ఇళ్ళ నిర్మాణాల్లో పురోగతి సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతంగా చేపట్టాలి


నెల్లూరు, ఫిబ్రవరి 10 (ప్రజా అమరావతి): 

నవరత్నాలు - పేదలందరికీ ఇల్లు పథకం కింద పేదలకు మంజూరైన ఇళ్ళ నిర్మాణాల్లో పురోగతి సాధించేందుకు అవసరమైన అన్ని చర్యలు వేగవంతంగా చేపట్టాలని



జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు అధికారులను ఆదేశించారు.


గురువారం కలెక్టరేట్లోని ఎస్.ఆర్. శంకరన్  వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుండి ఆర్.డి.ఓ లు, మున్సిపల్ కమిషనర్లు, మండల ప్రత్యేక అధికారులు, ఎం.పి.డి.ఓ లు, తహశీల్దార్ల తో  నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా  కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు  మాట్లాడుతూ,  ప్రతి మండలంలో  ప్రతి లేఔట్ లో  ఇళ్ల నిర్మాణాలతో పాటు  అంతర్గత  రోడ్లు, లింకు రోడ్లు, మంచినీటి సదుపాయం ఇతర మౌలిక వసతులను త్వరితగతిన కల్పించేందుకు  అధికారులు ప్రత్యేక శ్రద్ద తీసుకోవాలని, ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్, విద్యుత్ శాఖల పర్యవేక్షక ఇంజనీర్లు పూర్తిస్థాయిలో బాధ్యత తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.   ప్రతి వారం జరుగుచున్న పనులకు సంబంధించి  బిల్లులు విడుదల అవుతున్నాయని,  ప్రతి రోజు  స్టేజ్ వైజ్ కన్స్ట్రక్షన్  లక్ష్యాలను నిర్ధేశించుకొని ఆయా పనులకు సంబంధించిన బిల్లులు ఎప్పటికప్పుడు ఆన్లైన్  అప్లోడ్ అయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్, అధికారులను ఆదేశించారు.  


  ఓటిఎస్ పధకాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకునేలా  చర్యలు చేపట్టాలని, ఇప్పటికే నగదు చెల్లించిన వారికి రిజిస్ట్రేషన్ల ప్రక్రియను త్వరితగతిన పూర్తిచేయాలని, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో సాక్షుల వివరాలను పూర్తిగా నమోదు చేయాలని, 22 ఎ సమస్యను పరిష్కరించాలని  ఆదేశించారు. 

 అలాగే స్పందన అర్జీలను ఎప్పటికప్పుడు పరిష్కరించాలని, వచ్చిన సమస్యలపై మళ్లీ మళ్లీ అర్జీలు రాకుండా చర్యలు చేపట్టాలన్నారు. జూన్ చివరి  నాటికి సచివాలయ ఉద్యోగులకు ప్రొబేషన్ డిక్లేర్ చేసి కొత్త పే స్కేల్స్ అమలు చేసేందుకు అవసరమైన సంబంధిత శాఖా పరమైన పరీక్షలను పూర్తిచేయాలని సూచించారు. కోవిడ్ తో మృతి చెందిన ఉద్యోగుల సమాచారాన్ని శాఖల వారీగా తెలిపి,  వారి కుటుంబ సభ్యులకు బీమా ప్రయోజనాలు కల్పించాలని, కారుణ్య నియామకాల ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని ఆదేశించారు. 


 ఈ వీడియో కాన్ఫరెన్స్లో జాయింట్ కలెక్టర్లు శ్రీ హరేందిర ప్రసాద్, శ్రీ గణేష్ కుమార్, శ్రీ జాహ్నవి, శ్రీమతి రోజ్ మాండ్, హౌసింగ్ పి.డి శ్రీ వేణుగోపాల్ రావు, కావలి ఆర్డిఓ శీనా నాయక్, పౌర సరపరాల సంస్థ డి.ఎం  శ్రీమతి పద్మ,  ఆర్డబ్ల్యూఎస్, పబ్లిక్ హెల్త్ ఎస్ఇలు శ్రీనివాస్ కుమార్, జానీ తదితర అధికారులు పాల్గొన్నారు. 


Comments