నెల్లూరు, జూలై 23 (ప్రజా అమరావతి);
శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ద్వారా భక్తుల చెంతకే భగవంతుడు :
- ఆగస్టు 16 నుండి 20వ తేదీ వరకు నెల్లూరులో వైభవోత్సవాలు
- జెఈవో శ్రీ వీరబ్రహ్మం
శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల ద్వారా తిరుమల శ్రీవారు భక్తుల చెంతకే వచ్చి దర్శనమివ్వనున్నారని ఈ అరుదైన అవకాశాన్నినెల్లూరు జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని జెఈవో శ్రీ వీరబ్రహ్మం కోరారు. నెల్లూరు నగరంలోని ఎ.సి.సుబ్బారెడ్డి స్టేడియంను శనివారం పార్లమెంటు సభ్యులు శ్రీ వేమి రెడ్డి ప్రభాకర్ రెడ్డి, అధికారులతో కలిసి జెఈవో పరిశీలించారు.
ఈ సందర్భంగా జెఈవో మీడియాతో మాట్లాడుతూ, శ్రీవేంకటేశ్వరస్వామి వారు కొలువైన తిరుమల ఆలయంలో రోజువారీ స్వామివారికి నిర్వహించే అన్నిరకాల సేవలను భక్తులందరూ వీక్షించేందుకు ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్టు తెలిపారు. ఎ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో ఆగస్టు 16 నుంచి 20వ తేదీ వరకు శ్రీవేంకటేశ్వర వైభవోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్టు చెప్పారు. ఉత్సవాల నిర్వహణ కోసం విస్తృతంగా ఏర్పాట్లు చేపడుతున్నామని వివరించారు.
ఢిల్లీ స్థానిక సలహామండలి అధ్యక్షురాలు శ్రీమతి వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి మాట్లాడుతూ, సనాతన హైందవ ధర్మ ప్రచారంలో భాగంగా ఇక్కడ శ్రీవారి నమూనా ఆలయాన్ని ఏర్పాటుచేసి ఉదయం 5.30 గంటలకు సుప్రభాతం నుంచి రాత్రి 8.30 గంటలకు ఏకాంతసేవ వరకు అన్నిరకాల సేవలను నిర్వహించనున్నట్టు తెలిపారు. వైభవోత్సవాలకు విచ్చేసే భక్తులకు అన్నప్రసాదాలు, ప్రథమ చికిత్స కేంద్రాలు, ఆధ్యాత్మిక, భక్తి సంగీత కార్యక్రమాలు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. భక్తులందరూ విచ్చేసి స్వామివారిని దర్శించుకుని శ్రీవారి కృపకు పాత్రులు కావాలని ఈ సందర్భంగా ఆమె కోరారు.
అంతకుముందు ఎ.సి.సుబ్బారెడ్డి స్టేడియంలో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు జెఈవో పలు సూచనలు చేశారు.
ఈ కార్యక్రమంలో సిఇ శ్రీ నాగేశ్వరరావు, ఎస్ఇ-2 శ్రీ జగదీశ్వర్ రెడ్డి, శ్రీ వెంకటేశ్వర్లు పిఆర్వో డా|| టి.రవి, ధార్మిక ప్రాజెక్టుల అధికారి శ్రీ విజయసారధి, శ్రీ పెంచల్ రెడ్డి ఇతర అధికారులు పాల్గొన్నారు.
addComments
Post a Comment