జనవరి 27న స్త్రీనిధి మేనేజింగ్ కమిటీ ఎన్నికలు

 



విజయవాడ (ప్రజా అమరావతి);


*జనవరి 27న స్త్రీనిధి మేనేజింగ్ కమిటీ ఎన్నికలు*


*21 జనవరి 2023న నామినేషన్ల స్వీకరణ, 22న నామినేషన్ పత్రాల ఉపసంహరణ*


*27 జనవరి 2023 న పోలింగ్, 28న ఓట్ల లెక్కింపు.. అనంతరం ఎన్నికల ఫలితాల ప్రకటన*


విజయవాడ అర్బన్ స్త్రీనిధి పరపతి సహకార సమాఖ్య లిమిటెడ్ కు 27 జనవరి, 2023న ఎన్నికలు జరుగనున్నాయని ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.కిరణ్ కుమార్ వెల్లడించారు. ఈ మేరకు ఎన్నికల నోటీసు, ఓటర్ల జాబితా విడుదల చేయడం జరిగిందన్నారు. 


 30 మంది పాలకవర్గ సభ్యులకు గాను 26 మంది రూరల్ సమాఖ్యల నుండి, నలుగురిని  అర్బన్ సమాఖ్యల నుండి ఎన్నుకొనుటకు రహస్య ఓటింగ్ పద్దతిలో ఎన్నికలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఎన్టీఆర్ జిల్లా విజయవాడ గొల్లపూడిలోని టి.టి.డి.సి, పి.డి.డి.ఆర్.డి.ఎ నందు 21 జనవరి 2023 ఉదయం 10  గంటల నుండి  సాయంత్రం 4  గంటల వరకు ఎన్నికలకు సంబంధించిన నామినేషన్లు స్వీకరించనున్నామన్నారు. అదే రోజు సాయంత్రం 4 గంటల నుండి నామినేషన్ పత్రాలను పరిశీలించి సక్రమంగా ఉన్న వారి జాబితా ప్రకటిస్తామన్నారు.  22 జనవరి 2023 ఉదయం 11 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు నామినేషన్ పత్రాల ఉపసంహరణ అనంతరం వెంటనే తదుపరి పోటిలో ఉన్న అభ్యర్థుల జాబితా ప్రకటించి వారికి చిహ్నాలు కేటాయించనున్నామన్నారు. మొత్తం స్థానాలకు మించి నామినేషన్లు దాఖలు కాని సందర్భంలో ఏకగ్రీవంగా ఎన్నికైన అభ్యర్థుల పేర్లను అదే రోజు ప్రకటిస్తామన్నారు.  పోటీ ఉన్న సందర్భంలో 27 జనవరి 2023 ఉదయం 8 గంటల నుండి మధ్యాహ్నం 1  గంటల వరకు రాష్ట్రంలోని  26 జిల్లాల పథక సంచాలకులు, డి.ఆర్.డి.ఎ. కార్యాలయం ఆవరణ నందు ఆ జిల్లాకు సంబంధించిన రూరల్ సమాఖ్యకు మరియు అర్బన్ సమాఖ్యకు కలిపి ఒకే ప్రదేశములో  విడివిడిగా పోలింగ్ జరుగనుందని తెలిపారు. 28 జనవరి 2023 మధ్యాహ్నం 1 గంటలకు టి.టి.డి.సి-గొల్లపూడి, పి.డి.డి.ఆర్.డి.ఎ- ఎన్టీఆర్ జిల్లా  కార్యాలయంలో ఓట్ల లెక్కింపు ప్రారంభించి పూర్తైన వెంటనే ఎన్నికల ఫలితాలు ప్రకటించి 30 జనవరి 2023న ఉదయం 9 గంటల నుండి కార్య నిర్వాహక (ఆఫీస్ బారర్స్) సభ్యుల ఎన్నిక కార్యక్రమం జరుపనున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి పి.కిరణ్ కుమార్ తెలిపారు.



Comments