిలోకి వేంచేపు చేస్తారు.

50 సంవత్సరాల తరువాత

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో 50 సంవత్సరాల తరువాత లోక కళ్యాణం కోసం టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఈ యాగం నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి శ్రీ సుబ్బారెడ్డి దంపతులు 34 గ్రాముల బంగారు హారాన్ని కానుకగా ఇచ్చారు. అర్చకులు ఉత్సవ మూర్తికి ఈ హారాన్ని అలంకరించారు. జనవరి 27వ తేదీ వరకు యాగం నిర్వహిస్తారు.

ఈ కార్యక్రమంలో టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి దంపతులు ఏఈవో శ్రీ ప్రభాకర్ రెడ్డి అర్చకులు శ్రీ బాబు స్వామి పాల్గొన్నారు.

అమ్మవారి అనుగ్రహం తోనే యాగం- టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి

శ్రీ పద్మావతి అమ్మవారి అనుగ్రహంతోనే నవకుండాత్మక శ్రీ యాగం నిర్వహిస్తున్నాని టీటీడీ చైర్మన్ శ్రీ వైవి సుబ్బారెడ్డి చెప్పారు.

తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో శుక్రవారం ప్రారంభమైన యాగంలో శ్రీ సుబ్బారెడ్డి దంపతులు పాల్గొన్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. 50 సంవత్సరాల క్రితం చిన జీయర్ స్వామి తాత గారు ఈ యాగం చేశారని ఆయన చెప్పారు. ఆ తరువాత అమ్మవారు తమకు ఈ భాగ్యం కల్పించారని అన్నారు. దేశం, రాష్ట్రం క్షేమంగా ఉండాలని, ప్రజలు ఆరోగ్యంగా ఉండాలని, గో సంతతి అభివృద్ధి చెందాలని అమ్మవారిని ప్రార్థిస్తూ ఈ నెల 27 వ తేదీ వరకు యాగం నిర్వహిస్తున్నామన్నారు. కోవిడ్ వల్ల యాగం ఏకాంతంగా నిర్వహిస్తున్న దువల్ల , భక్తులు శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ లో ప్రత్యక్ష ప్రసారం ద్వారా చూసే అవకాశం కల్పించామని శ్రీ సుబ్బారెడ్డి వివరించారు.

Comments