ఏపిఐసి - న్యూఢిల్లీ – ఫిబ్రవరి 22, (ప్రజా అమరావతి);
రాష్ట్ర మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతి స్మృత్యర్థం సంతాప సభ
రాష్ట్ర పరిశ్రమలు, వాణిజ్యం మరియు ఐటీ శాఖ మంత్రి మేకపాటి గౌతం రెడ్డి మృతి స్మృత్యర్థం సంతాప సభను ఆంధ్రప్రదేశ్ భవన్ లోని అంబేద్కర్ ఆడిటోరియంలో ఈ రోజు సాయంత్రం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖామాత్యులు బొత్స సత్యనారాయణ, పార్లమెంటు సభ్యులు రెడ్డప్ప, తలారి రంగయ్య, గురుమూర్తి, సత్యవతి, గోరంట్ల మాధవ్, చంద్రశేఖర్, ప్రభుత్వ సలహాదారు ప్రభాకర్ సింగ్, ఏ.పీ భవన్ ప్రిన్సిపల్ రెసిడెంట్ కమిషనర్ ప్రవీణ్ ప్రకాశ్, స్పెషల్ కమిషనర్ ఎన్. వి. రమణా రెడ్డి మరియు ఏ.పీ భవన్ ఉద్యోగులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి బొత్స సత్యనారాయణ గౌతం రెడ్డి చిత్రపటానికి జ్యోతిప్రజ్వలన గావించి పుష్పాంజలి ఘటించారు. మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాటే వేదంగా, శాసనంగా భావించి పనిచేసుకుపోయే గౌతం రెడ్డి ఇక లేడనే వార్తను జీర్ణించుకోలేకపోతున్నానన్నారు.
గౌరవ పార్లమెంటు సభ్యులు మాట్లాడుతూ గౌతం రెడ్డి ఎంతో చురుకైన వ్యక్తని, నిరాడంబరుడని కొనియాడారు.
ఏ.పీ భవన్ పీ.ఆర్.సీ ప్రవీణ్ ప్రకాశ్ మాట్లాడుతూ గౌతం రెడ్డి ఎంతో నిబద్ధత, కార్యదక్షత కల్గిన వారని పేర్కొన్నారు. స్నేహశీలి, మృదుస్వభావి అయిన గౌతం రెడ్డి రాష్ట్ర పరిశ్రామికాభివృద్ధికి అమితమైన కృషిసల్పారన్నారు. దేశంలోని ఇతర రాష్ట్రాల కంటే రాష్ట్ర ఐ.టీ విధానం మెరుగైనదని, ఈ ఖ్యాతి గౌతం రెడ్డి కే చెందుతుందన్నారు. ఆయన మృతి తీరని లోటని, వారి కుటుంబానికి తన సానుభూతి, ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు.
addComments
Post a Comment