ప్రకృతి వ్యవసాయం పై విస్తృత ప్రచారం అవసరం

 ప్రకృతి వ్యవసాయం పై విస్తృత ప్రచారం అవసరం 



“మీడియా తో సత్సంబందాలు, విజయగాధల రచనల పై” రాష్ట్ర స్థాయి శిక్షణ 

గుంటూరు (ప్రజా అమరావతి);

      ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతంగా రైతుల్లోకి తీసుకెళ్ళి అత్యధిక సంఖ్యలో రైతులు ముందుకు వచ్చి ప్రకృతి వ్యవసాయం చేసేలా తగిన ప్రచారం కల్పించాలని  రైతు సాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బి. రామా రావు పిలుపునిచ్చారు . పాత్రికేయులతో సత్సంబంధాలు ఏర్పరచుకోవడం, నిరంతరం ప్రకృతి వ్యవసాయానికి సంబందించిన వార్తలు, విజయగాధలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం ద్వారా అది సాద్యం అవుతుందని ఆయన అన్నారు. 

గోరంట్ల లోని రైతు సాధికార సంస్థ కార్యాలయ సమావేశ భవనం లో రెండు రోజుల పాటు (16th, 17th November) రాష్ట్ర స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగినది. 16 వ తేదీ బుధవారం ప్రారంభమైన ఈ శిక్షణ కార్యక్రమానికి 26  జిల్లాల నుంచి ప్రకృతి వ్యవసాయ విభాగంలో “ప్రసార మాద్యమాలు మరియు విజయగాధలను రచించే” బాధ్యతలు నిర్వర్తించే ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా  రైతు సాధికార సంస్థ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీ బి. రామా రావు మాట్లాడుతూ రోజురోజుకూ వ్యవసాయ సాగుకు అధిక మోతాదులో రసాయనాలు వాడటం వల్ల ప్రజల ఆరోగ్యం క్షీణించి పోతోందని , అందువల్ల ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించాల్సిన అవసరం ఎంతైనా వుందని నొక్కి చెప్పారు. అతి చిన్న వయసులోనే రకరకాల జబ్బులకు గురికావలసిన దుస్థితి ఏర్పడుతుందని అన్నారు. వాతావరణంలో మార్పు,  రైతుల జీవితాల్లో ఆర్థిక ఎదుగుదల, ప్రజలకు  ఆరోగ్యకరమైన ఆహారం అందించడం .. ఇవన్నీ జరగాలంటే  ప్రకృతి వ్యవసాయానికి విస్తృత ప్రచారం అవసరం అన్నారు. వాతావరణ వ్యవస్థ పాడైపోతున్నందున అందరం అవస్థలు పడుతున్నామని, ప్రజలను, రైతులను జాగృతం చేసి మేలుకొలపాలని చెప్పారు. పత్రికలకు విడుదల చేసే వ్యాసరచన సౌందర్యంగా వుండాలని, క్లుప్తంగా విషయం తెలియజేయాలని అన్నారు.మనం చెప్పే,వార్తలు, విజయ గాధలు  వాస్తవానికి దగ్గరగా వుండాలన్నారు. ప్రపంచ దేశాలు ఎన్నో ప్రకృతి వ్యవసాయం కోసం ఆంధ్ర ప్రదేశ్ వైపు చూస్తున్నాయని, రాష్ట్రములో అంతర్జాతీయ పరిశోధనా కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగిందని ఈ సందర్భంగా గుర్తు చేశారు. మనం చెప్పే విజయ గాధలు రైతులను ప్రభావితం చేసేలా వుండాలని,కాన్సర్ వంటి జబ్బులు కూడా ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల వినియోగం వల్ల తగ్గుముఖం పడుతున్న సాక్షాలు మనకెన్నో కనిపిస్తున్నాయని చెప్పారు. అత్యాశతో రైతులు అధిక మోతాదులో విచ్చలవిడిగా రసాయన మందులు వాడుతున్నారని, రైతులకు దిశానిర్దేశం చేసేలా విజయ గాధలు వుండాలని అన్నారు. 

ఈ సందర్భంగా రైతు సాధికార సంస్థ థిమాటిక్ లీడ్ విశ్వేశ్వర రావు మాట్లాడుతూ ఈ రోజుల్లో కమ్యూనికేషన్ అత్యంత అవసరం అని, కమ్యూనికేషన్ వ్యవస్థను సమర్థవంతంగా వినియోగించుకొని సోషల్ మీడియా, ప్రింట్ మరియు ఎలక్ట్రానిక్ మీడియా ద్వారా ప్రకృతి వ్యవసాయానికి విస్తృత ప్రచారం కల్పించాలని అన్నారు. రసాయన ఆహారం వల్ల ప్రజల ఆరోగ్యాలు రోజురోజుకీ క్షీణించి పోతున్నాయని, ఆత్యధిక విస్తీర్ణంలో ప్రకృతి వ్యవసాయం అమలవుతేనే అందరికీ రసాయన రహిత ఆహారం అందుతుందని అన్నారు. జాతీయ అంతర్జాతీయ సంస్థలు ఎన్నో రైతు సాధికార సంస్థతో కలిసి పని చేసేందుకు ముందుకు వస్తున్నాయని, వ్యవసాయ యూనివర్సిటీలు కూడా జత కడుతున్నాయని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ లో విస్తృతంగా జరుగుతున్న ప్రకృతి వ్యవసాయ విధానం దేశమంతా విస్తరించే చర్యలు ముమ్మరంగా జరుతున్నాయని అన్నారు.  థిమాటిక్ లీడ్ సురేష్ బాబు మాట్లాడుతూ విజయవంతంగా ప్రకృతి వ్యవసాయం చేస్తూ ఆర్థికంగా అభివృద్ధి చెందుతున్న రైతుల విజయ గాధలను ప్రజల్లోకి తీసుకు వెళ్ళడం వల్ల  రైతులు, వినియోగదారులు చైతన్యవంతులు అవుతారని, ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులకు కూడా మంచి డిమాండ్ పెరిగి మార్కెటింగ్ సులభతరం అవుతుందని సూచించారు. మీడియా ప్రతినిధులతో సత్సంబంధాలు ఏర్పరచుకొని నిరంతరం పత్రికల్లో ప్రకృతి వ్యవసాయానికి సంబంధించిన వార్తలు ప్రచురితమయ్యేలా చూడాలని సూచించారు. పత్రికల్లో స్పేస్ సమస్య అధికంగా వుందని, అయినప్పటికీ ప్రస్తుత పరిస్తితుల్లో రసాయన రహిత వ్యవసాయం అవసరం చాలా వున్నందున “Need of the Hour”గా గుర్తించి పత్రికలు తమ వంతు సహకారం అందిస్తున్నాయని, భవిస్యత్తులో కూడా ఇదే సహకారం అందిస్తాయనే ఆశాభావం వ్యక్తం చేశారు. 

తొలిరోజు శిక్షణా కార్యక్రమంలో వివిధ ప్రాంతాల్లో సేకరించిన అత్యుత్తమ విజయగాధలను ప్రదర్శింపజేసి శిక్షణార్థులను విజయగాధలు రచించే అంశంలో తర్ఫీదు నిచ్చారు. పాత్రికేయులు మరియు సమాచార పౌర సంబంధాల శాఖ వారితో ఎలాంటి సత్సంబంధాలు నడుపుకోవాలి, ఎలక్ట్రానిక్ మీడియా లో ఎలాంటి వార్తలకు ప్రాధాన్యం వుంటుంది, విజయగాధలను  గుర్తించడంలో కావలసిన నైపుణ్యం ,సమాచారం సేకరించడం, క్రమపద్ధతిలో రచించడం, తగిన ఫోటోలు జతపరచడం, వీడియోస్ రికార్డు చేయడం,యూట్యూబ్ చానెల్ లో అప్లోడు చేయడం తదితర అంశాలపై సవివరంగా పవర్ పాయింట్ ప్రదర్శన మరియు వీడియో ప్రదర్శనల ద్వారా శిక్షణ ఇచ్చారు. ఈ శిక్షణా కార్యక్రమంలో రైతు సాధికార సంస్థ ప్రాజెక్టు ఎగ్జిక్యూటివ్ లోకేష్, న్యాచురల్ ఫార్మింగ్ అసోసియేట్ హలీమా పాల్గొన్నారు.                                                                          

Comments