విధ్వంసానికి జగన్ ఓ ట్రేడ్ మార్క్
-రాష్ట్రంలో అన్ని రంగాలపైనా జగన్ గ్యాంగుల దాడి
- ఏ ఒక్కరూ ప్రశాంతంగా వుండటం జగన్కి ఇష్టంలేదు
- కక్షతోనే సినీ పరిశ్రమని ఇబ్బంది పెడుతున్నాడు
- నా తల్లిని కించపర్చావు-నీ తల్లి, చెల్లి, ఆలి, పిల్లల్ని మేం కించపర్చలేమా? అది మా సంస్కృతి కాదు
- నా తల్లిని దూషించిన ఏ ఒక్కడినీ వదలను
-పోలీసులపై వైసీపీ నేతలు దాడులు చేస్తే నో పోలీస్- చెత్తమీద పన్నేసిన చెత్తగాళ్లంటే అయ్యన్నపాత్రుడిపై కేసా?
- నాపై తప్పుడు రాతలు రాసిన దొంగ పత్రిక సాక్షి- దొంగ యజమాని జగన్ లపై న్యాయపోరాటం ఆగదు
-విశాఖ పర్యటనలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
విశాఖపట్టణం (ప్రజా అమరావతి);
విధ్వంసానికి జగన్రెడ్డి ఓ ట్రేడ్ మార్క్లాంటోడని, ఆంధ్రప్రదేశ్లో ఎవ్వరూ చల్లగా వుండకూడదనే లక్ష్యంతో పరిపాలన సాగిస్తున్నారని, అన్నివ్యవస్థలపైనా జగన్ దాడులు చేశారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. సాక్షి పత్రిక తనపై రాసిన తప్పుడు కథనాలపై పరువునష్టం దావా వేసిన నారా లోకేష్ కేసు విచారణ ప్రారంభం కావడంతో గురువారం విశాఖ కోర్టుకి వచ్చారు. కేసు 28వ తేదీకి వాయిదా పడగా, కోర్టు బయట తనను కలిసిన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక పరిశ్రమలపైనా, ప్రజలపైనా, డాక్టర్ సుధాకర్, డాక్టర్ అనితారాణి లాంటి వందల మందిపై దాడి చేశారని, ఇప్పుడు సినిమా పరిశ్రమపై దాడి చేస్తున్నారని చెప్పారు. జగన్ దాడులకు ఓ ట్రేడ్ మార్క్, విధ్వంసకర పరిపాలన చూసి విశాఖకి రావాల్సిన అదానీ డేటా సెంటర్ ముంబైకి తరలిపోయిందన్నారు. దీనిపై
ఇక్కడ తిరిగే విజయసాయిరెడ్డిని మీడియా ప్రతినిధులు నిలదీయాలని సూచించారు. ఒక్క కొత్త భవనం కట్టడం చేతకాక టిడిపి ప్రభుత్వం కట్టిన భవనాల్లో వుంటూ , కొత్తగా మూడు రాజధానులు కడతామని డప్పు కొట్టుకుంటున్నారని ఎద్దేవ చేశారు. ఐటీ అభివృద్ధి కోసం మేము మిలినీయం టవర్స్ కట్టిస్తే, అది కూడా ఖాళీ చేయించడమేనా విశాఖలో చేసిన అభివృద్ధి అని ప్రశ్నించారు. అయ్యన్నపాత్రుడు గారు ఏమన్నారని ఆయనని అరెస్టు చేయడానికి వేలాది మంది పోలీసులతో దిగారని లోకేష్ ప్రశ్నించారు. చేతగాని పాలన చేస్తున్న వారిని యూజ్లెస్ ఫెలో/ వేస్ట్ ఫెలో అనడం బూతా? నేరమా? అని నిలదీశారు. వైసీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు పోలీసుల్ని కించపరుస్తూ దాడులు చేస్తుంటే పోలీసులు స్పందించడంలేదు ఎందుకని నిలదీశారు. వైసీపీకి ఓ ఐపీసీ సెక్షనా? టిడిపి మరో ఐపీసీ సెక్షనా? అమలు చేస్తున్నారా అని ప్రశ్నించారు. 2019 ఎన్నికలు అయ్యేవరకూ ఒక్క కేసూలేని నాపై 11 కేసులు బనాయించారని, అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారని అయినా భయపడే ప్రసక్తే లేదన్నారు. దేశాన్ని దోచి జగన్లా జైలుకెళ్లలేదని, ప్రజల కోసం పోరాడుతుంటే కేసులు పెడుతున్నారని అయినా తగ్గేదేలేదన్నారు. వైసీపీ గెలిచిన నుంచి రాష్ట్రంలో యుద్ధవాతావరణం నెలకొందన్నారు. ఏపీలో నిజమైన టెర్రరిస్టులు, రౌడీలు వైసీపీ వారేనన్నారు. శాసన సభ సాక్షిగా నా తల్లిని దూషించారని, జగన్ ప్రోద్బలంతోనే ఇది జరిగిందని...జగన్రెడ్డి తల్లి, చెల్లి, భార్య, పిల్లల్ని గురించి మేము మాట్లాడగలము..మాకు నోరుంది...కానీ మాది ఆ సంస్కృతి కాదని లోకేష్ స్పష్టం చేశారు. నా తల్లి ఎంత బాధపడింతో చూశానని, ఒక కొడుకుగా నా తల్లి ఆవేదనకి బదులు తీర్చుకునే తీరుతానన్నారు. నా తల్లిని కించపర్చిన ఏ ఒక్కడినీ వదిలిపెట్టనని శపథం చేశారు. విశాఖపట్టణంలో స్టేడియంని తాకట్టు పెట్టి జగన్ దుబారా ఖర్చులు చేస్తున్నాడని, ఇది ఇలాగే కొనసాగితే మనం నిల్చున్న రోడ్డు, రోడ్డు పక్క చెట్లూ తాకట్టు పెట్టేస్తాడన్నారు. చెత్తమీద పన్ను వేసిన వాడిని చెత్తనాకొడుకు అంటే తప్పేంటి? అని ఎదురు ప్రశ్నించారు. పంచాయతీ రాజ్ శాఖా మంత్రిగా రెండున్నరేళ్లు పనిచేసి వివిధరంగాలలో సాధించిన ప్రగతికి 52 అవార్డులు తీసుకొచ్చానని లోకేష్ తెలిపారు. మంత్రిగా చెత్త నుంచి సంపద ఎలా సృష్టించాలో చూశాను గానీ, చెత్త మీద పన్ను వేయాలనే ఐడియా నాకు రాలేదని వ్యంగ్యంగా జగన్ రెడ్డికి చురకలంటించారు. ఎన్టీఆర్ పేరుతో జిల్లా పెట్టారు కదా జగన్ అని మీడియా ప్రతినిధులు ప్రశ్నకి ..ఎన్టీఆర్ అంటే ప్రేమ వుంటే ఆయన విగ్రహాల్ని ధ్వంసం చేయరని, అన్న క్యాంటీన్లను మూసేయరని, ఎన్టీఆర్ పేరుతో నడిచే సంక్షేమ పథకాలు ఆపేయరని సమాధానం ఇచ్చారు.
సాక్షినీ వదలను...దాని యజమానినీ వదలను
-నన్ను రాజకీయంగా దెబ్బతీయాలనే జగన్ పదేళ్లుగా కుట్రలు చేస్తూనే వున్నాడు
-తప్పుడు వార్తలు రాసేవారిపైనా న్యాయపోరాటం ఆగదు
-తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్
నేను విదేశాలలో చదువుతున్నప్పటి నుంచే దాడులు మొదలుపెట్టిన జగన్ రెడ్డి గ్యాంగ్, రాజకీయాల్లోకి వచ్చినాక వాటిని ఇంకా తీవ్రం చేసిందని...నా పరువుకి భంగం కలిగించే తప్పుడు వార్తలు రాసినా-ప్రసారం చేసినా ఎవ్వరినీ వదిలిపెట్టనని నారా లోకేష్ శపథం చేశారు. అవాస్తవ కథనాలతో నా పొలిటికల్ కెరీర్ని దెబ్బతీయాలని చూసిన దొంగ సాక్షి, దాని దొంగ యజమానిని వదిలే ప్రసక్తే లేదని మరోమారు స్పష్టం చేశారు. నారా లోకేష్ మంత్రిగా వున్నప్పుడు చిరుతిళ్లకి రూ. 25 లక్షల ప్రజాధనం వెచ్చించారని సాక్షిలో వేసిన కథనం అవాస్తవాలతో కూడినదని, ఆధారాలతో సహా కోర్టులో లోకేష్ రూ. 75 కోట్లకు పరువు నష్టం కేసు దాఖలు చేశారు. ఈ కేసు విచారణ విశాఖ కోర్టులో ఆరంభం కావడంతో ఆయన గురువారం హాజరయ్యారు. కేసు విచారణ 28వ తేదీకి వాయిదా పడింది. ఈ సందర్భంగా కోర్టు బయట తనను కలిసిన విలేకరులతో నారా లోకేష్ మాట్లాడుతూ నేను మంత్రిగా వున్నప్పుడు సాక్షిలో రాసిన తేదీలలో ఒక్కరోజే విశాఖలో వున్నానని, మొత్తం అవాస్తవాలతో కూడిన కథనం రాసిన సాక్షి నా వివరణ తీసుకోలేదని, పంపిన నోటీసుకి సమాధానం ఇవ్వలేదన్నారు. సాక్షితోపాటు డెక్కన్ క్రానికల్ కూడా వివరణ ఇవ్వలేదన్నారు. ఇవే కథనాలు ప్రచురించిన ది వీక్ మాత్రం క్షమాపణలు చెప్పడంతోపాటు ఖండన వేసిందన్నారు. అవాస్తవ కథనాలు రాయడంతోపాటు నోటీసులు పంపితే వివరణ కూడా ఇవ్వని సాక్షిపై 75 కోట్లకు, డెక్కన్ క్రానికల్పై 25 కోట్లకు పరువునష్టం దావా వేశానన్నారు. జగన్ ఆయన మీడియా సంస్థలు నాపై ఎన్నో విషప్రచారాలు చేశాయని, వీటి వాస్తవాలు ప్రజలకి తెలియజేయాలన్నదే తన లక్ష్యమన్నారు. నేను రాజకీయాలలోకి రాకముందు నుంచే నాపై దాడి మొదలుపెట్టారని..విదేశాలలో నా చదువుకి ఎవరో ఫీజులు కట్టారని కట్టుకథలు అల్లారని అవి తప్పని తేలిపోయాయన్నారు. విదేశాలలో వున్నప్పుడే జగన్, సాక్షి వాళ్లు నాకు వాళ్ల మీడియా ద్వారా ఓ పెళ్లి చేసి పిల్లాడు కూడా పుట్టాడనే అత్యంత అసత్యాలను అచ్చోసి వదిలేశారన్నారు. జగన్ ఆయన దొంగ మీడియా సాక్షి అవాస్తవ కథనాలతో రాజకీయంగా నన్ను దెబ్బతీయాలని పదే పదే ప్రయత్నిస్తూనే వుందని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్రెడ్డి సీఎం కాకముందు ఏడాదికి వారి ఆదాయం 9 లక్షలుంటే, సీఎం అయ్యాక ఏడాదికి జగన్ రెడ్డి 45 కోట్లు అడ్వాన్స్ టాక్స్...అంటే తన సంపాదనపై ఆదాయపు పన్ను కట్టే స్థాయికి చేరాడంటే ఏ రేంజులో అవినీతి చేశాడో ప్రజలు గుర్తించాలన్నారు. ఆ అవినీతితో పుట్టిన పత్రిక సాక్షి..వ్యక్తిగతంగా నాపైనా, టిడిపిపైనా, చంద్రబాబుపైనా అబద్ధాల కథనాలతో ఇప్పటికీ దాడి చేస్తూనే ఉందన్నారు. 2019లో జగన్ రెడ్డి బాబాయ్ వివేకానందరెడ్డి హత్య జరిగితే, ఈ దొంగ పత్రిక సాక్షి ఆనాడు నారాసుర రక్తచరిత్ర అని రాస్తూనే,
రాజారెడ్డి, వివేకానందరెడ్డిలను చంద్రబాబు చంపేశారని చంద్రబాబు చేతిలో ఓ వేటకత్తి పెట్టి రాసిందని, ఈ రోజు సీబీఐ దర్యాప్తులో వైఎస్ జగన్రెడ్డి కుటుంబసభ్యులే వివేకానందరెడ్డిని చంపేశారని తేలిందన్నారు. నాపైన చినబాబు తిరుతిండి.. 25 లక్షలంటూ తప్పుడు రాతలు రాశారని, వీటికి భయపడే ప్రసక్తే లేదని ...తప్పుడు వార్తలు రాసినా, వేసినా పరువునష్టం కేసులకి సిద్ధంగా వుండాలని హెచ్చరించారు. ఈ న్యాయపోరాటం ఇక్కడితో ఆగదని దొంగ పత్రిక సాక్షి, దాని దొంగ యజమాని జగన్రెడ్డికి గుణపాఠం చెప్పేవరకూ కొనసాగిస్తానని లోకేష్ స్పష్టం చేశారు.
addComments
Post a Comment