ప్రత్యేక అవసరాల పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి

 ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం

పాఠశాల విద్యాశాఖ- సమగ్ర శిక్షా




ప్రత్యేక అవసరాల పిల్లల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి



- పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్. సురేష్ కుమార్ గారు.

విజయవాడ (ప్రజా అమరావతి);

పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లల సర్వతోముఖాభివృద్ధికి పాఠశాల విద్యాశాఖ, సమగ్ర శిక్షా వివిధ కార్యక్రమాలు చేపడుతున్నాయని పాఠశాల విద్యాశాఖ కమీషనర్, సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ ఎస్.సురేష్ కుమార్ గారు అన్నారు. మంగళవారం విజయవాడలో జరిగిన సహిత విద్య (inclusive Education)కు సంబంధించి ఒకరోజు కార్యశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అన్ని మండలాల్లో దివ్యాంగ విద్యార్థుల కోసం ఏర్పాటు చేసిన భవిత కేంద్రాల ద్వారా విద్యను అందిస్తున్నామని అన్నారు. పాఠశాలల్లో ప్రత్యేక అవసరాలు గల పిల్లలను ఆరోగ్య శాఖ సిబ్బంది‌ సహకారంతో గుర్తించి, పిల్లలకు  గుణాత్మక విద్యను అందించేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని కోరారు.  

ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారికి అవసరమైన థెరపి సేవలు, తేలికపాటి శస్త్ర చికిత్సలు అందేలా బాధ్యత వహించాలని అన్నారు. 

పాఠశాలలకు వెళ్లలేని ప్రత్యేక అవసరాల గల పిల్లలకు ఇంటి వద్దనే విద్య అందేలా, దూరప్రాంతాలనుంచీ వచ్చే దివ్యాంగులకు రవాణా భత్యాలు అందిస్తున్నామని తెలిపారు. దివ్యాంగ పిల్లలను చిన్నచూపు చూడకూడదని, వారికి సహకరించాలని సూచించారు.  భవిష్యత్తులో ప్రత్యేక అవసరాల గల పిల్లలు మరిన్ని సౌకర్యాలు పొందేలా, వారి శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని విధివిధానాలు రూపొందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో సమగ్ర శిక్షా ఎస్ఏపీడీ శ్రీ బి.శ్రీనివాసరావు గారు, ఏఎస్పీడీ డా. కె.వి.శ్రీనివాసులు గారు, ప్రభుత్వ పాఠ్య పుస్తకాల ప్రచురణ సంచాలకులు రవీంద్రనాథ్ రెడ్డి గారు,  రాష్ట్ర ఐఈ కోఆర్డినేటర్ శ్రీమతి ఎన్.కె.అన్నపూర్ణ గారు, హెల్త్ నోడల్ ఆఫీసర్ శ్రీ శ్రీనివాసరెడ్డి గారు, డిజెబుల్ట్ ఎక్సఫర్ట్ డా. హొమియర్ మోబ్డేజీ, బ్రాండ్ కన్సల్టెంట్ రామ్ కమల్ గారు,  NIEPID అసిస్టెంట్ ప్రొఫెసర్ డా. శిల్పా మనోజ్ఞ, అన్ని జిల్లాల ఐఈ కో ఆర్డినేటర్లు, ఎస్సీఈఆర్టీ ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

Comments