నెల్లూరు (ప్రజా అమరావతి);
తెలుగు ప్రజల కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి పొట్టి శ్రీరాములు
అని, వారి త్యాగం మనందరికి స్ఫూర్తిదాయకమని జిల్లా కలెక్టర్ శ్రీ కె.వి.ఎన్. చక్రధర్ బాబు పేర్కొన్నారు.
గురువారం ఉదయం కలెక్టరేట్ లోని తిక్కన ప్రాంగణంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి జయంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సంధర్భంగా జిల్లా కలెక్టర్ శ్రీ చక్రధర్ బాబు మాట్లాడుతూ, మన జిల్లా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాగా పిలువబడుచున్నదని, ఆ మహనీయుని పేరుతో మన జిల్లా పిలవబడటం, మన జిల్లా వాసులు కావడం మనందరికీ గర్వకారణమన్నారు. ఈ రోజు అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి సంధర్భంగా ఘన నివాళులు ఆర్పిస్తూ, ఆయన జీవిత చరిత్రలో ఎన్నో అంశాలను మనం తెలుసుకున్నామన్నారు. ఆయన నమ్మిన సిద్దాంతాలను, ఆయన ప్రాణత్యాగం చేసిన పరిస్థితులను మనం ఎప్పటికీ గుర్తుపెట్టుకోవాలన్నారు. సత్యం, అహింసా వంటి మార్గాలను ఆచరిస్తూ ఎంతో మంది మహనీయులు స్వాతంత్ర్య సమరంలో ప్రాణత్యాగం చేయడం జరిగిందని, వారి జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవడంతో పాటు భావితరాలకు తెలియచేయాలన్నారు. మహాత్మా గాంధీ గారు చూపించిన మార్గంలో అమరజీవి పోటీ శ్రీరాములు గారు పయనించి స్వాతంత్ర్య సమరంలో ఎన్నో ఉద్యమాల్లో, కార్యక్రమాల్లో పాల్గొని స్వాతంత్ర్య సమరయోధుల జాబితాలో చేరిన మహనీయులు అమరజీవి పొట్టి శ్రీరాములు అని అన్నారు. ఆంధ్ర రాష్ట్రం కోసం ఆయన ప్రాణత్యాగం చేసి దేశ వ్యాప్తంగా కూడా భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు నాంధి పలికారన్నారు. దేశంలో 145 కోట్ల జనాభా వుండి కూడా ఎక్కడా ఎలాంటి గొడవలు లేకుండా శాంతి సౌబ్రాతృత్వం, సోదర భావంతో జీవించగలుచున్నామన్నారు. అటువంటి దేశాన్ని అందించిన మహనీయులందరి ఆశయాలను ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలన్నారు. ముఖ్యంగా యువత దేశం కోసం కొంతైనా త్యాగం చేసే పరిస్థితి రావాలన్నారు. శ్రీ పొట్టి శ్రీరాములు గారి అంకితభావం, ఉపవాస సామర్ధ్యం చూసి శ్రీ పొట్టి శ్రీరాములు లాంటి వారు 11 మంది అనుచరులు ఉంటే కేవలం ఒక్క సంవత్సరంలోనే స్వాతంత్ర్యాన్ని సాధించవచ్చు అని మహాత్మాగాంధి గారు అన్నారంటే చాలా గొప్ప విషయం అని అన్నారు. స్వాతంత్ర్యాన్ని సాధించి 75 సంవత్సరాలు దాటిందని, ఆ స్ఫూర్తిని మర్చిపోకుండా నేటి యువత దేశం గర్వించదగ్గ పౌరులుగా సత్ప్రవర్తనతో మెలగాలని ఆకాంక్షిస్తూ అందరికీ మరొకసారి అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి శుభాకాంక్షలు తెలుపుతున్నానని కలెక్టర్ అన్నారు.
ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శ్రీ ఆర్.కూర్మనాథ్, జిల్లా పర్యాటక శాకాధికారి శ్రీమతి కనక దుర్గా భవానీ, ఎపిఎంఐపి పిడి శ్రీ శ్రీనివాసులు, కలెక్టరేట్ సిబ్బంది, వివిధ శాఖల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment