*దేశంలో త్వరలో రైతుల తుఫాన్ రాబోతున్నది.. దాన్నెవరూ ఆపలేరు : కాందార్ లోహ సభలో సీఎం కేసీఆర్*
కాందార్ లోహ (ప్రజా అమరావతి);
దేశంలో త్వరలో రైతుల తుఫాన్ రాబోతున్నదని, దాన్నెవరూ ఆపలేరని బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ ముఖ్రమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు అన్నారు. మహారాష్ట్ర కాందార్ లోహలో జరిగిన బీఆర్ఎస్ పబ్లిక్ మీటింగ్లో సీఎం కేసీఆర్ పాల్గొని మాట్లాడారు. ఈ సందర్భంగా పలువురు పార్టీలో చేరగా.. వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘ఛత్రపతి శివాజీ మహరాజ్కు జన్మనిచ్చిన మరాఠా పుణ్యభూమికి ప్రణామం. పార్టీలో చేరుతున్న నేతలకు హృదయపూర్వక స్వాగతం. లోహ సబకు తరలివచ్చిన ప్రజలు, రైతులకు ధన్యవాదాలు. నాందేడ్ వాసుల ప్రేమ కారణంగా ఇక్కడే రెండో సభ నిర్వహిస్తున్నాం. దేశంలో త్వరలో తుఫాన్ రాబోతోంది. దాన్నెవరూ ఆపలేరు. కేసీఆర్కు ఇక్కడేం పని అని మాజీ సీఎం ఫడ్నవీస్ అంటున్నారు. భారత పౌరుడిగా ప్రతీ రాష్ట్రానికి వెళ్తా. తెలంగాణలో రైతుబంధు, 24 గంటలు కరెంటు అందిస్తున్నాం.
అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్రలో దళితబంధు అమలు చేయాలి..
తెలంగాణలో ఎకరానికి రూ.10వేలు ఇస్తున్నాం. తెలంగాణలో రైతులకు రూ.5లక్షల రైతుబీమా ఇస్తున్నాం. పూర్తిగా పంట కొంటున్నాం. తెలంగాణ తరహా అభివృద్ధి ఫడ్నవీస్ చేస్తే నేను మహారాష్ట్ర రానని ప్రకటిస్తున్నా. తెలంగాణ తరహా పథకాలు మహారాష్ట్రలో అమలు చేయనంత వరకు నేను వస్తూనే ఉంటా. మహారాష్ట్రలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. తెలంగాణలో దళితబంధు ఇస్తున్నాం. మహారాష్ట్రలోనూ దళితబంధు అమలు చేస్తేను రానని ప్రకటిస్తున్నా. అంబేద్కర్ పుట్టిన మహారాష్ట్రలో దళితబంధు అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నా. మహారాష్ట్ర రైతుల సమస్యలు పరిష్కరించండి నేను మహారాష్ట్ర రాను. స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు పూర్తయినా పేదల బతుకులు మారలేదు. కాంగ్రెస్, బీజేపీలతో మన బతుకులు మారాయా?. రెండు పార్టీల పాలనలో రైతుల పరిస్థితి ఎందుకు మారలేదు ? నేను చెప్పేది నిజమో అబద్ధమో మీరో ఆలోచించండి.
మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి నీరందిస్తాం..
అమెరికా, చైనా కంటే నాణ్యమైన భూమి మనకు ఉంది. కాంగ్రెస్ 54 సంవత్సరాలు, బీజేపీ 14 ఏళ్లు పాలించి ఏం చేశాయి? ఏటా 50వేల టీఎంసీల నీరు సముద్రం పాలవుతోంది. మహారాష్ట్రలో పుట్టే కృష్ణా, గోదావరి నిధులు ఉన్నా రైతులకు ఎందుకు మేలు జరుగట్లేదు? మహారాష్ట్రలో సాగు, తాగునీరు చాలాచోట్ల అందుబాటులో లేదు. మన కండ్ల ముందే నీరు సముద్రంలో కలిసిపోతుంది. ఎంత మంది పాలకులు మారినా ప్రజల తలరాతలు మారలేదు. నేతలు తలచుకుంటే దేశంలో ప్రతి ఎకరాకు నీరు ఇవ్వొచ్చు. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి సాగునీరు అందిస్తాం. మహారాష్ట్రలో ప్రతి ఎకరానికి రూ.10వేలు ఇచ్చే వరకు కొట్లాడుతాం. దేశంలో సమృద్ధిగా సహజ వనరులున్నాయి. దేశంలో 360 బిలియన్ టన్నుల బొగ్గు ఉంది. దేశంలో ఉన్న బొగ్గుతో 24 గంటలు సులభంగా విద్యుత్ సులభంగా ఇవ్వొచ్చు. 125 ఏళ్ల పాటు విద్యుత్ ఇచ్చేంత బొగ్గు మన దగ్గర ఉంది. అయినా ఎందుకు విద్యుత్ ఇవ్వలేకపోతున్నారు. పీఎం కిసాన్ కింద కేంద్రం కేవలం రూ.6వేలు మాత్రమే ఇస్తుంది. పీఎం కిసాన్ కింద రైతులకు కనీసం రూ.10వేలు ఇవ్వాలి. ఉల్లి, చెరుకు రైతులు ధరల కోసం ఏటా పోరాడాల్సిందేనా? ఇది రాజకీయ సభ కాదు. బతుకులపై ఆలోచన సభ. యూపీ, పంజాబ్లో నేతల మాయమాటలకు మోసపోయాం’ అన్నారు.
addComments
Post a Comment