జీడీపీ పెరుగుదలతో సమాన స్థాయిలో ఇస్తున్న రుణాలు కూడా ఉండాలి. సుస్థిర ఆర్థిక ప్రగతికి ఇది చాలా అవసరం.


అమరావతి (ప్రజా అమరావతి);


*క్యాంప్‌ కార్యాలయంలో జరిగిన స్టేట్‌ క్రెడిట్‌ సెమినార్‌ 2022–23లో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్‌.జగన్‌.* 


*స్టేట్‌ ఫోకస్‌ పేపర్‌ 2022–23 ను విడుదల చేసిన ముఖ్యమంత్రి.*



*ఈ సందర్భంగా సీఎం శ్రీ వైయస్‌.జగన్‌ ఏమన్నారంటే..:*


అద్భుతమైన సదస్సులో భాగస్వామ్యులవుతున్నందుకు చాలా ఆనందంగా ఉంది. దీనిద్వారా అభివృద్ధిబాటలో పయనించడానికి ఇంకా మనమేం చేయాలి ? మనం ఎక్కడున్నామనేది స్పష్టమవుతుంది.  2020–21 ఆర్ధిక సంవత్సరానికి గానూ దేశ జీడీపీ 8.9 శాతంగా నమోదైంది.


ఫిబ్రవరి 11, 2022 నాటికి దేశవ్యాప్తంగా బ్యాంకులు ఇచ్చిన రుణాలు రూ.115 లక్షల కోట్లు. ఈ విషయంలో ఏటా 7.86శాతం వృద్ధి మాత్రమే కనిపిస్తోంది. 

జీడీపీ పెరుగుదలతో సమాన స్థాయిలో ఇస్తున్న రుణాలు కూడా ఉండాలి. సుస్థిర ఆర్థిక ప్రగతికి ఇది చాలా అవసరం.


ఈ విషయంలో కొత్త వ్యూహాలదిశగా అడుగులు వేయాలి.

 కోవిడ్‌ –19 విసిరిన సవాళ్ల నేపథ్యంలో కూడా 60శాతం మంది ప్రజలు ఆధారపడ్డ వ్యవసాయం, దాని అనుంధ రంగాలు 4.16శాతం ప్రగతిని సాధించాయి.  రాష్ట్రంలో చేస్తున్న పలు కార్యక్రమాలకు నాబార్డ్, బ్యాంకులు సహాయపడుతున్నాయి.  కోవిడ్‌ సమయంలో చాలా మంచి సహాయాన్ని అందించాయి. అందరికీ ధన్యవాదాలు.  రైతు భరోసా, సున్నావడ్డీ రుణాలు, రైతులకు ఉచిత పంటల బీమా ఇవన్నీ అమలు చేస్తున్నాం. 


ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాన్ని వ్యవసాయరంగంలో అగ్రగామిగా నిలబెట్టడమే మన ప్రభుత్వ లక్ష్యం. దీనికోసం అనేక కార్యక్రమాలు చేపడుతున్నాం. 

దీనికోసం రైతు భరోసా, రుణాలు సకాలంలో చెల్లించిన వారికి వడ్డీలేని పంట రుణాలు, క్రాప్‌ఇన్సూరెన్స్‌ కోసం రైతులు చెల్లించాల్సిన ప్రీమియం అమౌంట్‌ను వారి తరపున ప్రభుత్వమే చెల్లించడంతో పాటు ఆర్బీకేల ద్వారా ఇ– క్రాప్‌చేసి, పారదర్శకంగా చేస్తున్నాం. గతంలో ఇది చాలా కష్టంగా ఉండేది. కొంతమంది రైతులు ఇ–క్రాప్‌ చేసుకునేవారు, కొంతమంది ఇ–క్రాప్‌ చేసుకోలేకపోవడం వల్ల ప్రకృతివైపరీత్యాలు సంభవించినప్పుడు రైతులు పెద్ద ఎత్తున నష్టపోయేవారు. వాటిని పరిష్కరించడానికే రైతుల తరపున ఇన్సూరెన్స్‌ ప్రీమియం చెల్లించే బాధ్యతను కూడా రాష్ట్ర ప్రభుత్వమే తీసుకుంది. సబ్సిడీ మీద వ్యవసాయ ఉపకరణాలను కూడా రైతులకు వ్యక్తిగతంగా సరఫరా చేయడంతో పాటు సీహెచ్‌సీలు(కస్టమ్‌ హైరింగ్‌ సెంటర్స్‌) ద్వారా కూడా అందించే ఏర్పాట్లు చేస్తున్నాం. దాదాపు 10,700 ఆర్బీకేలు సాగు రంగంలో కీలకపాత్ర పోషిస్తున్నాయి. 


*ఆర్బీకేలు కేంద్రంగా..* 

రైతుకు విత్తనం నుంచి పంట విక్రయం వరకూ కూడా చేదోడుగా నిలుస్తున్నాయి. గ్రామ స్థాయిలో ఇ– క్రాపింగ్‌ విధానాన్ని అమలు చేస్తున్నాం. ఇందు కోసం అవసరమైన సిబ్బందిని కూడా గ్రామసచివాలయాల్లో నియమించాం. వ్యవసాయ రంగంలో ఇది విప్లవాత్మక చర్య. 


రూరల్‌ నియోజకవర్గాల స్థాయిలో అగ్రి ల్యాబ్స్‌ ఏర్పాటు చేశాం. 147 నియోజకవర్గాల్లో వీటిని ఏర్పాటు చేశాం. ఆర్బీకేల స్థాయిలో వ్యవసాయ అనుబంధ రంగాల్లో గణనీయంగా మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తున్నాం. విప్లవాత్మకంగా వ్యవసాయరంగంలో గ్రామస్ధాయిలోనే  పెద్ద ఎత్తున సంస్కరణలు చేపడుతున్నాం.  వీటితో పాటు గ్రామస్ధాయిలోనే వ్యవసాయ మౌళిక సదుపాయాలనూ ఏర్పాటు చేస్తున్నాం. ప్రైమరీ ప్రాససింగ్‌ సెంటర్లు, 

 గోడౌన్లు, కోల్డ్‌ స్టోరేజీలు ఏర్పాటు, వ్యవసాయ ఉపకరణాల్లాంటివి ఏర్పాటు చేస్తున్నాం.


వీటికి అదనంగా పార్లమెంటు నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని పార్లమెంటు నియోజకవర్గ స్థాయిలో సెకండరీ పుడ్‌ ప్రాససింగ్‌ యూనిట్లు కూడా ఏర్పాటు చేస్తున్నాం.  దీనికి మీ సహాయ సహకారాలు కావాలి.  రైతుల ఉత్పత్తులకు అదనపు విలువ జోడించడానికే ఈ కార్యక్రమాలన్నీ చేపడుతున్నాం. 


సహకార బ్యాంకులను, సొసైటీలను బలోపేతం చేస్తున్నాం. పారదర్శక విధానాలను తీసుకు వస్తున్నాం. ఆర్బీకేల్లో ఉన్న బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు బ్యాంకులు, సొసైటీలకు అనుసంధాన కర్తలుగా వ్యవహరిస్తారు.  దీనిపై బ్యాంకులతో కలిసి కార్యాచరణ ప్రణాళిక సిద్ధంచేయమని అధికారులను ఇప్పటికే ఆదేశించాను.


ఫుడ్‌ ప్రాససింగ్, కేంద్ర సహకార బ్యాంకులు, సొసైటీల బలోపేతంపై దృష్టిపెట్టాం.  ఆర్బీకే, ఇ –క్రాపింగ్, విలేజ్‌ అగ్రికల్చర్‌ అసిస్టెంట్‌తో పాటు 542 సేవలను అందిస్తున్న గ్రామ సచివాలయాలు మనకు అందుబాటులో ఉన్నాయి.  వీటన్నింటిని ఒకే తాటిపైకి తీసుకువస్తున్నాం. బ్యాంకింగ్‌ కరస్పాండెంట్లు కీలకంగా వ్యవహరిస్తారు. రుణసదుపాయం కల్పనలో ఆర్బీకేలు సంధానకర్తలుగా ఉండాలి. వ్యవసాయం చేస్తూ..అర్హత ఉన్న ప్రతి రైతుకీ రుణం అందాలి. ఈ మేరకు బ్యాంకులతో సమావేశమై తగిన కార్యాచరణ ప్రణాలికతో తయారు చేయాలి. ఈ మేరకు ఎస్‌ఓపీ తయారు చేయాలి.  దీన్ని అమలు చేయడానికి కావాల్సిన ప్రణాళిక సిద్దం చేయాలి. 


ఆర్బీకేల స్థాయిలో డ్రోన్లు తీసుకు వస్తాం.

వీటిని నిర్వహించే నైపుణ్యాలను గ్రామస్థాయిలోనే అభివృద్ధిచేస్తాం. మనం ఇప్పుడు నానోఫెర్టిలైజర్స్‌ వంటి టెర్మినాలజీ ఉపయోగిస్తున్న ఆధునిక యుగంలో ఉన్నాం. దాన్ని అందుకునే దిశగా వ్యవసాయరంగంలో భవిష్యత్తు టెక్నాలజీపై దృష్టిపెడతాం.


నాడు–నేడు విద్య, వైద్య రంగంలో వాస్తవికమైన సంస్కరణలు చేపట్టాం. ఆధునిక వైద్యం అందుబాటులో ఉన్న ఆసుపత్రులు మన దగ్గర అందుబాటులో లేవు. హైదరాబాద్, బెంగుళూరు, చెన్నై లాంటి పెద్ద నగరాలుంటే సూపర్‌ స్పెషాలిటీ ఆసుపత్రి సేవలు అందుబాటులోకి వస్తాయి. ప్రైవేటు రంగంలో వైద్య సేవలు లభించే అవకాశం ఉంటుంది. దురదృష్టవశాత్తూ రాష్ట్ర విభజన తర్వాత మనకు అలాంటి నగరాలు లేకుండా పోయాయి.  మనం 16 కొత్త మెడికల్‌కాలేజీలను నిర్మిస్తున్నాం. ఇప్పటికే ఉన్న 11 మెడికల్‌కాలేజీలను నాడు – నేడు కింద అభివృద్ధిచేస్తున్నాం. కొత్త జిల్లాలు ఏర్పాటు చేస్తున్నాం. మొత్తం 27 మెడికల్ కాలేజీలు వస్తాయి. 


స్కూళ్లను మెరుగుపరుస్తున్నాం.  నాణ్యమైన కనీస మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నాం. విద్యారంగంలోనూ సమూల మార్పుల్లో భాగంగా ఇంగ్లిషు మీడియంను ప్రవేశపెట్టాం. గ్రామీణ ప్రాంతాల్లో పిల్లలు మంచి విద్యావంతులు కావాలి. వారికి నాణ్యమైన విద్య అందాలి. అందులో భాగంగా అన్ని స్కూళ్లను ఇంగ్లిషు మీడియంగా మార్చాం. సీబీఎస్‌ఈ విధానాన్ని ప్రవేశపెడుతున్నాం. పిల్లలకు సౌకర్యంగా ఉండేందుకు వీలుగా... తెలుగు, ఇంగ్లిషు భాషల్లో బైలింగువల్‌ పాఠ్యపుస్తకాలను ముద్రించాం. 

భవిష్యత్తులో ఈ పిల్లలు మంచి నైపుణ్యం ఉన్న మానవ వనరులుగా అభివృద్ధి చెందుతారు. స్కూళ్లను అప్‌గ్రేడ్‌ చేస్తూ... ప్రతి స్కూల్‌లోనూ కనీస సౌకర్యాలు కల్పించే దిశగా మార్పు చేస్తున్నాం. 

పరిశుభ్రమైన నీరు, శుభ్రమైన బాత్రూమ్‌లు, తరగతి గదుల్లో ఫ్యాన్లు, లైట్లు, ఫర్నీచర్, బ్లాక్‌ బోర్డ్స్, స్కూల్‌ అంతా మంచి పెయింటింగ్‌ వంటివి నాడు–నేడు ద్వారా చేపట్టాం. 

గ్రామస్థాయిలో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకుని... దాన్ని గ్రామీణ అర్థిక వ్యవస్థకు జోడించడంలో ఈ పిల్లలే ప్రధాన పాత్ర పోషిస్తారు. అందుకనే నాణ్యమైన విద్యను అందించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాం. టెక్నాలజీని ఉపయోగించుకుని వేరెక్కడికో వెళ్లాల్సిన అవసరం లేకుండా.. గ్రామస్ధాయిలోనే మంచి ఆదాయాన్ని పొందే అవకాశముంటుంది.  


ఫ్లోరోసిస్‌ లాంటి నీటి సమస్యతో చాలా గ్రామాలు ఇబ్బంది పడుతున్నాయి. కొన్నిచోట్ల నీటికొరత అధికంగా ఉండడం వల్ల నీటి రవాణాకు అధికంగా ఖర్చు చేయాల్సిన పరిస్ధితి. వీరికి రక్షిత తాగునీటి అందించే ప్రయత్నాలు ముమ్మరం చేశాం. ఇలా ఎంపిక చేసిన చోట్ల బ్యాంకులు మరింత ముందుకొచ్చి సాయం చేయాల్సి ఉంది. 


మరోవైపు ఫిషింగ్‌ హార్భర్లు కూడా అభివృద్ధి చేయాల్సి ఉంది. మన రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్భర్లు అభివృద్ది చేస్తున్నాం. మన మత్స్యకారులు జీవనోపాధి కోసం గుజరాత్‌ లాంటి రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితులు. ఇలా ఎందుకు వెళ్లాల్సి వస్తుందంటే... మన దగ్గర వీరి కోసం తగిన మౌళిక సదుపాయాలు లేకపోవడమే కారణం. 

ఇలాంటి పరిస్థితులు లేకుండా రాష్ట్రంలో 9 ఫిషింగ్‌ హార్బర్లు, పోర్టులు, ఫిష్‌ల్యాండింగ్‌ సెంటర్లను నెలకొల్పే పనులు ప్రారంభం అయ్యాయి.


 రాయలసీమ ప్రాంతంలో కరువు నివారణ పై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాయలసీమ, ఉత్తరాంధ్రా ఈ రెండు ప్రాంతాలు కరువు ప్రభావిత ప్రాంతాలు. ఇక్కడ ఎంపిక చేసిన ఈప్రాజెక్టులను సకాలంలో పూర్తిచేయడానికి అన్నిరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నాం. తద్వారా గ్రామాల్లో సుస్ధిరాభివృద్ధి సాధ్యమవుతుంది. ఎంఎస్‌ఎంఈ రంగంలో కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహిస్తున్నాం. ఈ రంగంలో ఒక పరిశ్రమ వస్తే... 10 మందికి గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి కలుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఉద్యోగాలు కల్పించడంలో ఇది చాలా ముఖ్యమైన రంగం. దీనిపై కూడా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది.


ఈసెమినార్‌లో పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఆర్ధికశాఖమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు, సీఎస్‌ డాక్టర్‌ సమీర్‌ శర్మ, పలువురు ఉన్నతాధికారులు, నాబార్డు ఛైర్మ‌న్‌ డాక్టర్‌ జీ ఆర్‌ చింతల, వివిధ బ్యాంకుల ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

Comments