రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం

 *రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల టమాటా విక్రయాలకు రంగం సిద్దం


*

*రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్థన రెడ్డి*

అమరావతి, మే 20 (ప్రజా అమరావతి):  ఈ నెల 21 శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల  టమాటా విక్రయాలకు రంగం సిద్దం చేసినట్లు రాష్ట్ర వ్యవసాయ మరియు సహకార, మార్కెటింగ్, ఫుడ్ ప్రాసెసింగ్ శాఖ మంత్రి  కాకాని గోవర్థన రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. బహిరంగ మార్కెట్ లో టమాటా ధరలను నియంత్రించేందుకు రాష్ట్ర వ్యాప్తంగా నున్న రైతుబజార్లలో శుక్రవారం ప్రభుత్వం నిర్వహించిన టమాటా విక్రయాలకు ప్రజల నుండి మంచి స్పందన వంచ్చిందని మంత్రి తెలిపారు. సరసమైన ధరలకు ప్రభుత్వం విక్రయించే టమాటాలను కొనుగోలు చేసుకోసుకునేందుకు ప్రజలు రైతు బజార్లలో పెద్ద ఎత్తున బార్లు తీరారన్నారు.  ముఖ్యంగా విజయవాడ, గుంటూరు, పల్నాడు,  ఏలూరు, విశాఖపట్నం రైతు బజారుల్లో టమాటాల విక్రయాలకు ప్రజల నుండి మరింత పెద్ద ఎత్తున స్పందన కనిపించిందని మంత్రి తెలిపారు. బహిరంగ మార్కెట్ లోని ధరల కంటే రైతు బజార్లలో  విక్రయించిన టమాటాలు తక్కువ ధరకే లభిస్తున్నాయని, కేజీ పై సుమారు రూ.15/- ల వరకూ తగ్గుతున్నట్లు ఆయన తెలిపారు.  శుక్రవారం  రైతుబజార్లలో నిర్వహించిన టమాటా విక్రయాలు కొన్ని గంటల్లోనే పూర్తి అయిపోయాయన్నారు. ఈ నేపథ్యంలో శనివారం నాడు రాష్ట్ర వ్యాప్తంగా నున్న అన్ని రైతు బజార్లలో 70 మెట్రిక్ టన్నుల  టమాటా విక్రయాలకు రంగం సిద్దం చేసినట్లు మంత్రి తెలిపారు. ప్రజలు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు. 


Comments