వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత

 *వినియోగదారుల హక్కుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత* 


*రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు*


అమరావతి, నవంబరు 24 (ప్రజా అమరావతి): వినియోగదారుల హక్కుల పరిరక్షణకు రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత నిస్తున్నదని రాష్ట్ర పౌర సరఫరాలు మరియు వినియోగాదారుల వ్యవహారాల శాఖ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు తెలిపారు. వినియోగదారులకు సత్వర న్యాయం జరిగే విధంగా వినియోగదారుల రక్షణ చట్టాన్ని సవరించడమే ఇందుకు నిదర్శనమన్నారు. గురువారం అమరావతి సచివాలయం ఐదో బ్లాక్లోని సమావేశ మందిరంలో మంత్రి అద్యక్షతన రాష్ట్ర వినియోగదారుల రక్షణ మండలి తొలి సమావేశం జరిగింది. అనంతరం మంత్రి పబ్లిసిటీ సెల్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ ఈ సవరించిన చట్టం ప్రకారం కొనుగోలుదారులు  వస్తువులు ఎక్కడ కొన్నప్పటికీ తాను నివాసం ఉంటున్న ప్రాంతం నుండే పిర్యాదు నమోదు చేసుకోవడమే కాకుండా వీడియో కాన్ఫరెన్సు ద్వారా కేసు విచారణకు హాజరయ్యే వెసులుబాటును కల్పించడం జరిగిందన్నారు. స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లో వినియోగదారులు తమ పిర్యాదులను నమోదు చేసుకోవడమే కాకుండా అక్కడ నుండే వీడియో కాన్పరెన్సు ద్వారా విచారణకు హాజరు కావచ్చన్నారు. గతంలో ఈ వెసులుబాటు లేదని, వినియోగదారుడు వస్తువు కొనుగోలు చేసిన ప్రాంతంలో లేదా ఆ వస్తువు తయారీదారుని  రిజిస్టర్డు కార్యాలయంలో మాత్రమే ఫిర్యాదు చేసుకొనే సౌకర్యం ఉండేదన్నారు. ప్రస్తుతం వినియోగదారులు తమ ఫిర్యాదులను స్థానిక గ్రామ, వార్డు సచివాలయాల్లోగాని, ఆన్ లైన్ ద్వారా గాని లేదా వినియోగదారుల సహాయ సేవ కేంద్రం హెల్స్ లైన్ టోల్ ఫ్రీ నెంబర్లకు (1967 & 18004250082)  గాని పోన్  చేసి ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చన్నారు. ఈ అవకాశాన్ని వినియోగదారులు అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తిచేశారు. సవరించిన వినియోగదారుల రక్షణ చట్టంపై వినియోగదారుల్లో  పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, కరపత్రాలు తదితర ప్రచార మాద్యమాల ద్వారా విస్తృత స్థాయిలో అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు మంత్రి తెలిపారు. ఆదే విధంగా డిశంబరు 24 న వినియోగదారుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించేందుకు  ఏర్పాట్లు చేస్తున్నామని, సవరించిన చట్టం ద్వారా వినియోగదారులకు కల్పించిన హక్కులపై పూర్తి స్థాయిలో అవగాహన కల్పించేందుకు ఈ సందర్భాన్ని వినియోగించుకోనున్నామన్నారు. 

 

వినియోగదారుల  హక్కులను పరిరక్షించేందుకు పూర్తి స్థాయిలో తనిఖీలను నిర్వహించడం జరుగుతున్నదని మంత్రి తెలిపారు. గత పదిమాసాల కాలంలో మొత్తం 1,748 కేసులు నమోదు అవడం జరిగిందని, పాత వాటితో కలుపుకుని ఇప్పటి వరకూ 2,139 కేసులను పరిష్కరించడం జరిగిందన్నారు. ఇంకా 4,407 కేసులను పరిష్కరించవలసి ఉందని మంత్రి తెలిపారు. తూనికలు, కొలతల శాఖ అధికారులు విస్తృతంగా తనిఖీలను నిర్వహిస్తున్నారని,  పెట్రోల్ బంకులల్లో  తనిఖీలు జరిపి 97 కేసులను, ఎరువుల దుఖాణాలకు సంబంధించి 350 కేసులను, విశాఖపట్నం, విజయవాడలోని  షాషింగ్ మాల్స్ కు సంబందించి 175 కేసులను నమోదు చేయడం జరిగిందన్నారు. త్వరలో బంగారు నగల దుఖాణాల్లో కూడా తనిఖీలను నిర్వహించనున్నట్లు మంత్రి తెలిపారు.  ధాన్యం  తూకాల్లో  రైతులకు ఎటు వంటి అన్యాయం జరుగకుండా ఉండేందుకై కోట్లాది రూపాయలు వెచ్చిస్తూ  దాదాపు 93 వే బ్రిడ్జిలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. 


పాత్రికేయులు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాదానం చెపుతూ ఆహార పదార్థాల కల్తీలను నివారించేందుకు ప్రభుత్వం పటిష్టమైన చర్యలను తీసుకోవడం జరుగుచున్నదని, ఇందుకై 15 మొబైల్ ల్యాబ్స్ ను మరియు  విశాఖపట్నంలో ఉన్న ల్యాబ్ ను ఆధునీకరించడంతో పాటు విజయవాడ, తిరుపతిలో శాశ్వత ప్రాతిపదిక ల్యాబ్స్ ను దశల వారీగా  ఏర్పాటు చేసేందుకు చర్యలను తీసుకోవడం జరుగుచున్నదన్నారు.  వచ్చే ఏడాది  జనవరి, ఫిబ్రవరి మాసాల కల్లా కనీసం ఆరు మొబైల్ ల్యాబ్స్ ను ఏర్పాటు  చేసేందుకు చర్యలను తీసుకుంటున్నట్లు మంత్రి తెలిపారు. 


రైతుల నుండి ధాన్యాన్ని ప్రభుత్వ మే పెద్దఎత్తున కొనుగోలు చేస్తున్నదని, ఇందులో  రైస్ మిల్లర్ల ప్రమేయం ఏమాత్రం లేదని,  ప్రభుత్వం మిల్లర్లకు ధాన్యాన్ని అమ్ముతున్నట్లు చాలా మంది అపోహపడుతున్నారని, అందులో ఏమాత్రం నిజంలేదన్నారు. రైతుల నుండి  కొనుగోలు చేసిన ధాన్యాన్ని  రైస్ మిల్లర్లకు డబ్బులు ఇచ్చి ప్రభుత్వం అడించుకోవడం జరుగుతుందని ఆయన తెలిపారు. ఈ ఏడాది వర్షాల వల్ల ధాన్యం పెద్దగా తడవలేదని, ఒక వేళ అక్కడక్కడా కొంత ధాన్యం తడిసినప్పటికీ ప్రభుత్వం ఆ ధాన్యాన్ని కూడా కొనుగోలు చేస్తుందని మంత్రి తెలిపారు. ధాన్యం కొనుగోలు చేసిన 21 రోజుల్లో రైతులకు సొమ్ము చెల్లించాల్సి ఉందని, అయినప్పటికీ ఇంకా ముందుగానే రైతుల ఖాతాల్లో సొమ్మును జమచేయడం జరుగుచున్నదని మంత్రి తెలిపారు. 


రాష్ట్ర పౌర సరఫరాల శాఖ సంచాలకులు విజయ సునీత ఈ సమావేశంలో పాల్గొన్నారు.


Comments