రెవిన్యూ సేవలు పూర్తి పారదర్శకంగా అందరికీ అందించాలి


నెల్లూరు ఆగస్టు 17 (ప్రజా అమరావతి);


రెవిన్యూ సేవలు పూర్తి పారదర్శకంగా అందరికీ అందించాల



ని జిల్లా కలెక్టర్ శ్రీ కె వి ఎన్ చక్రధర్ బాబు తాహాసిల్దార్ లను ఆదేశించారు. 


బుధవారం ఉదయం కలెక్టరేట్లోని తిక్కన ప్రాంగణంలో రెవిన్యూ సంబంధ విషయాలపై నెల్లూరు డివిజన్ సమీక్ష సమావేశం నిర్వహించారు. గృహం నిర్మాణం, ఓ టి ఎస్ పథకం, పి ఎం ఈ వై గ్రామీణ పథకం, చుక్కల భూములు,  రీ సర్వే, స్పందన వినతులు, ఏపీ సేవా సర్వీసులు తదితర పథకాలపై తాహాసిల్దార్ లు, యం డి వో లు, మున్సిపల్ కమిషనర్లు లతో జిల్లా కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. 


ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ, రెవిన్యూ శాఖ ఇతర శాఖలకు తలమానికంగా ఉండాలని, రెవెన్యూ శాఖ పై ప్రజలకు సదాభిప్రాయం కలిగే విధంగా బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ జాగ్రత్తగా నిర్వహించాలన్నారు. ఈ క్రాప్  చేయడంలో గతంలో జరిగిన తప్పులను పునరావృతం కాకుండా, అవకతవకలకు ఆస్కారం లేకుండా పూర్తి చేయాలన్నారు. ఈ క్రాపింగ్ లో రైతుల బయోమెట్రిక్ కూడా పూర్తి చేసి రోజువారీ నివేదిక పంపాలన్నారు. రెవెన్యూ అధికారులు, పౌరసరఫరాల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. గ్రామ సచివాలయాల వారీగా లక్ష్యాలను నిర్దేశించి త్వరితగతిన ఈ- క్రాపింగ్ చేయుటకు కృషి చేయాలన్నారు. అదేవిధంగా ఓటర్ కార్డు తో ఆధార్ అనుసంధాన ప్రక్రియ కూడా నిర్దేశిత గడువులోగా పూర్తి చేయాలన్నారు. తాహాసిల్దార్ లు ఈ విషయంపై వ్యక్తిగత శ్రద్ధ తీసుకొని పనిచేయాలన్నారు.


హౌసింగ్ పై సమీక్షిస్తూ నెల్లూరు డివిజన్ లో ఎక్కువగా ఉన్న గృహ నిర్మాణాల లక్ష్యం మేరకు ఉద్యోగుల పనితీరు కూడా అంతే ఎక్కువగా ఉండాలన్నారు. ఇప్పటికీ గ్రౌండింగ్ చేయని ఇళ్లను వారం లోపు పూర్తిచేయాలని ఆదేశించారు. సెప్టెంబర్ చివరి నాటికి బి ఎల్  స్థాయి దాటాలని సూచించారు. పట్టా తీసుకొని ఇళ్ల నిర్మాణం చేయని వారికి నోటీసులు జారీ చేసి పట్టా రద్దు చేయుటకు చర్యలు తీసుకోవాలన్నారు. ఓ టి ఎస్ పథకంలో మరణించిన వారి విషయంలో నిబంధనల మేరకు వారి వారసులకు అందజేయడానికి చర్యలు తీసుకోవాలన్నారు. అదేవిధంగా పి ఎం ఈ వై గ్రామీణ పథకంలో పొజిషన్ సర్టిఫికెట్ అందచేయుట లో నిర్లక్ష్యం తగదన్నారు. ప్రతి స్థాయిలోని రెవెన్యూ ఉద్యోగులు వారి బాధ్యతలను సక్రమంగా బాధ్యతాయుతంగా నెరవేర్చాలన్నారు.


స్పందన వినతులపై జిల్లా కలెక్టర్ సమీక్షిస్తూ, ప్రతి వారం వస్తున్న స్పందన దరఖాస్తులలో సగానికి  పైగా కేవలం రెవిన్యూ శాఖ కి సంబంధించినవే ఉంటున్నాయన్నారు. స్పందన దరఖాస్తుల పరిష్కారంలో సామాన్య మానవుల దృక్కోణంలో  పరిశీలించి పరిష్కరించాలన్నారు. సమస్యలను పరిష్కరించకుండా దరఖాస్తులను మూసివేయడం తగదన్నారు. ఒకే సమస్య మరల మరల వస్తుందంటే సంబంధిత అధికారులు సక్రమంగా పని చేయటం లేదని అర్థమన్నారు. భవిష్యత్తులో రెవెన్యూ అధికారులపై ఫిర్యాదులు వస్తే క్రమశిక్షణా చర్యలకు వెనుకాడేది లేదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ హెచ్చరించారు.


అదేవిధంగా భూసేకరణకు సంబంధించి  నిబంధనలు పాటిస్తూ నిర్దేశిత గడువులోగా సంబంధిత శాఖలకు భూమిని అప్పగించుటకు త్వరితగతిన చర్యలు తీసుకోవాలన్నారు.


ఈ సమీక్షా సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ రోణంకి కూర్మనాథ్, జిల్లా రెవెన్యూ అధికారి వెంకట నారాయణమ్మ, నెల్లూరు ఆర్ డి ఓ మలోలా, హౌసింగ్ పి డి రంగ వర ప్రసాద్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ ఇ  రంగ వర ప్రసాద్, డి పి ఓ ధనలక్ష్మి , జడ్పీ సీఈవో రాణి, ల్యాండ్ రికార్డ్స్ ఏడి హనుమాన్ ప్రసాద్, వివిధ మండల తాహసిల్దార్లు ,యం డి వో లు, హౌసింగ్ ఏఈలు పాల్గొన్నారు.




Comments