వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాలు



వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర కార్యాలయంలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, పార్టీ అనుబంధ విభాగాల ఇంఛార్జ్‌ శ్రీ వి.విజయసాయిరెడ్డి ప్రెస్‌మీట్‌:

మంత్రులు శ్రీ కె.కన్నబాబు, శ్రీ వెల్లంపల్లి శ్రీనివాస్, పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లుతో పాటు, పలువురు ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు హాజరు:


వైయస్సార్‌సీపీ ఆధ్వర్యంలో ఉద్యోగ నియామకాలు


తిరుపతి, విశాఖపట్నం, గుంటూరులో జాబ్‌మేళాలు

ప్రతి చోటా కనీసం 5 వేల చొప్పున ఉద్యోగాల కల్పన

వైయస్సార్‌సీపీ కార్యకర్తలు, అభిమానులకే ఈ అవకాశం

10వ తరగతి నుంచి పీహెచ్‌డీ అభ్యర్థుల వరకు అర్హులు

ఇది పూర్తిగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ కార్యక్రమం

పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ విజయసాయిరెడ్డి ప్రకటన


తొలుత తిరుపతి శ్రీ వెంకటేశ్వర విద్యాలయంలో మేళా

ఆ తర్వాత విశాఖ ఆంధ్రా యూనివర్సిటీలో

అనంతరం నాగార్జున యూనివర్సిటీలో కార్యక్రమం

జాబ్‌మేళాల కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ ప్రారంభం

అభ్యర్థులంతా అందులో నమోదు చేసుకోవాలి

భవిష్యత్తులో కూడా ఉద్యోగాల కల్పన

ప్రెస్‌మీట్‌లో శ్రీ వి.విజయసాయిరెడ్డి వెల్లడి


తాడేపల్లి (ప్రజా అమరావతి):


ప్రెస్‌మీట్‌లో శ్రీ వి.విజయసాయిరెడ్డి ఇంకా ఏం చెప్పారంటే..:


పార్టీ కార్యక్రమం–జాబ్‌మేళా:

గౌరవ సీఎం శ్రీ వైయస్‌ జగన్‌ ఆదేశాల మేరకు పార్టీ కార్యక్రమాల్లో భాగంగా మూడు చోట్ల.. తొలుత ఈనెల 16, 17 తేదీల్లో తిరుపతి శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జాబ్‌ మేళా నిర్వహిస్తున్నాం. అక్కడ కనీసం 5 వేల ఉద్యోగాలు ప్రైవేటు రంగంలో కల్పించడం జరుగుతుంది. ఇది పూర్తిగా వైయస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి సంబంధించిన విషయం మాత్రమే. 2014, 2019 ఎన్నికల్లో పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానులకు ఈ అవకాశం కల్పిస్తున్నాం. ఈ జాబ్‌మేళాలన్నీ కూడా 

వారాంతంలోనే జరుగుతాయి.

అలాగే ఈనెల 23, 24 తేదీలలో విశాఖలోని ఆంధ్ర యూనివర్సిటీ ప్రాంగణంలో, ఈనెల 30, మే 1న గుంటూరులోని నాగార్జున యూనివర్సిటిలో జాబ్‌మేళా నిర్వహించబోతున్నాం. 


15 వేల నుంచి 20 వేల ఉద్యోగాలు:

మూడు చోట్ల కనీసం 5 వేల చొప్పున మొత్తం 15 వేల ఉద్యోగాలు కల్పిస్తాం. అయితే అవి 20 వేల ఉద్యోగాలు కూడా కావొచ్చు. తిరుపతి జాబ్‌మేళకు రాయలసీమకు చెందిన నాలుగు జిల్లాలతో పాటు, నెల్లూరు జిల్లాలకు చెందిన నిరుద్యోగులు హాజరు కావొచ్చు. ఉత్తరాంధ్ర మూడు జిల్లాలతో పాటు, తూర్పు గోదావరి జిల్లాకు చెందిన వారు విశాఖలో జాబ్‌మేళాకు హాజరు కావొచ్చు. అలాగే నాగార్జున యూనివర్సిటీలో జరిగే జాబ్‌మేళాకు పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాలకు చెందిన వారు హాజరు కావాలి.


అందరూ అర్హులే:

10వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అర్హులైన వారంతా ఆయా జాబ్‌మేళాలకు హాజరు కావొచ్చు. పార్టీ కోసం పని చేసిన కార్యకర్తలు, అభిమానులకు ఇది గొప్ప అవకాశం. వారి అర్హతను బట్టి ఉద్యోగ అవకాశం కల్పించడం జరుగుతుంది. కాబట్టి దరఖాస్తు చేసుకోవాలి.

దీని కోసం ప్రత్యేక వెబ్‌సైట్‌ లాంbŒ∙చేస్తున్నాం. 

‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూవైయస్సార్‌సీపీజాబ్‌మేళాడాట్‌కమ్‌’

ఈ వెబ్‌సైట్‌లో అభ్యర్థులు రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది.


అప్పుడే అనుకున్నాం:

ఈ మూడు ప్రాంతాల్లో అభ్యర్థులు తమ సర్టిఫికెట్లతో హాజరు కావొచ్చు. ముందుగా వెబ్‌సైట్‌లో రిజిస్టర్‌ చేసుకోవాలి. నిజానికి కరోనా సమయంలో విశాఖలో జాబ్‌ మేళా పెట్టాలనుకుని, వెబ్‌సైట్‌ ప్రారంభిస్తే మూడు రోజుల్లోనే దాదాపు 43 వేల మంది రిజిస్టర్‌ చేసుకున్నారు.

మనకు వచ్చే దరఖాస్తులను కంప్యూటర్లలో నిక్షిప్తం చేస్తాం. భవిష్యత్తులో కూడా వారికి అవకాశం కల్పిస్తాం.


అక్కడికక్కడే నియామక పత్రాలు:

జాబ్‌మేళాలో కంపెనీల ప్రతినిధులు, అధికారులు వచ్చి ఇంటర్వ్యూ చేస్తారు. అక్కడికక్కడే అపాయింట్‌మెంట్‌ లెటర్లు కూడా ఇస్తారు.

ఇంతకు ముందు చెప్పినట్లు 10వ తరగతి నుంచి పీహెచ్‌డీ వరకు అర్హులైన వారంతా జాబ్‌మేళాలకు హాజరు కావొచ్చు.


విశాఖ స్టీల్‌ ప్లాంట్‌పై టీడీపీ ద్వంద్వ వైఖరి:

విశాఖ ఉక్కు సంస్థను ప్రైవేటుపరం చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఈ పార్లమెంటు బడ్జెట్‌ సెషన్‌లో.. మొత్తం 120 మంది ఎంపీలతో సంతకాలు పెట్టించి, ప్రధానిగారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. దీనిపై ఎల్లో మీడియా అసత్యాలు ప్రచారం చేయకుండా, దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇప్పుడు మీకిస్తాం.

బీజేపీకి వ్యతిరేకంగా ఉన్న పార్టీలన్నీ కూడా దాన్ని సమర్థించాయి. విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణ చర్యలను వ్యతిరేకిస్తున్నాయి.

అయితే చంద్రబాబు, ఆయన కుమారుడు పదే పదే విమర్శిస్తున్నారు. విశాఖ స్టీల్‌ కంపెనీని కాపాడుకునేందుకు మేము ఏమీ చేయడం లేదని అంటున్నారు. పైగా రాజీనామా చేయాలని అంటున్నారు. కానీ ప్రధానికి ఇచ్చిన వినతిపత్రంపై సంతకం పెట్టమంటే ఆ పార్టీ ఎంపీలో ఒప్పుకోలేదు. అదీ వారి వైఖరి. అంటే వారు విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ప్రైవేటీకరణను సమర్థిస్తున్నారు. నిజం చెప్పాలంటే టీడీపీ ప్రభుత్వం తన హయాంలో దాదాపు 50 ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మేసింది.

ఇప్పుడు కూడా ఆ పార్టీ ఇక్కడ ఒక మాట. ఢిల్లీలో ఒక మాట. ఆ విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోంది.


రాష్ట్రంలో ఉద్యోగాల విప్లవం: వ్యవసాయ శాఖ మంత్రి శ్రీ కె.కన్నబాబు

రాష్ట్రంలో ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉద్యోగ, ఉపా«ధి కల్పనతో పాటు, ఉద్యోగ భద్రతకు ప్రాధాన్యం ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే గ్రామ, వార్డు సచివాలయాలు ఏర్పాటు చేసి, ద్వారా దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా 1.21,518 ఉద్యోగాలు ఇవ్వడం జరిగింది. ఒకే ఒక్క నోటిఫికేషన్‌లో ఆ నియామకాలు చేయడం జరిగింది. గత ప్రభుత్వాల హయాంలో ఈ స్థాయిలో ఒకేసారి అన్ని ఉద్యోగాలు ఇవ్వడం జరగలేదు.

అదే విధంగా ఒకేసారి సుమారు 2,59,565 మందిని గ్రామ వలంటీర్లుగా నియమించడం జరిగింది. గ్రామాల్లో ప్రతి ఇంటికి సేవలందించే విధంగా వారిని నియమించాం.

ఇక భర్తీ చేసిన మొత్తం రెగ్యులర్‌ పోస్టులు 1,84,264 కాగా, కాంట్రాక్ట్‌ ఉద్యోగులు 18,701 మంది, ఔట్‌ సోర్సింగ్‌లో 3,99,791 మందిని నియమించాం. వైద్య ఆరోగ్య శాఖలో చరిత్రలో లేని విధంగా అన్ని స్థాయిలో పెద్ద సంఖ్యలో భర్తీ చేయడం జరిగింది.

ఇంకా జాబ్‌ క్యాలెండర్‌ ద్వారా బ్యాక్‌లాగ్‌ పోస్టులు, గ్రూప్‌ల పోస్టులతో పాటు, మిగిలిన ఖాళీలు భర్తీ చేయడం జరుగుతోంది.

మధ్యవర్తులు, ఏజెన్సీల ప్రమేయం లేకుండా ఉండేందుకు ఔట్‌ సోర్సింగ్‌ కార్పొరేషన్‌ ఏర్పాటు చేశాం.

అధికారంలోకి రాగానే ఆశా వర్కర్లు, అంగన్‌వాడీలు, 108, 104 సర్వీసుల సిబ్బంది, హోంగార్డులు.. ఇలా వివిధ ఉద్యోగులకు జీతాలు పెంచడం జరిగింది. తద్వారా దాదాపు 7.02 లక్షల ఉద్యోగులు ప్రయోజనం పొందారని మంత్రి శ్రీ కె.కన్నబాబు వివరించారు.

ఆ తర్వాత పార్టీ సీనియర్‌ నేత, ఎమ్మెల్సీ శ్రీ ఉమారెడ్డి వెంకటేశ్వర్లు ప్రత్యేక వెబ్‌సైట్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూవైయస్సార్‌సీపీజాబ్‌మేళాడాట్‌కమ్‌’ ను ప్రారంభించారు.

Comments