అర్హులకు సంక్షేమం అందజేయడంలో వాలంటీర్ల పాత్రే కీలకం.



*అర్హులకు సంక్షేమం అందజేయడంలో వాలంటీర్ల పాత్రే కీలకం.


*ఉత్తమ గ్రామ/వార్డు వాలంటీర్లకు సేవా పురస్కారాల ప్రధానం.

*జిల్లాలో 9560 మంది వాలంటీర్లకు సేవా పురస్కారాలు.


-జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున



విశాఖపట్నం, మే 19 (ప్రజా అమరావతి): ప్రభుత్వ పథకాలు అందించడంలో వాలంటీర్ వ్యవస్థ కీలకపాత్ర వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  వెల్లడించారు. శుక్రవారం ఉదయం  విజయవాడ ఎ ప్లస్ కన్వెన్షన్ సెంటర్లో  వార్డు, గ్రామ వాలంటీర్ల సేవలకు వజ్ర, రత్న, మిత్ర సేవా అవార్డులు అందజేతకు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన సభలో రాష్ట్ర ముఖ్యమంత్రి వై.యస్. జగన్ మోహన్ రెడ్డి పాల్గొనగా, జిల్లాలో స్ధానిక  విఎమ్ఆర్డీఏ చిల్డ్రన్ ఎరీనాలో ఉత్తమ సేవలందించిన గ్రామ, వార్డు సచివాలయాల వాలంటీర్ల సత్కార సభ ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని ప్రత్యక్ష ప్రసారం ద్వారా వీక్షించిన అనంతరం గ్రామ, వార్డు వాలంటీర్లకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురష్కారాలతో ఘనంగా సత్కరించారు.


ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ డా.ఎ.మల్లిఖార్జున  మాట్లాడుతూ అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ పథకాలు అందించడంలో వాలంటీర్లే కీలకపాత్ర పోషిస్తున్నట్లు చెప్పారు.   గ్రామ, వార్డు వాలంటీర్లు చేస్తున్న సేవలకు ప్రభుత్వం వజ్ర, రత్న, మిత్ర సేవా అవార్డులు అందిస్తున్నట్లు వివరించారు. గ్రామ, వార్డులలో లబ్ధిదారులను గుర్తించడం చాలా రోజులు పడుతుందని వాలంటీర్ వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను గుర్తించడం చాలా సులువు అవుతుందన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించి అర్హత కలిగిన జాబితా త్వరితగతిన రూపొందించడం జరుగుతుందని, అందుకు ప్రధాన కారణం ఈ సచివాలయ వ్యవస్థేనన్నారు. కోవిడ్ కష్టకాలంలో  సర్వేలను  నిర్వహించడంలో, రోగులను  ఆసుపత్రిలో  చేర్పించడంలో  వాలంటీర్లు  గణనీయమైన  సేవలు  అందించారని  అన్నారు. వాలంటీర్ పదానికి అర్ధం చేకూరేలా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వాలంటీర్ సేవలు ప్రస్తుతం అందిండమే కాకుండా భవిష్యత్తులో కూడా ప్రజలలో తమ పట్ల ఆదరణ, గౌరవం  పెరిగే దిశగా అడుగులు వేయాలన్నారు. 

జిల్లాలో  గల 607 గ్రామ, వార్డు సచివాలయాల్లో గాను 9422 మందికి సేవా మిత్ర, 107 మందికి సేవ రత్న, 31 మందికి సేవా వజ్ర, మొత్తం 9,560 మందికి  ఉగాది పురస్కారాలు అందించి సత్కరించేందుకు జిల్లా కమిటీ ఎంపిక చేసినట్లు తెలిపారు.  జిల్లాలో 4 మండలాల్లో   4 మందికి సేవా వజ్ర, 20 మందికి సేవా రత్న, 872 మందికి సేవా మిత్ర, అలాగే జిల్లాలో ఉన్న 7జోన్లలో  27 మందికి సేవా వజ్ర, 87 మందికి సేవా రత్న, 8550 మందికి సేవా మిత్ర పురస్కారాలకు ఎంపికైనట్లు వివరించారు. సేవా మిత్ర (రూ.10,000 నగదు, దృవపత్రం, మెడల్, శాలువా)  , సేవారత్న (రూ.20,000 నగదు, దృవపత్రం, మెడల్, శాలువా) ,  సేవా వజ్ర (రూ.30,000 నగదు, దృవపత్రం, మెడల్ , శాలువా)  ఇచ్చి సత్కరించడం జరుగుతుందన్నారు. వాలంటీర్లు అందించే సేవలు చిత్తశుద్ధితో అందించాలని స్పష్టం చేశారు.  మండల, జోనల్ స్ధాయిలో నేటి  నుండి 10రోజుల పాటు ప్రతి సచివాలయము పరిథిలో స్థానిక శాసనసభ్యుల మరియు ప్రజా ప్రతినిధుల చేతుల మీదుగా ఈ కార్యక్రమము నిర్వహించడం జరుగుతుందన్నారు. 


జీవియంసి కమీషనర్ సిఎం సాయికాంత్ వర్మ మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా వాలంటీర్ వ్యవస్థ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. 2019 ఆగస్టు నుండి వాలంటీర్ వ్యవస్థ అందుబాటులోకి వచ్చిందని, ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిలా విధులు నిర్వహిస్తున్నారన్నారు. వారు చేసిన సేవలకు సేవా మిత్ర, సేవా రత్న, సేవా వజ్ర పురష్కారాలతో ప్రభుత్వం సన్మానిస్తుననట్లు పేర్కొన్నారు. వాలంటీర్ లు నాణ్యమైన సేవలు అందిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రభుత్వ కార్యక్రమాలు క్షణాల్లో చేరుటకు, సమాచారం చేరవేయడానికి వ్యవస్థ చక్కగా పనిచేస్తుందని అన్నారు. వాలంటీర్ల  వ్యవస్థను  ఇతర రాష్ట్రాలు  కూడా ప్రశంసిస్తున్నాయని  అన్నారు.  


ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆలోచనలకు అనుగుణంగా పారదర్శకంగా ప్రభుత్వ పథకాలు అందించడంలో వాలంటీర్లు గురుతర బాధ్యత పోషిస్తున్నారని పేర్కొన్నారు. ప్రభుత్వం అప్పగించిన బాధ్యతను మరింత బాధ్యతగా పనిచేయాలన్నారు. వాలంటీర్లకు అభినందనలు తెలిపారు. సేవ చేయడం వల్ల సమాజంలో గౌరవం లభిస్తుందని అన్నారు. మరిన్ని సేవలు అందించాలని ఆమె కోరారు. అంకితం భావంతో విధులు నిర్వహించి ప్రభుత్వానికి మంచి పేరు అందిస్తున్న అందరికీ అభినందనలు తెలియజేశారు.  


గాజువాక నియోజకవర్గ శాసనసభ్యులు తిప్పల నాగిరెడ్డి మాట్లాడుతూ  రాష్ట్ర ముఖ్యమంత్రి ఒక గొప్ప మానవతావాది అని కొనియాడారు. ప్రభుత్వ పథకాలు పేదవారి ఇళ్లకు చేరే విధంగా ఉండాలని, ఆ వ్వవస్థే వాలంటీర్ వ్యవస్థని చెప్పారు. అవినీతిలేని వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థ అని దీనిని కొనసాగించు కోవాలన్నారు. ప్రజలకు అత్యుత్తమ సేవలు అందించిన వాలంటీర్లకు సేవా వజ్ర, సేవ రత్న, సేవా మిత్ర పురస్కారాలు అందజేయడం చాలా సంతోషంగా ఉందన్నారు. వాలంటీర్లు   ఎలాంటి బంధుప్రీతి, పక్షపాతం  లేకుండా  ప్రభుత్వ పథకాలను  ప్రజలకు  చేరవేస్తున్నారని  తెలిపారు.


ఈ కార్యక్రమంలో గ్రామ, వార్డు సచివాలయాల జిల్లా ఇన్ చార్జ్ పూర్ణిమ దేవి, డిప్యూటి మేయర్ జియ్యాని శ్రీధర్, నెడ్ క్యాప్ చైర్మన్ కె.కె.రాజు, డిసియంఎస్ చైర్ పర్సన్ పల్లా చిన్నతల్లి, కార్పొరేటర్లు, పలు కార్పొరేషన్ల చైర్మన్లు, అధికారులు, సచివాలయ సిబ్బంది, అధిక సంఖ్యలో వాలంటీర్లు పాల్గొన్నారు. 



Comments