*- ఓట్లు దండుకుని బ్రాహ్మణులను నమ్మించి మోసం చేశారు*
*- జగన్ పాలనలో అర్చకుల పరిస్థితి అగమ్యగోచరం*
*- బ్రాహ్మణ కార్పొరేషన్ ను నామమాత్రంగా మార్చారు*
*- నేటికీ వేతనాల పెంపు జీవోకు మోక్షం లేదు*
*- 10 వేల మంది బ్రాహ్మణులకు వైఎస్ఆర్ పెన్షన్ అందని పరిస్థితి*
*- ఎన్నికలకు ముందు బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అమలు చేయండి*
*- టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్*
అమరావతి, సెప్టెంబర్ 6 (ప్రజా అమరావతి):
ఓట్లు దండుకుని సీఎం జగన్మోహన్ రెడ్డి బ్రాహ్మణులను నమ్మించి మోసం చేశారని టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి శిష్ట్లా లోహిత్ తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు. మంగళవారం శిష్ట్లా లోహిత్ ఒక ప్రకటన విడుదల చేశారు. జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో అర్చకుల పరిస్థితి అగమ్యగోచరంగా మారిందన్నారు. అధికారంలోకి వస్తే బ్రాహ్మణులకు అదిచేస్తాం, ఇది చేస్తామని ఆచరణకు నోచుకోని హామీలిచ్చారన్నారు. బ్రాహ్మణ సంక్షేమ కార్పొరేషన్ ను నామమాత్రపు కార్పొరేషన్ గా వైసీపీ ప్రభుత్వం మార్చిందన్నారు. రూ.100కోట్లు కార్పొరేషన్ కు కేటాయించి ఒక్క పైసా కూడా ఖర్చుచేయలేదన్నారు. అధికారంలోకి వస్తే రాష్ట్రవ్యాప్తంగా 8600 దేవాలయాలకు దూపదీప నైవేద్యం కింద నిధులు ఇస్తామని జగన్ హామీ ఇచ్చి మాట తప్పారన్నారు. ప్రతిఏటా బడ్జెట్ లో బ్రాహ్మణుల సంక్షేమానికి నిధులు కేటాయించినా, వాటిని వినియోగించకుండా ఆ నిధులను కూడా దారిమళ్లించి బ్రాహ్మణులకు ద్రోహం చేస్తున్నారన్నారు.
రూ.10వేలు వేతనాలున్న అర్చకులకు రూ.15,625లు, రూ.5వేలు వేతనం వచ్చే అర్చకులకు రూ.10వేలు ఇస్తామని ఇచ్చిన హామీ, దీనికి సంబంధించిన జీవోకు నేటికీ మోక్షం కలగలేదన్నారు. అర్చకులకు రిటైర్మెంట్ లేదని ఇచ్చిన హామీనీ జగన్ ప్రభుత్వం గాలికొదిలేసిందన్నారు. టీడీపీ అధికారంలో ఉండగా 45వేల మంది పేద బ్రాహ్మణులకు పెన్షన్లు ఇస్తే, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ సంఖ్యను భారీగా తగ్గించిందని బ్రాహ్మణ చైతన్య వేదిక ఆరోపిస్తోందన్నారు. వైఎస్ఆర్ పెన్షన్ 10వేల మంది బ్రాహ్మణులకు కూడా అందని పరిస్థితి ఉందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 1,54,182మంది బ్రాహ్మణులకు వివిధ సంక్షేమ పథకాలు అందాయన్నారు. గాయత్రి పథకం ద్వారా ప్రభుత్వ గుర్తింపు పొందిన స్కూళ్లు, కాలేజీల్లో మెరిట్ సాధించిన 761మంది బ్రాహ్మణ విద్యార్థులకు రూ.76లక్షలు ఖర్చుచేశారన్నారు. విదేశీ విద్యకోసం 88,682మందికి రూ.119.22కోట్లు, వేదవ్యాస్ పథకం కింద వేద విద్య కోసం 155 మందికి రూ.21.60లక్షలు, వశిష్ట పథకం కింద పోటీ పరీక్షల్లో శిక్షణ కోసం 377మందికి రూ.1.22కోట్లు అందించారన్నారు. కేంద్రం ఆర్థికంగా వెనుకబడిన అగ్రవర్ణాల వారి కోసం ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు ప్రతిపాదించిందని చెప్పారు. టీడీపీ అధికారంలో ఉండగా కాపు, ఇతర అగ్రవర్ణాల వారికి మొత్తం 10శాతం రిజర్వేషన్ల కల్పించిందన్నారు. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక వాటిని రద్దు చేసిందన్నారు. గ్రామ,వార్డు సచివాలయ ఉద్యోగుల నియామకాల్లో వేలాదిమంది బ్రాహ్మణ యువత అవకాశాలు కోల్పోయారన్నారు. అగ్రవర్ణాల పేదలకు మొత్తం 38వేలకు పైగా పోస్టులు దక్కలేదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి ఎన్నికలకు ముందు బ్రాహ్మణులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని టీడీపీ డిమాండ్ చేస్తోందన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ కు బడ్జెట్ లో కేటాయించిన నిధులు పూర్తిగా సద్వినియోగం అయ్యేలా చూడాలన్నారు. ఈడబ్ల్యుఎస్ రిజర్వేషన్లు అమలు చేయాలని శిష్ట్లా లోహిత్ కోరారు.
addComments
Post a Comment