*వాలంటీర్లకు వందనం.*
*పల్నాడు జిల్లా నరసరావుపేటలో వాలంటీర్లకు పురస్కారాల ప్రదాన కార్యక్రమంలో పాల్గొన్న సీఎం శ్రీ వైయస్.జగన్.*
*వరుసగా రెండో ఏడాది గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవారత్న, సేవా వజ్ర అవార్డులను ప్రదానం చేసిన సీఎం శ్రీ వైయస్.జగన్.*
నరసరావుపేట (ప్రజా అమరావతి);
*ఈ సందర్భంగా సీఎం ఏమన్నారంటే... :*
*సేవాభావానికి సెల్యూట్*
26 జిల్లాలు కొత్తగా ఏర్పాటు కాగా... అందులో ఒకటి మన పల్నాడు జిల్లా. జిల్లా ప్రధానకేంద్రం నరసరావుపేటలో ఈరోజు మనమంతా కూడా సేవాభావానికి సెల్యూట్ చేస్తున్నాం. లంచాలకు, వివక్షకు తావులేని, కులాలకు, మతాలకు, పార్టీలకు అతీతంగా ఒక వ్యవస్ధను తీసుకుని రావాలి అని ఆలోచన చేసాం.
ఎవరికైనా అర్హత ఉంటే.. అది ఉన్నప్పుడు ఏ ఒక్కరైనా కూడా అడ్డుపడే పరిస్థితి రాకూడదని గొప్పగా ఒక స్వప్నాన్ని చూశాం. అందులో భాగంగా ఈ మూడు సంవత్సరాల కాలంలో ఒక గొప్ప వ్యవస్ధ దేశంమొత్తం మనవైపే చూసే విధంగా మన రాష్ట్రంలో నడుస్తుంది. ఇప్పుడున్న సమాజంలో ఎవరైనా తమకు వచ్చేది ఎంత అనేది లెక్కలు వేసుకునే పరిస్థితి. అయితే తమకు ఎంత వస్తుందనేది లెక్కలు వేసుకోకుండా... తాము ఇచ్చే సేవమాత్రం ఎంత అని మాత్రమే లెక్కలు వేసుకుని సమాజంలో పేదల కళ్లల్లో సంతోషాన్ని చూడడానికి, వారి కళ్లల్లో సంతృప్తిని చూడటానికి.. వారి కళ్లలో కనిపించే సంతోషమే తమకు ఆశీస్సులు అని భావించి.. గుండెల నిండా మానవతావాదాన్ని నింపుకుంటున్న నా చెల్లెమ్మలు,తమ్ముల్లందరికీ... రాష్ట్రంలో ఉన్న 2.60 లక్షల మంది మహా సైన్యానికి సెల్యూట్ చేస్తున్నాం.
*ఏపీలో గొప్ప వ్యవస్ధ...*
ఒక గొప్ప వ్యవస్ధ ఆంధ్రరాష్ట్రంలో నడుస్తుంది. 1.30 లక్షల మంది పనిచేస్తున్న గ్రామ, వార్డు సచివాలయాలు. ఊరులోనుంచి, వార్డులో నుంచి ప్రతి రెండువేల జనాభాకు ఒక సచివాలయం ఏర్పాటు చేశాం.. అందలో సుమారు పదిమంది పనిచేస్తున్నారు. అదే గ్రామంలో ప్రతి యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ ఉన్నారు. ఏ పథకమైనా లంచాలకు, వివక్షకు తావులేకుండా సోషల్ ఆడిట్లో పెట్టి, గ్రామసచివాలయంలో ఆ జాబితా ప్రదర్శించి, ప్రతీ అర్హుడుకి అందాలన్న తపన, తాపత్రయంతోనే పనిచేస్తున్న గొప్ప వ్యవస్ధ మన రాష్ట్రంలో ఉంది.
*సూర్యుడు ఉదయించకముందే..*
తూర్పున సూర్యుడు ఉదయించకముందే.. పొద్దున్నే తలుపుతట్టి.. గుడ్ మార్నింగ్ చెప్పి.. చిరునవ్వుతోనే ప్రతి అవ్వకు, తాతకు ఒక మంచి మనవరాలిగా, మనవడుగా, ప్రతి వికలాంగుడికు ఒక మంచి చెల్లెమ్మలా, అక్కలా, తమ్ముడిలా, అన్నలా, ప్రతి అక్కచెల్లెమ్మకు, ఒక చెల్లెమ్మలా, తమ్ముడిలా అక్షరాలా 61 లక్షల మందికి వాళ్ల ఇంటికివెళ్లి తలుపుతట్టి ప్రభుత్వం నెల,నెలా ఇస్తున్న పించన్ను వారికి అందిస్తున్న గొప్ప సేవకులు, గొప్ప సైనికులు మన వాలంటీర్లు.
ప్రభుత్వం అంటే... కార్యాలయాల చుట్టూ తిరగాలి. చెప్పులరిగేలా తిరిగితే తప్ప పనులు జరగవు అన్న పాత భ్రమలను కొట్టిపారేసి, వాటిని పక్కనపెట్టి, ప్రభుత్వం అంటే పనులు జరగవన్న పాత నమ్మకానికి పాతర వేసి పారదర్శకమైన పాలన, లంచాలకు తావులేని, వివక్షకు చోటులేని, కులాలకు, మతాలకు, రాజకీయాలకు, పార్టీలకు సైతం తావులేకుండా సహాయం అందుతున్న వ్యక్తి మన పార్టీకి ఓటు వేశాడా ? వేయలేదా ? అన్న ఆలోచన కూడా చేయకుండా వాలంటీర్లు, సచివాలయాల సేవలు ఎంతగా ఉపయోగపడుతున్నాయో రాష్ట్రంలోని ప్రతి ఇంట్లోనూ అర్ధమవుతుంది.
*పెన్షన్గా ఇచ్చిన సొమ్మే రూ.50,508 కోట్లు..*
మనందరి ప్రభుత్వం అధికారంలోకివచ్చినప్పటి నుంచి 2019 జూన్ నుంచి.. ఈ నెల వరకు అంటే మార్చి 2022 వరకు వాలంటీర్ చెల్లెమ్మలు, తమ్ముళ్లు కేవలం అవ్వాతాతలకు, వికలాంగులకు, వితంతువులకు కేవలం పెన్షన్గా మాత్రమే పంపిణీ చేసిన సొమ్ము రూ.50,508 కోట్లు.
ఊహలకందని పాలన ఇది. రూ.1 లక్షా 34 వేల కోట్ల రూపాయలు నేరుగా ఒక్క బటన్ నొక్కిన వెంటనే.. లంచాలకు చోటులేకుండా, వివక్ష, పక్షపాతానికి తావులేకుండా ప్రతి ఇంటిలోనికి పోతుంది. ప్రతి అక్కచెల్లెమ్మకు అందుతుంది. గతానికీ, ఇప్పటికీ పాలనలో ఉన్న మార్పు గురించి ఆలోచన చేయమని అడుగుతున్నాను. ఇది కాదా అభివృద్ధి అంటే అని అందరినీ అడుగుతున్నాను.
*33 పథకాలు లంచాలకు తావులేకుండా.....*
వైయస్సార్ పెన్షన్ కానుక మొదలు, బియ్యం కార్డులు, వైయస్సార్ఆరోగ్యశ్రీ కార్డులు, అమ్మఒడి, ఆరోగ్యఆసరా, ఇళ్ల స్ధలాల పట్టాలు, జగనన్న తోడు, వైయస్సార్ రైతు భరోసా, వైయస్సార్ చేయూత, వైయస్సార్ఉచిత పంటలబీమా, వైయస్సార్ కంటివెలుగు, రైతులకు ఇన్పుట్ సబ్సిడీ, వైయస్సార్ మత్స్యకార భరోసా, జలకళ, జగనన్న చేదోడు, జగనన్న తోడు, వైయస్సార్ వాహనమిత్ర, వైయస్సార్ నేతన్ననేస్తం, వైయస్సార్ఈబీసీ నేస్తం..ఇలా 33 పథకాలను ప్రతి ఇంటికీ లంచాలకు, వివక్షకు తావులేకుండా, రాజకీయాలకు చోటు లేకుండా ప్రతి అర్హుడకూ అందుతున్నాయంటే.. ఇంత కన్నా గొప్ప పాలన, గొప్ప పరిస్థితులు గతంలో మనం ఎప్పుడైనా చూశామా ? అని ఒక్కసారి మీ గుండెల మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని కోరుతున్నాను.
దిశ వంటి చట్టాల వలన, దిశ యాప్ డౌన్లోడ్ వలన అక్కచెల్లెమ్మలు ఒక ఫోన్ పట్టుకుని దైర్యంగా బయటకు పోగలగుతున్నారు. దిశ యాప్ డౌన్లోడ్ చేసుకుంటే చాలు... ఆపదలో ఉన్న ఏ చెల్లెమ్మ అయినా ఒక ఎస్ఓఎస్ బటన్ నొక్కినా, ఫోన్ను 5 సార్లు షేక్ చేసినా చాలు.. 10 నుంచి 20 నిమిషాలలోనే పోలీసు సోదరుడు, చెల్లెమ్మ వచ్చి ఏమి కష్టం చెల్లెమ్మా అని అడిగే గొప్ప వ్యవస్ధ పనిచేస్తుంది. ఇంతమంది ఫోన్లలో దిశ యాప్ డౌన్లోడ్ అయిందంటే ఇందులో వాలంటీర్లు పాత్ర ఎంత ఎక్కువ ఉందో ఆలోచన చేయమని కోరుతున్నాను. ప్రభుత్వ కార్యక్రమాల మీద, ప్రభుత్వ పథకాల మీద ప్రజలందరికీ కూడా పూర్తిగా అవగాహన కల్పిస్తూ.. మన ప్రభుత్వం ప్రకటించిన సంక్షేమ క్యాలెండర్ ప్రకారం ఎవరికి, ఎప్పుడు ఎంత లబ్ధి చేకూరుతుందో ప్రతి ఇంటికి వెళ్లి తలుపు తట్టి, ఆ అక్కచెల్లెమ్మలకు తెలియజేస్తున్న గొప్ప కార్యక్రమం రాష్ట్రంలో జరుగుతుంది. వివిధ పథకాల లబ్ధిదార్లను దగ్గరుండి వారిచేత దరఖాస్తు కూడా చేయించే పరిస్థితి మన రాష్ట్రంలో చూస్తున్నాం. గొప్ప విప్లవాత్మక మార్పుతో మనం చేస్తున్న సేవలను మొత్తం భారతదేశం అభినందిస్తుంది. మీ సేవలకు ఆంధ్రరాష్ట్రం గర్వపడుతుంది, సెల్యూట్ చేస్తుందని ప్రతి వాలంటీర్ చెల్లెమ్మకు, తమ్ముడికి తెలియజేస్తున్నాను.
*ఎండ, వాన, చలైనా, సెలవైనా వెన్ను చూపని మహా సైన్యం...*
ఎక్కడా అవినీతికి చోటు లేకుండా, ఒక గొప్ప వ్యవస్ధ ఉండాలని, రావాలని కలలు కన్నాం. ఈ రోజు మీ ద్వారా ఈ కల నిజమవుతుంది. అవినీతికి తావులేకుండా... కులం, మతం, వర్గం, ప్రాంతం చివరికి రాజకీయాలు, పార్టీలు ఇవేవీ సైతం చూడకుండా.. ప్రభుత్వ సేవలన్నీ ప్రజల గడపవద్దనే అందిస్తూ.. ఎండైనా, వానొచ్చినా, వరదైనా, చలైనా, సెలవైనా, పండగైనా చివరికి కరోనా కష్టంలో సైతం వెనుదిరగకుండా, వెన్నుచూపకుండా ప్రజాసేవే పరమావధిగా సేవలందిస్తున్న ఈ మహా సైన్యాన్ని చూసి రాష్ట్రమంతా గర్వపడుతుంది.
*ప్రభుత్వ చిరు సత్కారం...*
మనందరి ప్రభుత్వం అందిస్తున్న చిరు సత్కారం ఈ రోజు నుంచి మొదలవుతుంది. ఇరవై రోజులపాటు జరుగుతుంది. ప్రతి మండలంలోనూ మూడు రోజుల చొప్పున ఇరవై రోజులపాటు జరుగుతుంది. వాలంటీర్లు అంటే దానర్ధం స్వచ్ఛంద సేవకులు అని... వీళ్లు చేస్తున్నది ఉద్యోగం కాదు గొప్ప సేవ అని తెలియజేస్తున్నాను. కాబట్టే మిగతా అన్ని రంగాలకంటే భిన్నంగా ఈ స్వచ్ఛంద సేవకులను, వీళ్లు చేస్తున్న సేవలను ప్రతియేడూ ప్రోత్సహించేందుకు, వీళ్లు చేస్తున్న సేవలను నిండు మనస్సుతో గౌరవించేందుకు ఈ రోజు నుంచి వరుసగా ఇరవై రోజుల పాటు సన్మాన కార్యక్రమాలను రాష్ట్ర వ్యాప్తంగా చేపడుతున్నాం.
వరుసగా రెండో ఏడాది మన వాలంటీర్లకు వందనం చేస్తున్నాం.
ఇందులో ఉత్తమ వార్డు, గ్రామ సచివాలయ వాలంటీర్లకు సేవామిత్ర, సేవా రత్న, సేవా వజ్ర అవార్డులు ప్రదానం చేస్తున్నాం. ప్రతి మండలానికి మూడు రోజుల చొప్పున.. ఇరవై రోజుల పాటు ఈ పురస్కారాల ప్రదాన కార్యక్రమాలను ఇవాళ ∙ఇక్కడ నుంచి ప్రారంభిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యేలు, అధికారులు అందరూ స్వయంగా పాలుపంచుకుంటారు. ప్రతివాలంటీర్కి మీరు చేస్తున్న సేవకు గౌరవం ఇచ్చి.. మీకు శాలువాలు కప్పి, మీకు నగదు బహుమానం చేసి, బ్యాడ్జి పెట్టి, సర్టిఫికేట్ ఇచ్చి మిమ్నల్ని అందరినీ గౌరవించే కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం.
*సేవా మిత్ర..*
ఇందులో భాగంగా సేవామిత్ర అనే పురస్కారం మొదటి లెవల్ వాలంటీర్లకు ఇచ్చే పురస్కారం. ఈ సంవత్సరం 2.28 లక్షల మంది వాలంటీర్లకు సేవామిత్ర అవార్డులు ఇస్తున్నాం. ఈ అవార్డు కింద రూ.10వేలు నగదు, ఒక బ్యాడ్జీ తో పాటు శాలువా కప్పి సన్మానం చేస్తారు. చేసిన సేవకు ప్రభుత్వం తరపున మంచి సర్టిఫికేట్ ఇస్తారు.
*సేవారత్న..*
రెండో దశలో సేవారత్న పురస్కారాలు అందిస్తాం. మండలానికి ఐదుగురు చొప్పున, మున్సిపాల్టీలకు, నగర పాలక సంస్ధలకు పదిమంది చొప్పున ఎంపిక చేయబడ్డ.. 4,136 మంది వాలంటీర్లకు సేవారత్న అవార్డును అందజేయనున్నాం. దీని కింద ప్రతి వాలంటీర్కు రూ.20 వేలు నగదు, శాలువా, మెడల్, బ్యాడ్డితో పాటు అభినందన పత్రం కూడా ఇస్తాం.
*సేవావజ్ర*
మూడో దశలో సేవా వజ్ర అవార్డును అందిస్తాం. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి మంచి సేవలందిస్తున్న 5గురిని ఎంపిక చేసాం. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 875 మంది వాలంటీర్లకు సేవావజ్ర అవార్డులను అందిస్తాం. ఈ అవార్డు కింద రూ.30 వేలు నగదు, మెడల్, బ్యాడ్జి ఇవ్వడంతో పాటు శాలువాతో సత్కరించి, సర్టిఫికేట్ కూడా ఇస్తాం.
*2.33 లక్షల మందికి రూ.239 కోట్లు బహుమతి.*
రాష్ట్రవ్యాప్తంగా మొత్తంగా 2.33 లక్షల మందికి రూ.239 కోట్ల నగదును బహుమానంగా ఇవ్వబోతున్నాం. గత సంవత్సరం వాలంటీర్లకు అందించిన సొమ్ము రూ.226 కోట్లు అయితే ఈ యేడాది ఇవ్వనున్న సొమ్ము రూ.239 కోట్లు. ఈ రెండేళ్లలో మొత్తంగా రూ.465 కోట్ల నగదు పురస్కారాలు అందించిన ప్రభుత్వం మనది.. మీ అన్నది.
2.60 లక్షల మంది ఉన్న గొప్ప వాలంటీర్ల వ్యవస్ధలో 55 శాతం నా చెల్లెమ్మలే అని తెలియజేస్తున్నాను. సేవలకు ఈ స్ధాయిలో గుర్తింపు ఇస్తున్న మనసున్న, ఏకైక ప్రభుత్వం మనదే అని తెలియజేస్తున్నాను.
*ఈ ప్రసంగం ముగించే ముందు.. ఒక్క విషయం మీ అందరితో పంచుకుంటున్నాను.*
ఈ రాష్ట్రంలో రైతులకు, అక్కచెల్లెమ్మలకు, బడి పిల్లలకు, కాలేజీ పిల్లలకు, నా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, ఓసీ వర్గాల్లో పేదలు.. ఇలా ప్రతి ఒక్కరికీ కూడా దేవుడు దయతో చరిత్రలో ఏ ప్రభుత్వం కూడా చేయనంతగా మంచి చేసే అవకాశం దేవుడు ఇచ్చాడని సగర్వంగా తెలియజేస్తున్నాను.
అందరికీ గొప్ప వ్యవస్ధ తీసుకురావడానికి దేవుడు అవకాశం ఇచ్చాడు. లంచాలు లేని పాలనను తీసుకునిరాగలిగాం. వివక్ష లేని అడుగులు ముందుకు వేయగలిగాం. నేరుగా బటన్ నొక్కిన వెంటనే డీబీటీ ద్వారా ప్రతి అక్క, చెల్లెమ్మ అకౌంట్లలోకి రూ.1,34,386 కోట్లు ఇవ్వగలిగాం. ఈ సంవత్సరం మరో రూ.55వేల కోట్లు ఏకంగా ఒక క్యాలెండర్ఇచ్చి దాని ప్రకారం ప్రతి నెలా ఏ కార్యక్రమం జరగబోతుందో.. ఏ పధకం అమలు కాబోతుందో.. ఏ పథకం ద్వారా అక్కచెల్లెమ్మలకు, అన్నదమ్ములకు మేలు జరుగుతుందో వారందరికీ తెలియజేస్తూ ఈ యేడాది మరో రూ.55 వేల కోట్లు నేరుగా డీబీటీ ద్వారా బటన్ నొక్కి వారి అకౌంట్లలోకి పంపించడం జరుగుతుంది.
*మరో రెండేళ్లు ఇదే విధంగా..*
మరో రెండేళ్లు కూడా ఇదే పద్ధతిలోనే దేవుడి దయతో మీ అందరి చల్లని దీవెనలతో చేయగలిగే బలాన్నివ్వాలని మనసారా కోరుకుంటున్నాను. మనందరి ప్రభుత్వం, మనమిచ్చిన వాగ్దానాలు, ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పామో.. 3648 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర తర్వాత కేవలం రెండే రెండు పేజీలతో గొప్ప మేనిఫెస్టో విడుదల చేశాం. ఎన్నికల అయిపోయిన తర్వాత మిగిలిన పార్టీలు, గత ప్రభుత్వం చెత్తబుట్టలో వేసిన చరిత్ర ఉంటే.. మన ప్రభుత్వంలో మాత్రం ఆ మేనిఫెస్టోను బైబిల్గానూ, ఖురాన్గానూ, భగవద్గీతగానూ భావించి 95 శాతం అందులో ఇచ్చిన హమీలను అమలు చేశాం.
*పళ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలు....*
ఏగ్రామాన్ని తీసుకున్నా.. ఏ సామాజిక వర్గాన్ని తీసుకున్నా.. గతంలో చూసిన ఎల్లో పార్టీ కన్నా కనీవినీ ఎరుగని విధంగా మేలు చేయగలిగాం. మన నవరత్నాల పాలన ఇలాగే కొనసాగితే తమకు డిపాజిట్లు దక్కవన్న బాధ, ఆ ఏడుపు ఈరోజు ఎల్లో పార్టీలోనూ, వాటికి అనుబంధంగా ఉన్న పార్టీలలోనూ కనిపిస్తుంది. వీరిద్దరికీ అనుబంధంగా ఉన్న ఎల్లో మీడియాలోనూ కనిపిస్తుంది.
మంచి చేసేవాడిమీదనే రాళ్లు పడతాయన్నట్టుగా.. పళ్లు కాసే చెట్టుమీదనే రాళ్లు వేస్తారన్నట్టుగా... ఈ రోజు వీళ్లంతా కలిసికట్టుగా, దుర్మార్గంగా కుయక్తులు పన్నుతూ బురద జల్లుతున్నారు.
*వీళ్లు బాక్సులు బద్దలవుతాయనే....*
సంక్షేమపథకాలు ఇలాగే ఇచ్చుకుంటూ వెళితే.. పేదలకు జగన్ అనే వ్యక్తి ఇలాగే మంచి చేసుకుంటూ వెళితే.. ప్రతి అక్కా, చెల్లెమ్మలకు అమ్మఒడి అందితే, అసరా అందితే, ప్రతి అక్కచెల్లెమ్మకు చేయూత దక్కితే, ప్రతి అన్నాతమ్ముడికి రైతుభరోసా అందితే, ఆరోగ్యం సరిగా లేకపోయిన ప్రతి పేదవాడికి ఆరోగ్యశ్రీ అందితే.. ఇంటికి పంపించేటప్పుడు ఆరోగ్య ఆసరా కింద రూ.5వేలో, రూ.10 వేలో చేతిలో పెట్టి పంపితే.. పెన్షన్ కానుక కింద నెలలో ఒకటో తారీఖునే నా వాలంటీర్ తమ్ముళ్లు, చెల్లెమ్మలు అది సెలవైనా, పండగైనా కూడా పొద్దునే వచ్చి చిరునవ్వుతో గుడ్ మార్నింగ్ చెప్పి.. చేతిలో పెన్షన్ సొమ్ము పెడితే.. వీళ్ల బాక్సులు బద్దలవుతాయని వీళ్లందరికీ తెలుసు.
*హామీలు నిలబెట్టుకోలేని దొంగల ముఠా..*
కాబట్టే మన రాష్ట్రం గురించి ఈ గొప్ప గొప్ప నాయకులు, గొప్ప గొప్ప ఎల్లోమీడియా.. గొప్ప గొప్ప అనుబంధ పార్టీలు వీళ్లంతా మన రాష్ట్రం శ్రీలంక అవుతుందని అంటున్నారు. ఆశ్చర్యమనిపించింది. చంద్రబాబునాయుడు, ఆయన దత్తపుత్తుడు, ఆయన ఎల్లో మీడియా ఈ రోజు ఈ కొత్త ప్రచారాన్ని అందుకున్నారు. ఇచ్చిన ఏ ఒక్క హామీని కూడా నిలబెట్టుకోని ఈ దుర్మార్గుల ముఠా.. గతంలో రాష్ట్ర ఖజానాను దోచుకున్న ఈ దొంగల ముఠా.. ఎన్నికలప్పుడు పచ్చి అబద్దాలు చెప్పిన ఈదొంగల ముఠా.. ఎన్నికలు అయిపోయిన తర్వాత ప్రజలను మోసం చేసి వీళ్ల మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసి.. పత్తా లేకుండా హైదరాబాద్లో నివాసం ఉంటున్నది ఈ దొంగల ముఠా. జగన్మోహన్రెడ్డి పాలన ఈ మాదిరిగా సాగితే భవిష్యత్తులో తమకు ఏ ఒక్కరు కూడా ఓటు వేయరేమోనని భయపడుతున్న ఈ దొంగల ముఠా ఈ రోజు రాష్ట్రం శ్రీలంక అవుతుందని చెపుతున్నారు.
*పేదలకు సంక్షేమం చేస్తే శ్రీలంక అవుతుందట...*
పేదలకు సంక్షేమ, అభివృద్ధి పథకాలను మనం అమలుచేస్తే.. రాష్ట్రం శ్రీలంక అవుతుందట.. ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని తమకు మాదిరిగా అమలు చేయకపోతే అమెరికా అవుతుందట.
మన ప్రభుత్వం చేస్తున్న విధంగా మంచి చేస్తే శ్రీలంక అవుతుందట..వాళ్ల మాదిరిగా ప్రజలను వెన్నుపోటు పొడిస్తే అమెరికా అవుతుందట.. ఇలా మాట్లాడుతున్నవారికి మనసు కానీ, నీతి కానీ, న్యాయం, ధర్మం ఇలాంటి పదాలకు ఏ కోశాన్నైనా అర్ధమైనా తెలుసా అని అడుగుతున్నాను.
ఒక్కసారి ఆలోచన చేయమని మిమ్నల్ని అందరినీ అడుగుతున్నాను. ఇదే ఆంధ్రరాష్ట్రం.. ఇదే రాష్ట్ర బడ్జెట్.. అయినా కూడా వారు గతంలో డీబీటీ ద్వారా బటన్ నొక్కితే లంచాలు లేకుండా, వివక్ష, పక్షపాతానికి తావులేకుండా నేరుగా అక్కచెల్లెమ్మల అకౌంట్లలోకి పోయే విధంగా, పారదర్శకంగా ప్రతి అక్కచెల్లెమ్మకు, అన్నదమ్ముడికి అందేలా ఏ రోజు కూడా మంచి చేయలేదు. కానీ ఇదే రాష్ట్రం, ఇదే బడ్జెట్, ఇదే పరిస్థితులు ఉన్న.. ఆ ప్రభుత్వానికి, మన ప్రభుత్వానికి తేడా చూడమని అడుగుతున్నాను.
*మనుషుల రూపంలో దెయ్యాలు వీళ్లు....*
గతంలో దోచుకున్నది వీళ్లే. వీరి దోపిడీకి రాష్ట్రాన్ని అప్పులు పాలు చేసింది కూడా వీళ్లే. వీళ్లు మంచి చేయకపోగా.. మంచి చేస్తున్న మనందరి ప్రభుత్వం మీద అబద్దాలతో నిందలు వేసేది కూడా వీళ్లే.
ఇదే బాబు, ఇదే ఈనాడు, ఇదే ఆంధ్రజ్యోతి, ఇదే టీవీ5, ఇదే దత్తపుత్రుడు. మన రైతును, మన పేదలను, మన అక్కచెల్లెమ్మలను, మన పిల్లలను ద్వేషించే ఇలాంటి వారిని మనుషులు అని అనాలా ? లేకపోతే మనుషుల రూపంలో ఉన్న దెయ్యాలు అనాలా ? అని మీరే ఆలోచన చేయమని కోరుతున్నాను.
వీరికి మద్ధతు ఇచ్చి మంచిని చిన్నాభిన్నాం చేసే ఈ ఎల్లోమీడియాను మీడియా అనాలా ? లేక రక్తపిశాచులు అనాలా ? మీరే ఆలోచన చేయండి.
*మంచి చేయడానికి ఢిల్లీ వెళితే....*
రాష్ట్రానికి ఫలానావి కావాలని చెప్పి అడగడానికి నేను ఢిల్లీకి వెళ్లాను. ఢిల్లీకి వెళ్లి ఒక ముఖ్యమంత్రి ఒక ప్రధానమంత్రితో సమావేశం అయ్యాడు. దాదాపుగా గంటకు పైగా ఆ సమావేశం మంచి వాతావరణంలో జరిగింది. దాన్ని ఈ ఎల్లో మీడియా,ఈ బాబుగారు, దానికి మద్ధతు పలుకుతున్న దత్తపుత్రుడు జీర్ణించుకోలేకపోతున్నారు. మోడీగారు జగన్కి క్లాసు తీసుకున్నారని ఎల్లో మీడియా అంటుంది. నేను అడుగుతున్నాను.. ఎల్లో మీడియాలో అగ్రస్ధానంలో ఉన్న ఈనాడు, రాధాకృష్ణ, టీవీ5, చంద్రబాబు, ఆయన దత్తపుత్రుడు వీళ్లెవరైనా నేను,మోడీ గారు ఇద్దరమే ఉండగా.. మోడీ గారు సోఫా కిందనో... లేకపోతే నా సోఫా కిందనో అక్కడ ఉన్నారా ? అని అడుగుతున్నాను.
ఇదేరకమైన మాటలు, వీళ్లు చేస్తున్న దుష్ప్రచారాలు చూస్తుంటే.. ఒకటే ఒకటి వీళ్లందరికి చెప్పగలుగుతున్నాను.
*అసూయకు మందులేదు....*
అసూయకుమందులేదు. ఇంత అసూయ పడితే మాత్రం త్వరగా మీకు బీపీలు వస్తాయి. త్వరగా గుండెపోటులు వస్తాయి. త్వరగా టికెట్ తీసుకుంటారు. ఇంత అసూయ మంచిది కాదని తెలియజేస్తున్నాను. నేను ఎప్పుడూ చెపుతుంటా.. ఈ రోజు చేస్తున్న యుద్ధం స్ట్రెయిట్గా లేదు. యుద్దం చేస్తున్నది నీతిగా ఉన్న రాజకీయనాయకుడితోనే, వ్యవస్ధతోనే కాదు. మారీచులతో యుద్ధం చేస్తున్నాం. రాక్షసులతో యుద్ధం చేస్తున్నాం.
*మోసం చేసే మారీచులు వీళ్లు..*
మోసం చేయడానికి మారీచుడు అనే రాక్షకుడు ఏరూపం కావాలంటే ఆ రూపంలోకి మారిపోతాడు. వీరు కూడా అంతే..ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు ఏ పార్టీతో కావాలనుకుంటే ఆ పార్టీతో జత కడతారు. ఎప్పుడు వద్దనుకుంటే అప్పుడు తిడతారు.. బురద వేస్తారు. విడిపోతారు. ఎలాగూ అమలు చేయరు కాబట్టి.. ఏ వాగ్ధానం కావాలంటే ఆ వాగ్దానం ఇచ్చేస్తారు. ఎన్నికలు అయిపోయన తర్వాత ఆ మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేస్తారు. ఆ తర్వాత మనుషులు కూడా రాష్ట్రానికి పండక్కి చుట్టం వచ్చినట్టు అప్పుడప్పుడు కనిపిస్తారు.
విడివిడిగా పోటీ చేసి ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలితే మంచిది అనుకుంటే చీలుస్తారు...విడివిడిగా పోటీ చేస్తే ప్రభుత్వ వ్యతిరేఖ ఓటు చీలితే వాళ్లకు మంచి జరుగుతుంది అంటే చీల్చుతారు. తమకు గిట్టని ప్రభుత్వం ఏదైనా ఉంటే..వ్యతిరేకంగా ఓటు చీల్చకూడదు అని వీళ్లు అనుకుంటే .. వీళ్లంతా ఏకమైపోతారు. వీళ్లంతా ఏకం కావడమే కాకుండా దుష్ప్రచారం చేయడంలో వీళ్లకు ఎవరూ సాటిలేరు. ఒకే అబద్ధాన్ని వందసార్లు చెప్పిందే, చెప్పి అదే నిజమని చెప్పి నమ్మించే గొప్ప మారీచులతో యుద్ధం చేస్తున్నామన్న విషయాన్ని అందరూ గుర్తుపెట్టుకోవాలని ఈ రోజు సవినయంగా తెలియజేస్తున్నాను.
*బాబును, దత్తపుత్రుడను, ఎల్లో మీడియాను నమ్మొద్దు*
నీతి,ధర్మంతో పాటు ప్రజలంటే ప్రేమ కూడా లేదు
పేరుకు వీళ్లంతా వేరు,వేరు వ్యక్తులు, వేరు వేరు పార్టీలు అయినా.. ఎల్లో మీడియా ముసుగులో ఉన్న వేరువేరు మీడియా సంస్దలు అయినా.. వీళ్లందరూ కూడా ఒక గజదొంగల ముఠా. వీరికి నీతి లేదు. నియమం లేదు. వీరికి న్యాయం, ధర్మం కూడా లేదు. ప్రజలంటే వీరికి ప్రేమ అంతకన్నా లేనేలేదు. అధికారం తప్ప వేరే అజెండా లేనేలేదు. ఇలాంటి రాక్షసులతో యుద్ధం చేస్తూ.. ఎన్ని సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేస్తున్నామన్నది గమనించమని సవినయంగా వేడుకుంటున్నాను. వీరు చెప్పే మాటలు విననే వినవద్దు అని చెప్పి మిమ్నిల్ని అందరినీ అభ్యర్ధిస్తున్నాను. వీరు చేసే దుర్మార్గపు ప్రచారాలు నమ్మనే నమ్మవద్దు అని మిమ్నల్ని అందరినీ వేడుకుంటున్నాను. ఈ రాష్ట్రంలో ప్రతి అక్కా, చెల్లెమ్మను, ప్రతి అన్నను, తమ్ముడునూ
ఒక్కటే ఒక్కటి మీ గుండెలు మీద చేతులు వేసుకుని ఆలోచన చేయమని కోరుతున్నాను. జగన్ వచ్చిన తర్వాత మీకు మంచి జరిగిందా ? లేదా? అన్నది ఒక్కటే ఆలోచన చేయమని కోరుతున్నాను. మంచి జరిగింది అంటే జగన్ను ఆశీర్వదించండి. చెడు జరిగింది అంటే జగన్ను ద్వేషించండి. కానీ ఈ ఎల్లో మీడియాను, బాబును, దత్తపుత్రుడును మాత్రం నమ్మనే నమ్మొద్దు.
దేవుడు ఆశీర్వదించాలని, ప్రజలందిరికీ కూడా ఇంకా మంచి చేసే పరిస్థితులు ఇవ్వాలని, ప్రజలు చల్లని దీవెనలు మనందరికీ ఉండాలని.. అంటే దానర్ధం నా వాలంటీర్ చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు, సచివాలయంలో పనిచేస్తున్న నా చెల్లెమ్మల్లకు, తమ్ముళ్లకు, గడప, గడప వద్దకు పాలన తీసుకుపోవాలని ఆరాటపడే నా అన్నదమ్ములు, అక్కచెల్లెమ్మలకు, లంచాలు లేకుండా,వివక్ష లేకుండా ఒక గొప్ప గ్రామ స్వరాజ్యాన్ని చూడాలని ఆరాటపడే నా చెల్లెమ్మలకు, తమ్ముళ్లకు.. మనందరికి కూడా దేవుడి దయ ఉండాలని.. మేలు చేసే అవకాశం దేవుడు ఇంకా ఇవ్వాలని.. మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
ప్రతి చెల్లెమ్మకూ, తమ్ముడుకూ మరొక్కసారి ఆల్ ది వెరీ బెస్ట్ విషెష్ తెలియజేస్తున్నాను. రాబోయే రోజుల్లో మీరు ఇంకా గొప్పగా పనిచేసి, ప్రజలందరి మన్ననలు పొందాలని మనసారా ఆరాటపడుతున్నాను.
చివరిగా ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ.. నరసరావుపేటలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఫ్లై ఓవర్ అడిగారు. దాన్ని మంజూరు చేస్తున్నాను. వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీ, ఆటోనగర్ కావాలని అడిగారు. అని కూడా మంజరు చేస్తున్నాను అని సీఎం శ్రీ వైయస్.జగన్ తన ప్రసంగం ముగించారు.
ఈ కార్యక్రమంలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, బొత్స సత్యనారాయణ, చెరుకువాడ శ్రీరంగనాధరాజుతో పాటు పలువురు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజా ప్రతినిధులు, పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment