కాకినాడ. (ప్రజా అమరావతి);
ప్రభుత్వ సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలందరికీ తెలియజేయాలి.
సమాచార శాఖ ను వ్యవస్థాగతంగా, సాంకేతికంగా బలోపేతం చేస్తున్నాం. ... రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమీషనర్ టి. విజయకుమార్ రెడ్డి
ప్రభుత్వ అభివృద్ది, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలలో సమగ్ర అవగాహన కల్పించేందుకు సమాచార పౌర సంబంధ శాఖ అధికారులు, సిబ్బంది అంకిత భావంతో పనిచేయాలని రాష్ట్ర సమాచార పౌర సంబంధాల శాఖ కమిషనర్ టి. విజయకుమార్ రెడ్డి కోరారు.
జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అనంతరం నూతన జిల్లాల్లో సమాచార పౌర సంబంధ శాఖ కార్యాలయాల ఏర్పాటు, అధికారులు సిబ్బంది విధుల సమన్వయం అంశాలను పరిశీలించేందుకు ఆయన బుధవారం ఏలూరు, పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో పర్యటించి, గురువారం కాకినాడ విచ్చేశారు. ఇందులో భాగంగా ఆయన కాకినాడ లోని జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయాన్ని సందర్శించి, అనంతరం స్థానిక ఆర్ అండ్ బి అతిధి గృహం జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి కార్యాలయ సిబ్బందితో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన తమ శాఖ అధికారులు, సిబ్బందికి దిశానిర్థేశం అందిస్తూ ప్రభుత్వ ఆశయాలు, లక్ష్యాలను ప్రజలకు, ప్రజల ఆకాంక్షలను ప్రభుత్వానికి తెలియజేసే వారధిలా సమాచార పౌర సంబంధాల శాఖ పనిచేయాలన్నారు. ప్రభుత్వ పధకాల గురించి సమగ్ర అవగాహన కల్పించండం ద్వారా లక్ష్యిత వర్గాల ప్రజలు వాటి పరిపూర్ణ లబ్దిని అందుకోగలరని, అలాగే ఆయా పధకాలు, కార్యక్రమాలపై ప్రజల స్పందనలను, అభిప్రాయాలను ప్రభుత్వం తెలియజేయడం ద్వారా వాటిని మరింత ప్రయోజన కరంగా తీర్చి దిద్దేందుకు దోహదం కాలదని తెలిపారు. ఏ పధకం ఏమి అందిస్తుంది, వాటిని ఎలా పొందాలనే సమాచారం ప్రజలందరికీ తెలియజేయాల్సిన గురుతర బాధ్యత సమాచార శాఖపై ఉందన్నారు. మారుతున్న మీడియా ప్రసార శైలిలు, అవసరాల కనుగుణంగా మరింత వేగంగా సమాచార సేవలు అందించేందుకు సమాచార శాఖలోని పిఆర్ఓ, ఇంజనీరింగు విభాగాలను ఏకీకృతం చేసి సాంకేతికంగాను, సిబ్బంది పరంగాను పటిష్టీకరిస్తున్నామని తెలిపారు. ప్రజలకు మెరుగైన సమాచార సేవలను అందించేందుకు మీడియాతో సుహృద్భావ సంబంధాలు పెంచుకోవాలని, అలాగే మీడియా ప్రతినిధులకు ప్రభుత్వం కల్పిస్తున్న సౌకర్యాలు, సంక్షేమాలు అర్హులైనవారందరికి త్వరితగతిన అందించాలని సూచించారు. క్షేత్ర స్థాయిలో సమాచార శాఖ అధికారుల సిబ్బంది ఎదుర్కొంటున్న సమస్యలను అడిగి తెలుకుని వాటిని పరిష్కరిస్తామని కమీషనర్ విజయకుమార్ రెడ్డి తెలిపారు. జిల్లా సమాచార పౌర సంబంధ అధికారి, కాకినాడ బి.పూర్ణ చంద్రరావు కాకినాడ జిల్లా విభాగం ద్వారా నిర్వహిస్తున్న కార్యకలాపాలు, కార్యాలయ సేవల విస్తరణ, పటిష్టీకరణకు అవసరమైన అంశాలను కమీషనర్ కు వివరించారు. ఈ సమావేశంలో రాష్ట్ర సమాచార శాఖ అడిషనల్ డైరెక్టరు ఎల్. స్వర్ణలత, డిప్యూటీ డైరెక్టరు పి.తిమ్మప్ప, ఏఈఐఈ ఎన్.వెంకటేశ్వర్లు, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. కార్యక్రమంలో సమాచార శాఖ కమీషనరు విజయ్ కుమార్ రెడ్డిని జిల్లా కార్యాలయ అధికారులు , సిబ్బంది పుష్పగుచ్చం అందించి దుస్సాలువాతో సత్కరించారు.
addComments
Post a Comment