రైతులకు ఇన్పుట్ సబ్సిడీ.
2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టంతోపాటు నేలకోత, ఇసుక మేటల కారణంగా నష్టపోయిన 5,97,311 మంది రైతన్నలకు రూ.542.06 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, 1220 రైతు గ్రూపులకు వైఎస్సార్ యంత్రసేవా పథకం క్రింద రూ.29.51 కోట్ల లబ్ధితో కలిపి మొత్తం రూ.571.57 కోట్లను క్యాంప్ కార్యాలయంలో బటన్ నొక్కి లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.
అమరావతి (ప్రజా అమరావతి);
ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్.జగన్ ఏమన్నారంటే...:
రైతులకు తోడుగా, నీడగా...
ఈ రోజు దేవుడి దయతో మరో మంచి కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. రైతులకు అన్ని విధాలుగా తోడుగా, నీడగా నిలబడతాఉన్న మన ప్రయాణంలో ఏ సీజన్లో నష్టపోయిన రైతులకు అదే సీజన్ ముగియకమునుపే... రైతులకు తోడుగా నిలబడి, వారికి నష్టం జరిగిన వెంటనే ఆ నష్టపరిహారం ఇచ్చే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
*మూడు నెలలు తిరక్క ముందే పరిహారం*
2021 నవంబరులో అంటే మూడు నెలలు కాకముందే... కురిసిన భారీ వర్షాలుకు, వరదల వల్ల పంట నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ కింద ఈ సహాయం ఇవ్వడమే కాక... నేలకోత, ఇసుక మేటలు ఇలా అన్ని రకాలుగానష్టపోయిన 5,97,311మంది రైతులకు ఈ రోజు పరిహారం క్రింద రూ.542 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా అందిస్తున్నాం. దీంతోపాటు మరో 1220 రైతు గ్రూపులకు ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఒక కమ్యూనిటీ హైరింగ్ సెంటర్, ఒక గ్రూపు క్రింద రైతులను తయారు చేసి, అందుబాటులోకి వారికి యంత్రాలను ఇస్తూ.. తద్వారా మిగిలిన రైతులకు అద్దెకు ఆ పరికరాలను సరసమైన ధరలకు అందుబాటులో ఉంచే కార్యక్రమంలో భాగంగా.. వైఎస్సార్ యంత్రసేవా పథకంకింద వారికి రూ.29.51 కోట్లను సబ్సిడీ క్రింద ఇస్తున్నాం. ఈ రెండూ కలిపి రూ.571 కోట్లు ఇస్తున్నాం.
అంతే కాక.. నిన్నటి ఖరీప్లో ఇన్సూరెన్స్ కింద రూ.1800 కోట్లు ఇచ్చాం. ఆ రూ.1800 కోట్లలో కూడా టెక్నికల్ కారణాలు, వెరిఫికేషన్ వంటి వివిధ కారణాల వల్ల దాదాపు రూ.93 కోట్లు వారికి ఇవ్వలేకపోయాం. ఆ వెరిఫికేషన్ కార్యక్రమం కూడా పూర్తి చేసి ఆ రూ. 93 కోట్లు కూడా రైతులకు విడుదల చేస్తున్నాం.
మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి దేవుడి దయ వల్ల మంచి వర్షాలు కురుస్తున్నాయి. రాయలసీమ లాంటి కరువు ప్రాంతాల్లో సైతం భూగర్భ జలాలు బాగా పెరిగిన పరిస్థితులు కనిపిస్తున్నాయి. చెరువులు, రిజర్వాయర్లు అన్నీ నీటితో పుష్కలంగా కళకళలాడుతున్నాయి. వెలుగు కింద చీకటి ఉన్నట్టే.. జరిగిన మంచితోపాటు అధిక వర్షాల వల్ల కొద్ది మేర పంట నష్టం కూడా జరిగింది. ఈ నేపధ్యంలో ఆ రైతన్నలకు కూడా అండగా నిలబడే కార్యక్రమం ఇవాళ చేస్తున్నాం. రైతన్నల కోసం ఎన్నో చేస్తున్న ప్రభుత్వంగా.. నవంబరులో అధిక వర్షాలు, వరదల వల్ల నష్టపోయిన రైతులను ఆదుకుంటూ... ఆదే రోజు 1.21 లక్షల క్వింటాళ్ల విత్తనాలు, దాదాపు 1.43 లక్షల రైతన్నలకు రూ.63 కోట్లు ఖర్చు చేసి రైతులకు తోడుగా నిలబడ్డాం.
*ఇలా ఏ రాష్ట్రంలోనూ జరగలేదు*
ఆ రోజు జరిగిన నష్టాన్ని ఈ రోజు ఇన్పుట్ సబ్సిడీ రూపంలో 5,71,478 మంది రైతులకు ఎప్పటికప్పుడు విడుదల చేస్తున్న తొలి ప్రభుత్వం మనదే. ఇది ఎక్కడా ఏ రాష్ట్రంలో కూడా జరగలేదు. మన రాష్ట్రంలో కూడా గతంలో ఎప్పుడూ కూడా జరగలేదు. ఏ సీజన్లో పంట నష్టం జరిగితే అదే సీజన్ ముగియకమునుపే రైతన్నకు తోడుగా నిలబడే పరిస్థితి ఎక్కడా జరగలేదు.
*ఎందుకు ఇంత స్పష్టంగా చెప్తున్నానో మీ అందరికీ తెలియజేస్తాను.*
గత ప్రభుత్వం హయాంలో పరిస్థితులు గుర్తుతెచ్చుకుంటే.. కొన్నిసార్లు పూర్తిగా ఎగ్గొట్టేసిన పరిస్థితి. మరికొన్ని సార్లు అరకొరగా, అది కూడా ఆలస్యంగా... కొంతమందికే మాత్రమే ఇన్పుట్ సబ్సిడీ క్రింద సహాయం అందించిన పరిస్థితి మనం చూశాం.
*గత ప్రభుత్వం ఏ రకంగా ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చిందనేది గుర్తుకు తెచ్చుకోగలిగితే...*
2014లో ఖరీప్లో సంభవించిన కరవుకు 2015 నవంబరులో గానీ ఇవ్వలేదు. 2015 కరువుకు.. 2016 నవంబరు కంటే కంటే ముందు ఇచ్చిన పరిస్ధితి చూడలేదు.
2015 నవంబరు, డిసెంబరులో కురిసిన భారీ వర్షాలకు కారణంగా జరిగిన రూ.263 కోట్ల పంట నష్టాన్ని గత ప్రభుత్వంలో పూర్తిగా ఎగ్గొట్టారు. ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా ఎగ్గొట్టారు.
2016 కరువుకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2017 జూన్లో ఇచ్చారు. 2017లో కరువుకు సంబంధించిన ఇన్పుట్ సబ్సిడీ 2018 ఆగష్టులో ఇచ్చారు. 2018లో కరవు వల్ల ఖరీప్లో జరిగిన రూ.1832 కోట్లు పంట నష్టాన్ని, రబీలో జరిగిన రూ.356 కోట్ల పంట నష్టాన్ని పూర్తిగా ఎగ్గొట్టిన పరిస్ధితులు గత ప్రభుత్వంలో మనం చూశామన్నది మీరంతా గుర్తుకు తెచ్చుకోవాలి.
*అప్పటికీ - ఇప్పటికీ తేడా*
అప్పట్లో కౌలు రైతులను ఏరోజు అప్పటి ప్రభుత్వం గుర్తుపెట్టుకోలేదు. అప్పటికీ, ఇప్పటికీ ఉన్న తేడాను గమనించమని కోరుతున్నాను. ఈరోజు మన ప్రభుత్వంలో శాస్త్రీయంగా అర్హులెవరూ కూడా మిగిలిపోకుండా ఇ- క్రాప్ డేటాను ఆర్బీకే స్ధాయిలోనే పూర్తిగా అమలు చేస్తూ... పంట నష్టాలను అంచనా వేసే విధానాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. అలా చేయడమే కాకుండా దాని ద్వారా పారదర్శకతకు పెద్ద పీట వేస్తూ... గ్రామ సచివాలయాల్లోనే అర్హుల జాబితా ప్రదిర్శించి ఏ సీజన్లో జరిగిన నష్టపరిహారాన్ని అదే సీజన్లో రైతుల ఖాతాల్లో జమ చేస్తున్న ప్రభుత్వం మనదే.
కౌలురైతులు సైతం పంట వేసి ఉండి, ఇ- క్రాప్లో నమోదై ఉన్న వాళ్ల డేటా తీసుకుని.. వాళ్లకి కూడా ఇన్పుట్ సబ్సిడీ ఇస్తున్న మన ప్రభుత్వానికి గత ప్రభుత్వానికి తేడా గమనించమని కోరుతున్నాను.
ఇలా చేస్తున్నాం కాబట్టే... 2020 మార్చి వరకు కురిసిన భారీ వర్షాలకు, వరదలకు నష్టపోయిన 1.56 లక్షల మంది రైతు కుటుంబాలకు రూ.123 కోట్లు ఇన్పుట్ సబ్సిడీగా 2020 ఏఫ్రిల్లోనే అందజేశాం.
2020 ఏఫ్రిల్ నుంచి 2020 అక్టోబరు వరకు కురిసిన భారీ వర్షాలకు వరదల వల్ల నష్టపోయిన 3.71 లక్షల మంది రైతులకు రూ.278 కోట్లు 2020 అక్టోబరులోనే ఇన్పుట్ సబ్సిడీగా అందించాం. 2020 నవంబరులో నివార్ తుఫాను వల్ల నష్టపోయిన 8.35 లక్షల మంది రైతన్నలకు సుమారు రూ.646 కోట్లు, 2020 డిసెంబరులోనే అందజేశాం.
2021 సెప్టెంబరులో గులాబ్ సైక్లోన్ వల్ల నష్టపోయిన 34,556 మంది రైతన్నలకు సుమారు రూ.22 కోట్లు, 2021 నవంబరులోనే అందజేశాం.
*మిస్ అయిన వారికి మరో ఛాన్స్*
ఇలా ఇ- క్రాప్ డేటా ఆధారంగా గ్రామస్ధాయిలోనే ఆర్బీకేలలో జాబితా ప్రదిర్శించి ఏ ఒక్కరూ మిస్ కాకుండా.. ఒకవేళ మిస్ అయితే వారికి రీ అఫ్లికేషన్ పెట్టుకునే వెసులుబాటు కల్పిస్తూ... వారికి మంచి జరిగే పరిస్థితి కల్పిస్తూ... పంట నష్టానికి ఇన్పుట్ సబ్సిడీని కౌలు రైతులతో సహా మంచి చేస్తున్న ప్రభుత్వం మనది. ఇలా లబ్ధిదారుల జాబితాను సోషల్ ఆడిట్ కోసం అదే గ్రామంలో రైతుభరోసా కేంద్రాలలో ప్రదర్శిస్తున్నందున.. గ్రామస్ధాయిలో ఎవరైనా మిస్ అయితే వాళ్లు పేరులేకపోతే అక్కడే చూసుకొన్న తర్వాత మరలా నమోదు చేసుకునే వెసులుబాటును కూడా కల్పిస్తున్నాం. ఏ ఒక్కరూ మిస్ కాకూడదని ఆరాటపడుతున్న ప్రభుత్వం మనది.
*మనందరి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నేటి వరకూ*
అంటే... ఈ రెండున్న సంవత్సారల కాలంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల, పంటలు నష్టపోయిన 19.93 లక్షల మంది రైతులకు ఈ ఇన్పుట్ సబ్సిడీ ద్వారా అందించిన మొత్తం రూ.1612 కోట్లు.
మనందరి ప్రభుత్వం రైతన్నలకు ఎన్ని విధాలుగా, ఎంత అండగా నిల్చిందో మీ అందరికీ వివరిస్తాను.
*వైయస్సార్ రైతు భరోసా- పీఎం కిసాన్*
వైయస్సార్ రైతు భరోసా– పీఎం కిసాన్ కార్యక్రమం మీరంతా చూస్తున్నారు. అరకోటి మంది రైతన్నలకు వారి కుటుంబాలకు లబ్ధి చేకూర్చుతూ... ఇప్పటివరకూ రైతుభరోసా సాయం కింది రూ.19,126 కోట్లు ఇవ్వగలిగాం.
దేశంలో ఎక్కడా లేని విధంగా సొంతభూమి సాగు చేసుకుంటున్న రైతులతో పాటు అర్హులైన ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ కౌలు రైతులు, అటవీ, దేవాదాయ భూములు సాగు చేసుకుంటున్న రైతులకు ప్రతి యేటా రూ.13,500 చొప్పున రైతు భరోసా సాయం కింద అందిస్తున్న ఏకైక ప్రభుత్వం దేశంలో మనదే.
*వైఎస్సార్ సున్నావడ్డీ*
అంతే కాకుండా రైతున్నలకు అన్ని రకాలుగా తోడుగా నిలుస్తూ... వారిని చేయి పట్టుకుని నడిపించే కార్యక్రమం చేస్తూ... వైఎస్సార్ సున్నావడ్డీ పంట రుణాల పథకం కింద పూర్తి వడ్డీ రాయితీని జమ చేస్తున్నాం. మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సమయానికి రైతులు పేమెంట్ చెల్లిస్తే... వారికి ప్రభుత్వం తోడుగా ఉంటుంది. సున్నా వడ్డీ కోసం ప్రభుత్వం డబ్బులిస్తుందని తెలియజేస్తూ.. వైఎస్సార్ సున్నావడ్డీ కింద 65.64 లక్షల మంది రైతులకు రూ.1218 కోట్లు వడ్డీ రాయితీ కింద ఇవ్వడం జరిగింది. గత ప్రభుత్వం పెట్టిన బకాయిలను మన ప్రభుత్వమే చెల్లించింది.
*ఉచిత విద్యుత్కు ఇప్పటివరకూ రూ.23వేల కోట్లు ఖర్చు.*
రాష్టంలో 18.70 లక్షల మంది రైతన్నలకు పగటిపూటే 9 గంటలపాటు నాణ్యమైన విద్యుత్ ఇవ్వాలని... సంవత్సరానికి రూ.9వేలు కోట్లు ఖర్చు చేస్తూ... ఈ రెండున్నర సంవత్సరాల కాలంలోనే ఇప్పటివరకు రూ.23వేల కోట్లు ఖర్చు చేశాం.
వీళ్లందరికీ నాణ్యమైన విద్యుత్ పగటిపూటే అందేలా చేయాలంటే... ఫీడర్ల కెపాసిటీ సరిపోదు. వాటిని మార్పుచేయాలంటే అలా చేయడాని కోసం కూడా మరో రూ.1700 కోట్లు ఖర్చు చేసి మరీ రైతన్నలకు పగటి పూట విద్యుత్ ఇస్తున్నాం.
*ఉచిత పంటల బీమా*
ఈ రెండున్నరేళ్లలో వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకం ద్వారా 31.07 లక్షల మంది రైతులకు రూ.3788 కోట్లు అందించాం. ఈ ఖరీప్ నుంచి ప్రతి రైతు దగ్గర రూ.10 తీసుకొమ్మని అధికారులు చెప్పాం. రశీదు ఇచ్చి దానిపై సంతకం చేయమని ఆదేశాలు ఇచ్చాం.
దాదాపుగా రూ.2వేల కోట్లతో ప్రకృతివైపరీత్యాల నిధి, రూ3వేల కోట్లతో ధరలస్ధిరీకరణనిధిని ఏర్పాటు చేశాం.
*ధాన్యం సేకరణకే రూ.39 వేల కోట్లు*
ఈ రోజు కేవలం ధాన్యం సేకరణ, కొనుగోలు కోసం ఈ రెండున్నర సంవత్సరాల కాలంలో రూ.39వేల కోట్లకు పైగా ఖర్చు పెట్టాం. గతంలో ధాన్యం సేకరణ అంటే సంవత్సరానికి రూ.7నుంచి8 వేల కోట్లు ఖర్చు చేస్తూ.. అది కూడా సమయానికి బిల్లులు చెల్లించని పరిస్థితి ఉంటే... ఈ రోజు సంవత్సరానికి రూ.16 వేల కోట్లు ఖర్చు పెడుతున్నాం. అంతే కాకుండా 21 రోజుల్లోనే పేమెంట్ ఇచ్చే విధంగా రైతుల మొహాల్లో చిరునవ్వు చూస్తూ పేమెంట్స్ ఇస్తున్నాం.
ఇది కాకుండా ప్రత్తి రైతులకు కొనుగోలు కోసం రూ.1800 కోట్లు, ఇతర పంటల కొనుగోళ్లకు మరో రూ.6465 కోట్లతో... మార్కెట్ ఇంటర్వెన్షన్ ద్వారా రైతులకు తోడుగా నిలబడే కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వం జోక్యం చేసుకుని రైతులును ఆదుకునే కార్యక్రమం చేస్తుంది.
*గత ప్రభుత్వ బకాయిలూ చెల్లించాం.*
గత ప్రభుత్వం 2018లో ఎగ్గొట్టిన రూ.960 కోట్ల ధాన్యం సేకరణ బకాయిలు సైతం.. చిరునవ్వుతో మన ప్రభుత్వం స్వీకరించి కట్టింది. గత ప్రభుత్వం రైతులకు ఉచిత విద్యుత్ కోసం రూ.9వేల కోట్ల విద్యుత్ను కొనుగోలు చేసి బకాయిలుగా పెడితే.. వాటిని సైతం మన ప్రభుత్వమే చిరునవ్వుతో చెల్లించింది.
రూ.384 కోట్ల విత్తన బకాయిలను గత ప్రభుత్వం రైతులకు బకాయిలుగా పెట్టి పోతే... అవి కూడా మనందరి ప్రభుత్వమే చిరునవ్వుతో స్వీకరించి చెల్లించింది.
*ఆర్బీకేలు- బ్యాంకింగ్ కరస్పాండెంట్లు*
రైతులకు మరింత సులభంగా విత్తనం నుంచి పంట కొనుగోలు వరకూ మార్చడమే కాకుండా... బ్యాంకింగ్ సేవలను కూడా సులభతరం చేస్తూ గ్రామస్ధాయిలోకి తీసుకునిరావాలని 10,778 ఆర్బీకేలను బ్యాంకింగ్ సేవలతో అనుసంధానం చేస్తూ... ఇప్పటికే 9160 బ్యాంకింగ్ కరస్పాండెంట్లను ఆర్బీకేలలో అందుబాటులోకి తీసుకువచ్చాం.
వైయస్సార్ రైతు భరోసా, వైయస్సార్ సున్నావడ్డీ, వైయస్సార్ యంత్రసేవాపథకం కింద 1720 రైతు గ్రూపులకు గతంలో రూ.25.50 కోట్ల సబ్సిడీని వారికి అందజేస్తూ.. ప్రతి ఆర్బీకే పరిధిలో కమ్యూనిటీ హైరింగ్ సెంటర్ తీసుకొచ్చి తద్వారా రైతులకు యంత్రసేవను సరసమైన ధరలకు అందించే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం.
*కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు*
ఇలా ప్రతి అంశంలోనూ రైతుకు తోడుగా ఉండేందుకు... యంత్రసేవా అనే ఒక్క కార్యక్రమం ద్వారానే ప్రతి ఆర్బీకే పరిధిలోనూ ఆ గ్రామంలో వేస్తున్న పంటలేవి, వారికి ఎలాంటి యంత్ర పరికరాలు కావాలో చూసుకుని.. రైతులను ఒక గ్రూపుగా చేసి వారికి సబ్సిడీ ఇచ్చి దాదాపుగా రూ.2134 కోట్ల రూపాయల వ్యయంతో ఆర్బీకేలకు అనుసంధానం చేస్తూ... మొత్తం 10,750 ఆర్బీకే స్ధాయిలోనే యంత్రసేవా కేంద్రాలను అంటే కమ్యూనిటీ హైరింగ్ సెంటర్లు ఏర్పాటు చేసే గొప్ప కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. ఆ దిశగా అడుగులు వేగంగా పడుతున్నాయి. రానున్న సంవత్సరానికి అన్ని ఆర్పీకేల్లో ఈ సేవలు అందుబాటులోకి తీసుకొచ్చే గొప్ప కార్యక్రమం జరుగుతుంది.
*వ్యవసాయ సలహా మండళ్లు*
ఆర్బీకేలు వన్స్టాప్ సెంటర్గా అంటే విత్తనం నుంచి అమ్మకం దిశగా రైతన్నను చేయి పట్టుకుని నడిపించే గొప్ప ప్రయత్నం జరుగుతుంది. ఈ రోజు ఆర్బీకే స్ధాయిలోనే వ్యవసాయ సలహామండళ్లు ఏర్పాటు చేశాం. ఆర్బీకే స్ధాయి నుంచి వ్యవసాయ సలహామండళ్లు... మండలానికి ఒక సలహామండలి, జిల్లా స్ధాయిలో మరో వ్యవసాయ సలహా మండలి, రాష్ట్ర స్ధాయిలో మరో వ్యవసాయ సలహా మండలి ఇలా నాలుగు అంచల్లో ప్రతి నెలా సమావేశాలు జరిగేటట్టుగా.. ప్రతి శుక్రవారం ఒక చోట సమావేశం జరిగేలా చేసి, నెల తిరిగేసరికి నాలుగుచోట్ల ఈ సమావేశాలు నిర్వహించి... అక్కడున్న సమస్యలను యుద్ధ ప్రాతిపదికన పరిష్కరించే విధంగా జిల్లా యంత్రాంగాన్ని, రాష్ట్ర స్ధాయి యంత్రాంగాన్ని సమయాత్తం చేస్తున్నాం.
ఇ- క్రాపింగ్లో ప్రతి ఒక్కరూ నమోదు చేసుకోవడం ద్వారా పారదర్శకంగా, వివక్షకు, లంచాలకు తావులేకుండా.. ఆర్బీకే స్ధాయిలోనే ఇ- క్రాపింగ్ చేయడం, అది పూర్తయిన వెంటనే సోషల్ ఆడిట్ కోసం జాబితాలు ప్రదర్శించడం, ఎవరైనా మిస్ అయితే దరఖాస్తు చేసుకున్న వెంటనే వాళ్ల దరఖాస్తు వెరిఫై చేసి పేరు నమోదు చేయడం, ఈ క్రాపింగ్తో పాటు రశీదు ఇవ్వడం, డిజిటల్ అక్నాలెడ్జ్మెంట్ ఇవ్వడం చేస్తూ... పంటలబీమా, ఇన్పుట్ సబ్సిడీ, పంటల కొనుగోళ్లు, పంట రుణాలు, సున్నావడ్డీ వంటి అన్ని సదుపాయాలు కూడా పారదర్శకంగా గ్రామస్ధాయిలోనే ఆర్బీకేల పరిధిలో జరుగుతున్నాయి.
*పీఏసీఎస్ల నుంచి ఆప్కాబ్ వరకూ ఆధునీకరణ*
ఇవాళ ప్రాధమిక సహకార సంఘాల నుంచి ఆప్కాబ్ వరకు అన్నింటినీ ఆధునీకరిస్తున్నాం. వాటిలో కూడా కంప్యూటరీకరణ చేపట్టాం. సహకార వ్యవస్ధలో కూడా హెచ్ఆర్ విధానాన్ని తీసుకురావడం జరిగింది. అన్నిరకాలుగా సహకార వ్యవస్ధను బలోపేతం చేసే దిశగా అడుగులు పడుతున్నాయి. ఆర్బీకే స్ధాయిలో పంటలు నష్టాల్లో ఉంటే.. సీఎం యాప్ అంటే కంటిన్యూస్ మానిటరింగ్ ఆఫ్ అగ్రికల్చర్ ప్రైస్ అండ్ ప్రొడ్యూస్ అనే యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చాం. అంటే కనీస గిట్టుబాటు ధరలు ఆ ఆర్భీకే పరిధిలో ఏ రైతుకైనా రాని పరిస్థితి ఉందంటే.. ఆ కనీస గిట్టుబాటు ధరలు ఆ ఆర్బీకేలోనే డిస్ప్లే చేయడం జరిగింది. అంతకన్నా తక్కువ రేటుకు ఎక్కడైనా అమ్మే దుస్థితి రైతుకు వస్తే.. ఆ గ్రామ అగ్రికల్చర్ అసిస్టెంట్ వెంటనే సీఎం యాప్ ద్వారా ఆ ఇబ్బందిని యాక్టివేట్ చేస్తాడు. వెంటనే మార్కెటింగ్ శాఖ, జాయింట్ కలెక్టర్ జోక్యం చేసుకుని ఆ రైతుకు తోడుగా నిలబడుతూ.. కనీస గిట్టుబాటు ధరకు ప్రభుత్వమే కొనుగోలు చేసే గొప్ప వ్యవస్ధను ఆర్బీకే స్ధాయిలోకి తీసుకువచ్చాం.
*చివరిగా...*
ఇవి కాకుండా జళకళ ద్వారా రైతులకు అండగా నిలబడ్డాం. ఏపీ అమూల్ ద్వారా పాడిరైతులకు అండగా నిలబడ్డాం. ఇవి అన్నీ కూడా దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో ఇవన్నీ మీ బిడ్డ చేయగలుగుతున్నాడు. దేవుడు ఆశీర్వదించాలని...మీ చల్లని దీవెనలు ఎల్లకాలం ప్రభుత్వానికి ఇంకా మంచి చేసే విధంగా ఉండాలని ఆకాంక్షిస్తూ... ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నానని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
అనంతరం 2021 నవంబరులో కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల పంట నష్టంతోపాటు నేలకోత, ఇసుక మేటల కారణంగా నష్టపోయిన రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, యంత్ర సేవా పథకం కింద లబ్ధిదారులకు సంబంధించిన అమౌంట్ను కంప్యూటర్లో బటన్ నొక్కి వారి ఖాతాల్లో సీఎం జమ చేసారు.
ఈ కార్యక్రమంలో వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, పర్యాటకశాఖమంత్రి ముత్తంశెట్టి శ్రీనివాసరావు, రహదారులు, భవనాల శాఖ మంత్రి ఎం శంకరనారాయణ, ఏపీ అగ్రికల్చర్ మిషన్ వైస్ ఛైర్మన్ ఏం వీ యస్ నాగిరెడ్డి, వ్యవసాయశాఖ సలహాదారు అంబటి కృష్ణారెడ్డి, వ్యవసాయశాఖ స్పెషల్ సీఎస్ పూనం మాలకొండయ్య, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment