ఆయిల్ పామ్ విస్తరణకు ముమ్మురంగా చర్యలు

 



ఆయిల్ పామ్ విస్తరణకు ముమ్మురంగా చర్యలు 


కొత్తగా 1.12లక్షల హెక్టార్లలో విస్తరణకు యాక్షన్‌ ప్లాన్‌


మ్యాపింగ్‌ చేసేందుకు నిపుణుల కమిటీ 


నర్సరీల్లో ఆయిల్‌ పామ్‌ మొక్కల ఉత్పత్తి


–వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు


విజయవాడ (ప్రజా అమరావతి): రాష్ట్రంలో బోర్ల కింద వరికి బదులు ఆయిల్‌ పామ్‌ సాగును ప్రోత్సహించేలా చర్యలు తీసుకోవాలని  రాష్ట్ర వ్యవసాయ శాఖమంత్రి కురసాల కన్నబాబు అధికారులను ఆదేశించారు. ఆయిల్‌ పామ్‌ సాగు చేసేందుకు అనువైన మెట్ట ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్‌ చేసేందుకు నిపుణులతో కమిటీ ఏర్పాటు చెయ్యాలన్నారు. ఆయిల్‌ పామ్‌  సాగు విస్తరణపై మంత్రి కన్నబాబు విజయవాడ లోని తన క్యాంప్‌ కార్యాలయంలో బుధవారం ఉద్యాన శాఖ అధికారులతో సమీక్షించారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఆయిల్ పామ్ విస్తరణను వేగవంతం చేయాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశించినట్టు మంత్రి తెలిపారు . ఆయిల్‌పామ్‌ సాగులో ఏపీ దేశంలోనే నెం.1 స్థానంలో ఉందన్నారు. 8 జిల్లాల పరిధిలో 1.32లక్షల మంది రైతులు 1.81లక్షల హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగు చేస్తుండగా,హెక్టార్‌కు 19.81 టన్నుల దిగుబడి వస్తోందన్నారు. ఆయిల్‌ పామ్‌ మిషన్‌ కింద రానున్న ఐదేళ్లలో రాష్ట్రంలో కొత్తగా మరో 1.12లక్షల హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగును విస్తరించాలని లక్ష్యంగా నిర్ధేశించినట్టు చెప్పారు. ఆయిల్‌ పామ్‌ సాగు కోసం ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా ప్రభుత్వం గణనీయంగా పెంచిందన్నారు. 2020–21 సీజన్‌లో కొత్తగా 8801 హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ సాగును విస్తరించగా, ప్రభుత్వం రూ.30.61కోట్లు ఖర్చు చేసిందన్నారు. 2021–22 సీజన్‌లో ఆయిల్‌ పామ్‌ సాగు విస్తరణ కోసం రూ.81.45కోట్లు ఖర్చు చేస్తుందన్నారు. కొత్తగా 15వేల హెక్టార్లు సాగులోకి తీసుకురావాలక్ష్యంగా నిర్ధేశించగా, ఇప్పటికే 10,561 హెక్టార్లలో ఆయిల్‌ పామ్‌ తోటలు వేసారన్నారు. ఆయిల్‌ పామ్‌ విస్తరణకు ఆర్ధిక చేయూతనిచ్చేందుకు కేంద్రం సిద్దంగా ఉందని, ఆ దిశగా అధికారులు చిత్తశుద్ధితో కృషి చేయాలన్నారు. ఆయిల్‌ పామ్‌కు కేరాఫ్‌ గా ఏపీని తీర్చిదిద్దేందుకు చర్యలు తీసుకుంటు న్నామన్నారు.ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డి ఆదేశాల మేరకు రానున్న ఐదేళ్ల ఆయిల్‌ పామ్‌ విస్తరణ ప్రాజెక్టును వేగవంతం చేయాలన్నారు.  ఆయిల్‌ పామ్‌ సీడ్‌ ఉత్పత్తిని పెంచాలని, ప్రైవేటు సంస్థలే కాకుండా ఉద్యాన నర్సరీల్లో కూడా ఆయిల్‌ పామ్‌ మొక్కల ఉత్పత్తికి చర్యలు తీసుకోవాలన్నారు. ఆయిల్‌ పామ్‌ సాగుకు ముందు కొచ్చే ప్రతీ రైతుకు మొక్కలు అందుబాటులో ఉండేటట్టు చూడాలన్నారు. వ్యవసాయ శాఖ స్పెషల్‌ సీఎస్‌  పూనం మాలకొండయ్య, ఉద్యాన శాఖ కమిషనర్‌ ఎస్‌ఎస్‌ శ్రీధర్, అడిషనల్‌ డైరక్టర్‌ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Comments