హిందూ ధర్మ ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకి చాటి చెప్పే విధంగా యాగం నిర్వహణ.



విజయవాడ (ప్రజా అమరావతి);


*విజయవంతంగా మూడో రోజు అష్టోత్తర శత (108) కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం*


*శ్రీ మహాలక్ష్మి అమ్మవారిని పూజించడం వల్ల రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో ఉంటారు*


*హిందూ ధర్మ ఔన్నత్యాన్ని భవిష్యత్ తరాలకి చాటి చెప్పే విధంగా యాగం నిర్వహణ



*రేపు సాయంత్రం శ్రీశైల భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్ల దివ్య‌ కళ్యాణోత్సవం* 


*అమ్మవారికి కుంకుమార్చన చేసిన పసుపు, కుంకుమ, గాజులు మహిళా భక్తులకు ఉచితంగా పంపిణీ*


*ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ*


రాష్ట్ర ప్రజలంతా సుఖసంతోషాలతో వర్ధిల్లాలని, రాష్ట్రంలో అభివృద్ధి వేగవంతంగా జరగాలని, లోక కళ్యాణం హితార్థం సంకల్పించి ముఖ్యమంత్రి శ్రీ.వై.ఎస్. జగన్ మోహన్ రెడ్డి మహాయజ్ఞానికి శ్రీకారం చుట్టారని ఉపముఖ్యమంత్రి, రాష్ట్ర దేవదాయ, ధర్మదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు. రాష్ట్ర చరిత్రలో ఇటువంటి అష్టోత్తర శత (108) కుండాత్మక చండీ, రుద్ర, రాజశ్యామల, సుదర్శన సహిత శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ఎప్పుడూ జరగలేదని, రాష్ట్రం కోసం ఇలాంటి మంచి కార్యక్రమం చేయడం తమకు ఆనందంగా ఉందన్నారు.


ఈ సందర్భంగా ఇందిరా గాంధీ మున్సిపల్ స్టేడియంలోని యజ్ఞ వాటిక ప్రాంగణం వద్ద ఏర్పాటు చేసిన మీడియా పాయింట్ లో పాత్రికేయులతో మంత్రి మాట్లాడుతూ శ్రీలక్ష్మీ మహాయజ్ఞం ప్రజలందరి సహకారంతో విజయవంతంగా మూడో రోజుకు చేరిందన్నారు. వేద మంత్రోచ్ఛరణతో, శాస్త్రోక్తంగా ఆగమ నియమానుసారం రుత్వికులు చాలా సమర్థవంతంగా యాగం నిర్వహిస్తున్నారన్నారు. ఇప్పటివరకు 4 యాగశాలల్లో 600కు పైగా వేద పండితులు నాలుగు వేదాలను పఠించడం విశేషమన్నారు. రేపు సాయంత్రం శ్రీశైల శ్రీ భ్రమరాంబ మల్లిఖార్జున స్వామివార్ల దివ్య‌ కళ్యాణోత్సవం జరుగనుందన్నారు. 


ప్రతిరోజూ అమ్మవారికి కుంకుమార్చన చేసిన పసుపు, కుంకుమ, గాజులను ఈ యాగాన్ని సందర్శించడానికి వచ్చే మహిళా భక్తులకి యజ్ఞ ప్రసాదంగా ఉచితంగా అందజేస్తున్నామన్నారు. యజ్ఞాన్ని తిలకించేందుకు భక్తులకు ఎటువంటి పాసులు అవసరం లేదని..భక్తులకు యాగశాలలో అన్ని రకాల ఏర్పాట్లు చేశామన్నారు.  భక్తులు  యాగశాలను దర్శించుకుని, తీర్థప్రసాదాలు స్వీకరించి తరించాలని డిప్యూటీ సీఎం, రాష్ట్ర దేవదాయ, ధర్మాదాయ శాఖ మాత్యులు కొట్టు సత్యనారాయణ సూచించారు. 


క్రతువులో భాగంగా సప్త నదీ జలాలతో, మూడు సముద్ర జలాలతో, మానససరోవరం నుండి ప్రత్యేకంగా తెప్పించిన జలంతో శ్రీ లక్ష్మీ అమ్మ వారికి విశేష అభిషేకాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ యాగం నిర్వహించడం వల్ల భక్తులకు సకల బాధలు తొలగిపోతాయని ఆకాంక్షించారు. సుదర్శన హోమం ద్వారా ప్రజలంతా ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉంటారన్నారు. 

ఎవరూ ఊహించని విధంగా పురాణ, ఇతిహాసాలలో మునులతో అలనాటి మహారాజులు నిర్వహించే మహా యజ్ఞ కార్యక్రమాన్ని దేవదాయ, ధర్మదాయ శాఖ నిర్వహించడం గొప్ప విషయం అని మంత్రి తెలిపారు. 


యజ్ఞయాగాదులను స్వయంగా తిలకించడంతో భక్తులు భక్తి పారవశ్యంలో మునిగారన్నారు.  ఇటువంటి  మహాభాగ్యాన్ని చూసే అదృష్టాన్ని కల్పించిన రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ. వై. ఎస్ జగన్ మోహన్ రెడ్డికి కృతజ్ఞతలు తెలుపుతున్నారన్నారు. ఈ మహా యజ్ఞంలో దేవదాయశాఖ అధికారులు, రెవెన్యూ, పోలీస్, నగరపాలక సంస్థ, విద్యుత్, ఫైర్ ఇలా అన్ని శాఖల నుంచి సహకారం అందడం తమ అదృష్టంగా భావిస్తున్నామన్నారు.


తమిళనాడు నుండి వచ్చిన రుత్వికులతో వారి ఆచారం మేరకు కొన్ని కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు.  550 మందికి పైగా రుత్వికులు, వారికి సహాయంగా 300 మంది యజ్ఞంలో పాల్గొన్నారన్నారు. యాగశాలకు అనుసంధానం చేస్తూ 32 మంది సన్నాయి, డోలు వాయిద్య కళాకారులు వారి సహకారం అందిస్తున్నారన్నారు. 


సాయంత్రం నిర్వహించే కార్యక్రమంలో కొద్ది మార్పులు చేశామన్నారు. సాయంత్రం 5 గంటల నుండి 6:30 గంటల వరకు సాంస్కృతిక కార్యక్రమాలు, 6:30 నుండి 7:30 వరకు ప్రవచనాలు, 7:30 నుండి స్వామి అమ్మవార్ల కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తామన్నారు.


ఈ సమావేశంలో దేవదాయ, ధర్మాదాయ శాఖ కమిషనర్ ఆర్. సత్యనారాయణ, వేదాంత రాజగోపాల చక్రవర్తి, దుర్గగుడి ఈవో భ్రమరాంబ తదితరులు పాల్గొన్నారు.


Comments