నెల్లూరు (ప్రజా అమరావతి);
ప్రభుత్వ పథకాలను ప్రజలకు చేరవేయటంలో పాత్రికేయుల పాత్ర అత్యంత కీలకమ
ని, ప్రజాస్వామ్య నాలుగో స్థంభంగా అభివృద్ధి కార్యక్రమాల అనుసంధాన కర్తలుగా పాత్రికేయులు భాగస్వాములు కావాలని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్యరాష్ట్రాల అభివృద్ధి వ్యవహారాల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి పిలుపు నిచ్చారు.
సోమవారం ఉదయం భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్యర్వంలోని పత్రికా సమాచార కార్యాలయం వారు, నెల్లూరులో నిర్వహించిన వార్తాలాప్ (పాత్రికేయుల వర్క్ షాప్) కార్యక్రమానికి కేంద్ర పర్యాటక, సాంస్కృతిక మరియు ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధి వ్యవహారాల మంత్రి శ్రీ జి.కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి, కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సంధర్భంగా కేంద్ర మంత్రి శ్రీ కిషన్ రెడ్డి మాట్లాడుతూ, ఏ ప్రభుత్వమైనా ప్రజా సంక్షేమం కోసమే అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతుందని, ప్రజలకు మేలు చేసే ఉద్ధేశమే అందులో ఉంటుందని, క్షేత్ర స్థాయిలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పాత్రికేయుల చొరవతో వాటిని సరిదిద్దవచ్చని అభిప్రాయపడ్డారు. పాత్రికేయులు, పోలీసులు, రాజకీయ నాయకులకు పండుగలు, సెలవులు ఉండవని, సమాజం కోసం ఎవరి స్థాయిలో వారు ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పని చేస్తూ ఉంటారన్న ఆయన, ఈ క్రమంలో పాత్రికేయుల పాత్ర మరింత కీలకమైనదని తెలిపారు. వైద్యులు ఆరోగ్య సంరక్షణ, ఉపాధ్యాయులు విద్యాబోధన.. ఇలా ఒక్కొక్కరు తమ తమ బాధ్యతలు నిర్వహిస్తున్నా... పాత్రికేయులు మాత్రం సమాజాన్ని జాగృతం చేయటంతో పాటు, ప్రజలు - ప్రభుత్వం మధ్య వారధిగా విలక్షణమైన బాధ్యతను నెత్తిన వేసుకుని పని చేస్తారని తెలిపారు.
ప్రభుత్వ పథకాల గురించి పాత్రికేయులకు తెలియజేసే సంకల్పంతో వార్తాలాప్ కార్యక్రమాన్ని నిర్వహించిన సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పత్రికా సమాచార కార్యాలయాన్ని అభినందించిన ఆయన, ప్రభుత్వ పథకాలు ఏమున్నాయి, వాటి ద్వారా ప్రజలు ఎలా లబ్ధి పొందాలి, ఏయే డాక్యుమెంట్లు అవసరం, ఎవరు అర్హులు, లబ్ధి పొందలేని వారికి ఇతర పథకాలు ఉన్నాయా లాంటి విషయాలను తెలియజేసేందుకు పాత్రికేయులు చొరవ తీసుకోవాలని సూచించారు. విమర్శించడం ప్రజాస్వామ్యంలో అత్యంత కీలకమన్న ఆయన, తెలుసుకుని విమర్శించాలి, మంచి కార్యక్రమాలను అభినందించాలని సూచించారు. స్వచ్ఛభారత్ కార్యక్రమ విజయంలో ప్రజలు, పాత్రికేయులు పోషించిన పాత్రను ఈ సందర్భంగా ప్రస్తావించిన కేంద్ర మంత్రి, అందరూ కలిసి సానుకూల దృక్పథంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.
ఈ సందర్భంగా సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని సెంట్రల్ బ్యూరో ఆఫ్ కమ్యూనికేషన్ ప్రచురిస్తున్న పక్షపత్రిక న్యూ ఇండియా సమాచార్ గురించి శ్రీ కిషన్ రెడ్డి ప్రస్తావించారు. రాజకీయాలకు తావు లేకుండా కేంద్ర ప్రభుత్వ పథకాల వివరాలన్నింటినీ ఈ పత్రిక తెలియజేస్తుందని, ఇందులో సమాచారం తెలుసుకోవచ్చని, విమర్శించడానికి కూడా ఈ పుస్తకం పనికొస్తుందని పేర్కొన్నారు. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల విలేకర్లు మరింత జాగృతమై ఉండాలని, అక్కడి ప్రజలకు ప్రభుత్వ పథకాల వివరాల గురించి తెలియజేసి, వారి వెనుక అండగా నిలబడాలని, ఇది పాత్రికేయులే గాక, ప్రతి ఒక్కరి కనీస బాధ్యత అని పేర్కొన్నారు. ఈ సందర్బంగా ప్రధానమంత్రి సురక్ష యోజన, ప్రధానమంత్రి జన్ ధన్ యోజన, స్వచ్ఛభారత్, పిల్లలకు మధ్యాహ్న భోజన పథకం, మిషన్ ఇంద్రధనుష్, ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన్, సాయిల్ హెల్త్ కార్డ్, ప్రధానమంత్రి ఉజ్జ్వల్ యోజన వంటి పథకాల గురించి ప్రస్తావించిన ఆయన, రాజకీయలు, పార్టీలు, సిద్ధాంతాలకు అతీతంగా అభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు అందేందుకు ప్రతి ఒక్కరి చొరవ అవసరమని పేర్కొన్నారు. ఈ దిశగా అభివృద్ధిని ప్రోత్సహించే పాత్రికేయానికి పెద్ద పీట వేయాలని సూచించారు.
శిక్షణా ఐ.ఎ.ఎస్. అధికారిణి కుమారి విద్యాధరి మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ప్రభుత్వ పధకాలను ప్రజల వద్దకు తీసుకెళ్లడానికి, ప్రజల అభిప్రాయాలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడానికి పత్రికలు ఒక వారధిగా పనిచేస్తాయన్నారు. నేడు సమాజంలో మీడియా రంగంలో ముఖ్యంగా సోషల్ మీడియాలో అసత్య వార్తలతో కూడిన సమాచారం శరవేగంతో ప్రసారం అగుచున్నదని, వాటి పట్ల జాగ్రత్త పడాల్సిన అవసరం వుందన్నారు. వార్తను వార్తగానే ప్రచురించాలి లేదా ప్రసారం చేయాలి గాని, తన అభిప్రాయాన్ని తెల్పరాదని అన్నారు. ఈ రోజు భారత ప్రభుత్వ సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ ఆధ్యర్వంలోని నెల్లూరులో పత్రికా సమాచార కార్యాలయం వారు నిర్వహిస్తున్న ఈ వర్క్ షాప్ కార్యక్రమాన్ని జిల్లా పాత్రికేయులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
అనంతరం కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అమలు చేస్తున్న పలు పధకాలు, సంక్షేమ కార్యక్రమాల వివరాలను పాత్రికేయులకు అవగాహన కల్పిస్తూ వర్క్ షాప్ నిర్వహించడం జరిగింది.
ఈ కార్యక్రమంలో శాసన మండలి సభ్యులు శ్రీ వాకాటి నారాయణ రెడ్డి, ఆర్.డి.ఓ శ్రీ మాలోల, జిల్లా మైనారిటీ సంక్షేమ శాఖ అధికారి శ్రీమతి కనక దుర్గా భవానీ, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి శ్రీ ఎం. వేంకటేశ్వర ప్రసాద్, పి.ఐ. బి అధికారులు శ్రీ అలెగరి, శ్రీ ఎం.వి రాజు, శ్రీ శ్రీరామ్, ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ జర్నలిస్ట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ జయప్రకాష్ సహా జిల్లాకు చెందిన పలువురు పాత్రికేయులు పాల్గొన్నారు.
addComments
Post a Comment