- రాష్ట్ర గనులశాఖ అత్యుత్తమ విధానాలకు జాతీయ గుర్తింపు
- జాతీయ స్థాయిలో అవార్డు కు ఎంపిక
- ఢిల్లీలో జరిగిన జాతీయ కాంక్లేవ్ లో పురస్కారం ప్రధానం
- రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కార్ ఇన్సెంటీవ్ గా రూ.2.40 కోట్లు
- గనుల అన్వేషణ, వేలం, మైనింగ్ నిర్వహణపై ప్రశంసలు
- ఢిల్లీలో కేంద్ర హోంశాఖ మంత్రి నుంచి పురస్కారం అందుకున్న...
- మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, డిఎంజి శ్రీ విజి వెంకటరెడ్డి
అమరావతి (ప్రజా అమరావతి):
ఆంధ్రప్రదేశ్ లో గనులశాఖ అనుసరిస్తున్న పారదర్శక విధానాలకు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. మేజర్ మినరల్స్ కు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యకలాపాల పర్యవేక్షణలో గనులశాఖ అధికారులు అనుసరిస్తున్న అత్యుత్తమ విధానాలకు కేంద్ర బొగ్గు మరియు గనుల మంత్రిత్వ శాఖ జాతీయ స్థాయిలో అవార్డును ప్రకటించింది. అలాగే రెండేళ్ళకు గానూ రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కార్ కింద 2.40 కోట్ల రూపాయల ఇన్సెంటీవ్ ను ప్రకటించింది. ఈ మేరకు ఆజాదీకా అమృత్ మహోత్సవ్ లో భాగంగా మంగళవారం న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్ లో మైన్స్ అండ్ మినరల్స్ పై జరిగిన నేషనల్ కాంక్లేవ్ లో కేంద్ర హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా చేతుల మీదిగా రాష్ట్ర మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, గనులు మరియు భూగర్భ శాఖ సంచాలకులు (డిఎంజి) శ్రీ విజి వెంకటరెడ్డిలు ఈ పురస్కారాన్ని అందుకున్నారు.
కేంద్ర గనుల మంత్రిత్వ శాఖ దేశంలో మేజర్ మినరల్స్ మైనింగ్ ను ప్రోత్సహించేందుకు ఉత్తమ విధానాలను అనుసరిస్తున్న రాష్ట్రాలను గుర్తించి అవార్డులను ప్రధానం చేస్తోంది. దీనిలో భాగంగా రాష్ట్రీయ ఖనిజ వికాస్ పురస్కార్ కింద ఇన్సెంటీవ్ లను కూడా అందిస్తోంది. గత రెండేళ్ళలో ఆంధ్రప్రదేశ్ పది రకాల మేజర్ మినరల్స్ కు సంబంధించి అన్వేషణ, వేలం, మైనింగ్ కార్యక్రమాల పర్యవేక్షణలో చూపించిన పారదర్శకత, అత్యంత వేగంగా లీజుల జారీ, వేగంగా మైనింగ్ కార్యక్రమాలను ప్రారంభించేలా చేయడంలో అత్యుత్తమ విధానాలను అవలంభించింది.
దీనిపై జాతీయ స్థాయిలో ఢిల్లీలో నిర్వహించిన నేషనల్ కాంక్లేవ్ లో మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేది, గనులశాఖ డిఎంజి శ్రీ విజి వెంకటరెడ్డి లకు ఖనిజ వికాస్ పురస్కార్ ఇన్సెంటీవ్ మొత్తాలను కేంద్రం హోంశాఖ మంత్రి శ్రీ అమిత్ షా అందచేశారు.
అనంతరం గతంలో కేటాయించిన మైనింగ్ బ్లాక్ ల నిర్వహణను సమర్థవంతంగా చేపట్టినందుకు అభినందనలు తెలుపుతూ 2022-23 ఆర్థిక సంవత్సరంలో బాక్సైట్, ఐరన్ ఓర్ లకు సంబంధించి అయిదు కొత్త మినరల్స్ బ్లాక్ లకు సంబంధించిన జియోలాజికల్ నివేదికలను రాష్ట్రానికి అందచేశారు. వీటికి కూడా త్వరగా ఖనిజ అన్వేషణ, వేలం, మైనింగ్ ఆపరేషన్ ప్రక్రియలను పూర్తి చేస్తామని ఈ సందర్భంగా డిఎంజి శ్రీ విజి వెంకటరెడ్డి తెలిపారు. మైనింగ్ రంగంలో సీఎం శ్రీ వైయస్ జగన్ గారు తీసుకువచ్చిన విప్లవాత్మక సంస్కరణలు, గనులశాఖ మంత్రి శ్రీ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మార్గదర్శకత్వం వల్లే జాతీయ స్థాయి గుర్తింపును సాధించామని అన్నారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో మరిన్ని విజయాలను సాధిస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు.
నేషనల్ కాంక్లేవ్ లో ఆంధ్రప్రదేశ్ కు చెందిన భారతీ సిమెంట్ కు కేంద్ర గనుల శాఖ ఫైవ్ స్టార్ రేటింగ్ ఇవ్వడం పట్ల సదరు సంస్థ యాజమాన్యం ను మైన్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీ గోపాలకృష్ణ ద్వివేదీ, డిఎంజి శ్రీ వెంకటరెడ్డి అభినందించారు. వరుసగా మూడేళ్ళు సస్టెయినబుల్ మేనేజ్ మెంట్ విధానాలను అవలంబించిన భారతీ సిమెంట్స్ కు ఈ గౌరవం దక్కడం అభినందనీయమని అన్నారు.
addComments
Post a Comment