గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో వచ్చిన ప్రాజెక్టులు పెద్ద ఎత్తున కార్యరూపం దాల్చాయి...
387 యంఓయుల్లో ఇప్పటికే 14 ప్రాజెక్టులు ప్రారంభం.
* మరో 106 ప్రాజెక్టులు నిర్మాణం/గ్రౌండింగ్ దశలో
* జూన్,జూలై మాసాల్లో మరో 28 ప్రాజెక్టులు గ్రౌండింగ్ లేదా ప్రారంభానికి సిద్ధం.
* జూన్ 22న 6 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్ గా ప్రారంభోత్సవం, శంఖుస్థాపన చేస్తారు.
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి.
విజయవాడ,19 జూన్ (ప్రజా అమరావతి):మార్చి 3,4 తేదీల్లో విశాఖపట్నంలో జరిగిన గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్(ప్రపంచ పెట్టుబడి దారుల సదస్సు)లో వివిధ కంపెనీలతో చేసుకున్న అవగాహనా ఒప్పందాలలో చాలా వరకు కార్యరూపం దాల్చాయని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.కెఎస్.జవహర్ రెడ్డి వెల్లడించారు గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో చేసుకున్న ఒప్పందాలపై తీసుకుంటున్న తదుపరి చర్యలపై సోమవారం విజయవాడలోని సిఎస్ క్యాంపు కార్యాలయంలో ఆయన సంబంధిత కార్యదర్శులతో సమీక్షించారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్లో వివిధ కంపెనీలతో 13 లక్షల 12వేల 120 కోట్ల రూ.ల విలువతో 6క్షల 5వేల 733 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే లక్ష్యంతో మొత్తం 387 అవగాహనా ఒప్పందాలను చేసుకోవడం జరిగిందన్నారు. వీటికి సంబంధించి ఇప్పటికే 2వేల 749 కోట్ల వ్యయంతో 7వేల 108 మందికి ఉపాధి కల్పించే 14 ప్రాజెక్టులను ప్రారంభించుకోవడం జరిగిందన్నారు.
3 లక్షల 77 వేల 476 కోట్ల రూపాయల విలువతో కూడి 2లక్షల 13వేల 513 మందికి ఉపాధిని కల్పించే మరో 106 యంఓయులకు సంబంధించిన ప్రాజెక్టులు చురుగ్గా నిర్మాణ, గ్రౌండింగ్ దశలో ఉన్నట్టు సిఎస్ జవహర్ రెడ్డి తెలిపారు.కాగా మిగతా ప్రాజెక్టులన్నీ అనుమతులు,భూకేటాయింపు,డిపిఆర్ తయారీ వంటి దశల్లో ఉన్నాయని చెప్పారు.
కాగా జూన్ జూలై మాసాల్లో లక్షా 93వేల 150 కోట్ల వ్యయంతో కూడి లక్షా 17వేల 937 మందికి ఉపాధిని కల్పించే మరో 28 ప్రాజెక్టులు గ్రౌండింగ్ లేదా ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్టు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా.జవహర్ రెడ్డి వెల్లడించారు.
ఈనెల 22వ తేదీన 1775 కోట్ల రూపాయల విలువతో కూడి 1230 మందికి ఉపాధిని కల్పించే 6 ప్రాజెక్టులను ముఖ్యమంత్రి వర్యులు వర్చువల్ విధానంలో ప్రారంభోత్సవం,శంఖుస్థాపన చేయనున్నారని తెలిపారు.అవి పశ్చిమ గోదావరి జిల్లాలో గోడ్రజ్ ఆగ్రోవెట్ లిమిటెడ్, కృష్ణా జిల్లాలో సుక్సుమా గామా ఎల్ఎల్పి,తిరుపతి జిల్లాలో సిసిఎల్ ఫుడ్ అండ్ బేవరేజెస్, శ్రీకాకుళం జిల్లాలో నాగార్జున అగ్రికెం,ఎస్పిఎస్ నెల్లూరు జిల్లాలో క్రిబ్కో,విశ్వ సముద్ర ప్రాజెక్టులు ఉన్నాయని సిఎస్ తెలిపారు.
యంఓయు చేసుకున్న వివిధ ప్రాజెక్టులన్నీ నిర్దిష్ట గడువు ప్రకారం గ్రైండింగ్ ప్రక్రియ చేపట్టి సకాలంలో ప్రారంభించేందుకు వీలుగా చర్యలు తీసుకోవాలని ఆయా శాఖల కార్యదర్శులను ఆదేశించారు.
ఈసమావేశానికి వీడియో లింక్ ద్వారా ప్రత్యేక ప్రధాన కార్యదర్శులు రజత్ భార్గవ, కె.విజయానంద్,జి.సాయి ప్రసాద్, గోపాలకృష్ణ ద్వివేది, కార్యదర్శి కె.శశిధర్ పాల్గొన్నారు.ఇంకా ఈసమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎస్ ఎస్.రావత్,స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి వినోద్ కుమార్,నెడ్ క్యాప్ ఎండి రమణారెడ్డి,పుడ్ ప్రోసెసింగ్ సిఇఓ ఎల్.శ్రీధర్ రెడ్డి,పరిశ్రమల శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
addComments
Post a Comment